భీమ్గల్, వేల్పూర్ ఆగస్టు 17: కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సూచించారు. గురువారం ఆయన భీమ్గల్, వేల్పూర్ మండలాల్లో పర్యటించారు. భీమ్గల్ మండలం మెండోరా గ్రామం నుంచి ప్రముఖ పుణ్య క్షేత్రం లింబాద్రి గుట్ట వరకు రూ. 4.30కోట్లతో బీటీ రోడ్డు, చేంగల్ నుంచి ఎన్హెచ44 వరకు రూ.18.50 కోట్లతో చేపట్టనున్న (వయా చింతలూరు సింగిల్ లైన్ నుంచి డబుల్ లైన్) బీటీ రోడ్డు, వేల్పూర్ మండల పచ్చల నడ్కుడ నుంచి వాడి వరకు రూ.4.15 కోట్లతో చేపట్టనున్న డబుల్ లైన్ బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు. అభివృద్ధి పనులు అందరికీ కనిపిస్తున్నాయన్నారు. గతంలో.. గడిచిన ఈ తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధిని పోల్చి చూడాలని కోరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రైతులకు మూడు గంటల కరెంట్ చాలు అంటున్నాడని, పొరపాటున వారు అధికారంలోకి వస్తే రైతులకు మళ్లీ పాత రోజులు పునరావృతం అవుతాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదని, ఇప్పుడేమో అధికారం కోసం అమలుకు నోచుకోని హామీలను ఇస్తూ ప్రజలను మభ్య పెడుతున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో మన సంక్షేమ పథకాలు ఎందుకు లేవని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో పెన్షన్ రూ.500 మాత్రమే ఉందని, మన రాష్ట్రంలో రూ.2,016 ఇస్తున్నామని తెలిపారు. ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే 62వేల మందికి ఆసరా పెన్షన్ ఇస్తున్నామన్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా 26వేల మంది బీడీ కార్మీకులకు పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో అమలుచేయకుండా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చేస్తామంటే ఎలా నమ్ముతామన్నారు. రైతును ఇబ్బందులకు గురిచేసిన కాంగ్రెస్ను నమ్మితే గోసపడతామని అన్నారు.
అభివృద్ధిని పట్టించుకోని అర్వింద్
ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తా అని రైతులను నమ్మించి గెలిచిన ఎంపీ అర్వింద్ ఏం అభివృద్ధి చేశాడని ప్రశ్నించారు. ఆయనకు కేసీఆర్, తమను తిట్టాడానికి సమయం సరిపోతుందని ఎద్దేవా చేశారు. దేశం, ధర్మం కోసమంటూ దేశాన్ని అధోగతిపాలు చేస్తున్నారని మండిపడ్డారు. మతం పేరిట యువతను రెచ్చగోడుతూ దుర్మార్గపు రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల నుంచి తెలంగాణ పొలాల్లో నాట్లు వేయాలనికి కూలీలు వస్తున్నారని తెలిపారు. అది తెలంగాణ సాధించిన అభివృద్ధి అని పేర్కొన్నారు. యూపీ, బిహార్ వంటి రాష్ర్టాల్లో ఉపాధి లేక పనికోసం మన రాష్ర్టానికి వస్తున్నారని, ఇది తెలంగాణ ప్రగతిని అన్నారు. సీఎం కేసీఆర్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని మరోసారి స్పష్టం చేశారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న సీఎం కేసీఆర్కు అండగా నిలువాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్రెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ రాజేశ్వర్ రెడ్డి, ఆర్డీవో వినోద్ కుమార్, ఎంపీపీ మహేశ్, జడ్పీటీసీ రవి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కన్నె సురేందర్, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మొయిజ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ శర్మానాయక్, వేల్పూర్ జడ్పీటీసీ భారతి, ఎంపీపీ భీమా జమున బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగధర్ రెడ్డి , ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
మంత్రి వేముల పలు కుల సంఘాల మద్దతు
మెండోరా మండలంలోని సోన్పేట్ గ్రామంలో చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై శ్రీకృష్ణ యాదవ సంఘ సభ్యులు మంత్రి ప్రశాంత్రెడ్డికి మద్దతు తెలిపారు. ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేసి సదరు కాపీని వేల్పూర్ క్యాంపు కార్యాలయంలో మంత్రికి గురువారం అందజేశారు. బాల్కొండ కుమ్మరి సంఘ సభ్యులు మంత్రి వేముల సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.