భీమ్గల్/ వేల్పూర్/ఏర్గట్ల, జనవరి 23: రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం బిజీబిజీగా గడిపారు. బాల్కొండ నియోజకవర్గంలో ఉదయం నుంచి రాత్రి వరకు విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. కొన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రారంభించారు. భీమ్గల్లో రూ.35 కోట్లతో చేపట్టిన వంద పడకల దవాఖాన, రూ.3 కోట్లతో చేపట్టిన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని పలు సలహాలు, సూచనలు చేశారు. పనుల్లో వేగం పెంచి, ప్లాన్ చార్టును రూపొందించాలని ఆదేశించారు. అనంతరం మండలంలోని మెండోరా గ్రామం వరకు రూ. కోటీ 15 లక్షలతో చేపట్టనున్న అప్రోచ్ రోడ్డు పునరుద్ధరణ పనులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
సీడ్ సర్టిఫికేషన్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన
వేల్పూర్ మండలం అంక్సాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద రూ.40 లక్షలతో, అమీనాపూర్-వేల్పూర్ రోడ్డుపై రూ.20 లక్షలతో చేపట్టనున్న కల్వర్టుల నిర్మాణ పనులకు మంత్రి భూమిపూజ చేశారు. అనంతరం వేల్పూర్ మార్కెట్ కమిటీ వద్ద రూ.95 లక్షలతో చేపట్టనున్న సీడ్ సర్టిఫికేషన్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వ్యవసాయానికి ప్రసిద్ధి గాంచిన ఆర్మూర్ తాలూకా ప్రాంతంలోని వేల్పూర్లో విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం ఇక్కడి రైతాంగానికి ఎంతగానో ఉపయోగకరమన్నారు. తన తండ్రి, దివంగత రైతు నేత వేముల సురేందర్ రెడ్డికి రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ కోటేశ్వర్రావు ఆప్తులని మంత్రి గుర్తుచేశారు. ఈ ప్రాంత రైతులు అనుభవజ్ఞులని..ఇక్కడి విత్తనాల గురించి దేశ వ్యాప్తంగా మంచి ప్రచారం ఉందని కోటేశ్వర్ రావు అన్నారు. సీడ్ ఏజెన్సీ ఏర్పాటుకు స్థలం కావాలని మంత్రిని కోరగా సానుకూలంగా స్పందించారన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్ రెడ్డి, విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ దొన్కల్ సంజీవ్ రెడ్డి, ఎంపీపీ బీమ జమున, సర్పంచ్ రాదా మెహన్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి వేల్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
పచ్చలనడ్కుడ గ్రామంలో ఉపసర్పంచ్ ఏనుగు గంగారెడ్డి తండ్రి గంగారాం స్మారకార్థం తయారుచేయించిన స్వర్గరథాన్ని మంత్రి వేముల ప్రారంభించారు. ఉపసర్పంచ్ను అభినందించారు.
కంటి వెలుగు శిబిరం సందర్శన
వేల్పూర్ మండలంలోని అక్లూర్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని మంత్రి వేముల సందర్శించారు. కంటి పరీక్షల కోసం వచ్చిన వృద్ధ మహిళలను ఆప్యాయంగా పలుకరించి సమస్యలను తెలుసుకొన్నారు.
ఏర్గట్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఏర్గట్లలో రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, డివైడర్ పనులకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉపేందర్రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు గుల్లే రాజేశ్వర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎనుగందుల రాజపూర్ణనందం, మండల కో-ఆప్షన్ మెంబర్ అస్రాప్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు జక్కని మధుసూదన్, సర్పంచ్ గుల్లే లావణ్యా గంగాధర్ పాల్గొన్నారు.