నిజామాబాద్ కల్చరల్, డిసెంబర్ 16 ; శ్రావణ…మాఘ… కార్త్తికమాసంతోపాటు హైందవ సంస్కృతిలో ధనుర్మాసానికి ఎంతో ప్రత్యేకత ఉన్నది. ఈ మాసంలో భక్తులు మహావిష్ణువును కొలుస్తారు. దీంతో ప్రతి వైష్ణవాలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం దీపారాధన చేస్తే మహాలక్ష్మి కరుణాకటాక్షాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎన్నో విశిష్టతలు, ప్రత్యేకతలు ఉన్న ధనుర్మాసం (మార్గశిరమాసం) సంక్రాంతి కన్నా నెల ముందు ప్రారంభమవుతుంది. నేటి(ఆదివారం) నుంచి జనవరి 14 వరకు ధనుర్మాసం ఉంటుంది. దీనినే సంక్రాంతి నెల అని కూడా అంటారు.
ధనుర్మాసం ప్రాముఖ్యత
ధనస్సురాశిలోకి సూర్యుడు ప్రవేశించిన కాలం ధనుసంక్రమణం. ధనుర్మాసం మొత్తం ఆధ్మాత్మికంతో ముడిపడి ఉంటుంది. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. గోదాదేవి కథ, వ్రతం ఈ మాసానికి సంబంధించినదే. అందుకే తిరుప్పావై పఠనం, గోదాదేవి కల్యాణం తదితర ప్రత్యేక కార్యక్రమాలతో ఈ మాసం ఆధ్యాత్మికత వెల్లువిరుస్తుంది.
తిరుప్పావై
అవివాహితులు మంచి భర్త లభించేందుకు చేసే నోముకు సంబంధించిన రచనే తిరుప్పావై. తెలుగు భాషకు పట్టాభిషేకం చేసిన విజయనగర సామ్రాజ్యం రారాజు శ్రీకృష్ణదేవరాయలు తాను రచించిన ‘అముక్త మాల్యద’ తమిళభాషలో తిరుప్పావైగా రాశారు. ఇందులో మొత్తం 30 పాశురాలు ఉంటాయి. ఒకొక్క పాశురం ఒకొక్క భక్తి మార్గాన్ని గోదాదేవి ఆరాధించే శ్రీమన్నారాయణుని వర్ణన, భక్తితో చేసే తులసీమాల అలంకరణ తదితర అంశాలు ఉంటాయి. వీటిని పండితులు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు చేసి భక్తులకు వినిపిస్తారు. చివరి రోజైన జనవరి 14న తిరుప్పావై ప్రవచనం ముగించి గోదా కల్యాణం చేస్తారు.
జిల్లాలో ప్రత్యేక ఏర్పాట్లు..
సకల కళలకు నిలయమైన ఇందూరు నగరంలో టీటీడీ ఆళ్వారు దివ్య ప్రబంధ ప్రాజెక్టు అనుమతితో ధనుర్మాస ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు చేశారు. బ్రహ్మపురి చక్రంగుడిలో సేనాపతి సంపత్కుమారాచార్యులు, సుభాష్నగర్ రామాలయంలో సముద్రాల శ్రీధరాచార్యులు, జెండా బాలాజీ మందిరం లో శ్యాంసుందరాచార్యులు తిరుప్పావై ప్రవచనాలను వినిపించనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు, ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.