ఖలీల్వాడి, అక్టోబర్ 25: నగరం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. అభివృద్ధి కండ్ల ముందే కనిపిస్తున్నదని వివరించారు. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం నిర్వహించిన వంజరి కులస్తుల ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంజరి భవన నిర్మాణానికి రూ.50 లక్షలు నిధులు మంజూరు చేశామన్నారు. రాజకీయాల్లో వంజరి సోదర, సోదరీమణులకు తగిన ప్రాధాన్యం కల్పిస్తామన్నారు.
మరింత అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా కారు గుర్తుకే ఓటు వేసి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలోని అంశాలను వివరించారు. కోట్లాది రూపాయలతో నగరాన్ని అభివృద్ధి చేసిన తనను మరోసారి ఆశ్వీరదించాలని కోరారు. కార్యక్రమంలో మేయర్ దండు నీతూ కిరణ్, కార్పొరేటర్లు మాయావర్ సవితారాజు, లతాకృష్ణ, సాయిరాం, ధాత్రిక పరమేశ్వర్, కరిపె సత్యం, గంగోనె గంగాధర్, కరిపె రాజు తదితరులు పాల్గొన్నారు.