ముప్కాల్, డిసెంబర్ 1: తెలంగాణ జానపదాల్లో ‘చిందు భాగవతం’ప్రత్యేకమైన కళ. ఈ కళాకారులు రామాయణ, మహాభారతాలను ఇతివృత్తంగా చేసుకొని కథలు చెబుతూ సామాజిక కళల్లో ఒక్కటైన చిందు భాగవతమే జీవనాధారంగా కొన్ని కుటుంబాలు మనుగడ సాగిస్తున్నాయి. పల్లెల్లో దేదీప్యమానంగా వెలుగొందిన కళారూపమిది. నిజామాబాద్,కామారెడ్డి జిల్లాల్లోని పల్లెల్లో చిందు కళను ఆదరిస్తున్నారు. చిందు కళను నమ్ముకొని ఉమ్మడి జిల్లాలో కళాకారులు తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. చిందు భాగవతానికి వన్నె తగ్గకుండా ఎంతో కృషి చేస్నున్నారు. భక్తితోపాటు వినోదం, వివేకాన్ని అందించే ఎన్నో కథలకు కళారూపం ఇస్తున్న చిందు కళాకారులు.. తమ ప్రదర్శనలతో అందరినీ కట్టి పడేస్తున్నారు. ఇప్పటికీ పల్లెల్లో ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.
కథల రూపంలో రామాయణ, మహాభారతాల ప్రదర్శన..
మనిషి జీవితానికి అర్థం పరమార్థం తెచ్చి పెట్టడమే కాకుండా ప్రతి ఒక్కరి జీవితంలో చోటు చేసుకునే పరిణామాలను కండ్లకు కట్టినట్లు మహాకవులు రాసిన రామాయణం, భాగవతం, మహా భారత గ్రంథాల్లోని ప్రధాన ఘట్టాలను కథల రూపంలో చిందు కళాకారులు ప్రదర్శనలను ఇస్తున్నారు. అభిమన్య, సారంగధర, ధర్మాంగధ చరిత్ర, చెంచు లక్ష్మి, భక్త ప్రహ్లాద, పుండరీక, సతీసావిత్రి, సీతా వనవాసం, హనుమాన్ విజయం, శ్రీరామాంజనేయ యుద్ధంలాంటి ఎన్నో కథలను చిందు కళాకారులు ఎంచుకొని ప్రజలను ఆకట్టుకుంటున్నారు.
టీవీలు, సెల్ఫోన్ల రాకతో ఆదరణ కరువు..
టీవీలు, కంప్యూటర్లు, సెల్ఫోన్ల లాంటి ప్రసార మాధ్యమాలు రాకముందు కథలు, నాటికలు వేసే కళాకారులకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. దీంతో కష్టానికి తగ్గ ఫలితం పొందేవారు. కానీ ప్రస్తుతం సినిమాలు, సీరియల్స్ పేరుతో ఇంట్లో.. ఉన్నచోటనే అన్ని అరచేతిలో ప్రపంచాన్ని చూసే రోజులొచ్చాక కళాకారుల పరిస్థితి దయనీయంగా మారిపోయింది. దీంతో కళాకారుల వద్ద ఉన్న ప్రతిభను మాటల్లో చెప్పుకోవడానికి తప్ప ప్రదర్శిస్తే చూసేవారు కరువయ్యారు. ప్రస్తుతం చిందు కళాకారులు ఇతర మార్గాలను ఎంచుకొని జీవనాన్ని ఒడిదొడుకుల మధ్య నెట్టుకొస్తున్నారు. అయితే నేటి తరానికి పురాణ, ఇతిహాసాల ప్రాధాన్యాన్ని తమదైన శైలిలో వివరిస్తూ చిందు భాగవతానికి బోధన్కు చెందిన ఎల్లమ్మ జీవం పోస్తే.. ముప్కాల్కు చెందిన రాజేశ్వర్ ఈ కళను బతికించడానికి కృషి చేస్తున్నారు.
ప్రాణం ఉన్నంత వరకు కళను బతికిస్తాం..
మాలో ప్రాణం ఉన్నంత వరకు చిందుకళను బతికించుకుంటూ జీవనం సాగిస్తున్నాం. కళకు జీవం పోస్తూ కుటుంబ సభ్యులకు సైతం కళను నేర్పుతూ ప్రజలకు వినోదాన్ని పంచుతున్నాం.
– రాజేశ్వర్, చిందు కళాకారుడు
ప్రభుత్వం ఆదుకోవాలి..
అంతరించి పోతున్న కళకు ప్రాణం పోస్తూ చిందుకళను కాపాడుకుంటున్నాం. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది.
– శేఖర్, చిందు కళాకారుడు