భీమ్గల్, నవంబర్ 24 : భర్తను అతడి ఇద్దరు భార్యలు పెట్రోలు పోసి సజీవ దహనం చేసిన దారుణ ఘటన నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని దేవక్కపేట్ గ్రామంలో సోమవారం చోటు చేసుకున్నది. స్థానిక సీఐ పొన్నం సత్యనారాయణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. దేవక్కపేట్కు చెందిన మలావత్ మోహన్ అలియాస్ బ్యాండ్ మోహన్ (42) బ్యాండు వాయిస్తూ జీవనోపాధి పొందేవాడు. అతడికి ఇద్దరు భార్యలు కవిత, సంగీత ఉన్నారు. మొదటి భార్యకు పిల్లలు లేరని, ఆమె చెల్లెలిని రెండో వివాహం చేసుకున్నాడు. తర్వాత మొదటి భార్యకు ముగ్గురు కూతుళ్లు, రెండో భార్యకు ఇద్దరు కూతుళ్లు పుట్టారు. మోహన్ తరచూ మద్యం తాగి ఇద్దరు భార్యలతో గొడవలు పడేవాడు.
ఆదివారం రాత్రి కూడా గొడవపడి ఇద్దరు భార్యలను గదిలో బంధించాడు. భర్త వేధింపులు తాళలేక అతడిని అంతమొందించాలని పథకం రూపొందించుకున్నారు. సోమవారం ఉదయం 11 గంటల సమయం లో మద్యం మత్తులో ఉన్న మోహన్.. ఇంటి ఎదుట కుర్చీలో నిద్రిస్తుండగా.. రెండో భార్య సంగీత గ్రామంలోని ఓ దుకాణం నుంచి పెట్రోల్ తీసుకువచ్చింది. అనంతరం ఇద్దరు భార్యలు కలిసి మోహన్పై పెట్రోల్ పోసి, పక్కనే ఉన్న పొయ్యిలో మండుతున్న కట్టెతో నిప్పంటించారు. మోహన్ సజీవ దహనమై అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం కవిత, సంగీత అక్కడి నుంచి పరారయ్యారు. మృతుడి సోదరుడు రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నామని సీఐ తెలిపారు. స్థానిక ఎస్సై సందీప్ కేసు విచారణలో పాల్గొన్నారు.