12 బైకులు స్వాధీనం
వివరాలను వెల్లడించిన ఎస్పీ శ్రీనివాసరెడ్డి
మద్నూర్, మే 24 : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ము ఠాను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 12 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మద్నూర్ పోలీసు స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు. ఈ నెల 23న సోమవారం విశ్వసనీయ సమాచారం మేరకు మద్నూర్ శివారులోని సోనాలా చౌరస్తా వద్ద వాహనాలను తనిఖీలు చేపట్టామన్నారు. అదే సమయంలో నలుగురు వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై దెగ్లూర్ వైపు అనుమానాస్పదంగా వెళ్తుండగా సిబ్బంది గుర్తించారన్నారు. పారిపోవడానికి ప్రయత్నించడంతో వారిని వెంబడించి పట్టుకున్నారని తెలిపారు.
వీరిలో మద్నూర్ మండలంలోని తడిహిప్పర్గ గ్రామానికి చెందిన ఉష్కల్వార్ చందు, ఉష్కల్వార్ పీరాజి, బూర్లే మల్లు, కంకర్నే బస్వరాజ్ ఉన్నారన్నారు. వీరు నలుగురు ఒక గ్రూపుగా ఏర్పడి సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వివిధ ప్రాంతాల్లో 12 ద్విచక్ర వాహనాలను దొంగిలించారని తెలిపారు. వాహనాలను తమ ఇండ్లల్లో దాచి ఉంచారని అన్నారు. గ్రామంలో ఒక ఆవును సైతం దొంగలించి దాన్ని దెగ్లూర్లో రూ.20 వేలకు అమ్ముకున్నారన్నారు. సోమవారం నాలుగు బైక్లను దెగ్లూర్లో అమ్మడా నికి తీసుకెళ్తుండగా తమ సిబ్బంది పట్టుకున్నారని వివరించారు. నేరస్తులను పట్టుకున్న సిబ్బందికి రివార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. సమావేశంలో డీఎస్పీ జైపాల్రెడ్డి, సీఐ కృష్ణ, ఎస్సై శివకుమార్, సీసీ ఎస్ ఎస్సై ఉస్మాన్, ఏఎస్సైలు వెంకట్రావు, రాజేశ్వర్, హెడ్ కానిస్టేబుల్ సురేందర్, కానిస్టేబుల్ గణపతి ఉన్నారు.