శక్కర్నగర్, డిసెంబర్ 10: బోధన్- నిజామాబాద్ రహదారి నుంచి నర్సాపూర్ గ్రామానికి వెళ్లే బీటీ రోడ్డుకు ఇపువైపులా మొరం వేయకపోవడంతో గ్రామాదాలు జరుగుతున్నాయి. ఈరోడ్డు శిథిలావస్థకు చేరడంతో రెండు నెలల క్రితం అధికారులు బీటీగా మార్చారు. అనంతరం రోడ్డుకు ఇరువైపులా మొరం వేయించాల్సి ఉంది. కానీ రెండు అధికారులు మొరం వేయకపోవడంతో రాత్రి సమయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ రోడ్డు వేసిన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారు 20 మంది వరకు ద్విచక్రవాహనదారులు అదుపుతప్పి పడిపోయారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వారు అంటున్నారు. ఇప్పటికైనా స్పందించి ప్రమాదకరంగా మారిన రోడ్డుకు ఇరువైపులా మొరం వేయించాలని కోరుతున్నారు.
నర్సాపూర్ రోడ్డును బీటీగా మార్చారు. ఇరువైపులా మొరం వేయకుండానే వదిలేశారు. బీటీ వేసిన నుంచి అధికారులకు చెబుతూనే ఉన్నాం. అయినా వారు పట్టించుకోవడం లేదు. రోడ్డుకు ఇరువైపులా మొరం లేక ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి మొరం వేయించాలి.
– డేగావత్ ధూప్సింగ్ నాయక్, కౌన్సిలర్, 4వ వార్డు
ఎదురుగా వాహనాలు వచ్చినప్పుడు రాత్రుల్లో రోడ్డు కిందికి దిగితే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎదురుగా వచ్చే వాహనాల లైట్ల కారణంగా రోడ్డు సరిగా కనిపించడం లేదు. రోడ్డుకూడా ధ్వంసం అవుతోంది. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలి.
– ఎమ్డీ ఉస్మాన్, నర్సాపూర్ వాసి
మొరం రవాణాకు ప్రభుత్వ పరంగా అనుమతులు లేని కారణంగా వేయించలేకపోతున్నాం. ఈ విషయంలో అనుమతుల కోసం జిల్లా అధికారులకు నివేదించాం. త్వరలో మొరం వేయించేందుకు చర్యలు చేపడతాం.
– రామ్మోహన్, డీఈఈ, ఆర్అండ్బీ