మెండోరా, మార్చి 29 : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం మరో రికార్డును సాధించిది. 1998-99 ఆర్థిక సంవత్సరంలో 137.95 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 138 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యింది. దీంతో అప్పటి రికార్డు బ్రేక్ అయ్యింది. శ్రీరాంసాగర్ జెన్కోలో 1987-88 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. అప్పట్లో మూడు టర్బాయిన్లతో విద్యుత్ ఉత్పత్తిని చేసేవారు.
2010వ సంవత్సరంలో మరో టర్బాయిన్ ఏర్పాటు చేశారు. దీంతో నాలుగు టర్బాయిన్లలో ఒక్కో టర్బాయిన్ నుంచి 9 మెగావాట్ల చొప్పున 36 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో అధికారులు నిరంతర శ్రమించి ఒక్కో టర్బాయిన్ నుంచి 9 మెగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తిని చేయగలిగారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదలు రావడంతో జల విద్యుత్ ఉత్పత్తి కేం ద్రం ద్వారా నిరంతరం విద్యుత్ ఉత్పత్తి జరిగింది. జెన్కో ప్రారంభమైన నాటి నుంచి 1990 -1991 ఆర్థిక సంవత్సరంలో 147 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడంతో రికార్డు నమోదైంది. ఇప్పటివరకు ఆ రికార్డును బ్రేక్ చేయలేకపోయారు. ప్రస్తుతం కాకతీయ కాలువకు అనుసంధానంగా ఉన్న ఎస్కేప్ గేట్లకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి మ్యానువల్, ఆటోమేటిక్ గేట్లను ఏర్పాట్లు చేయడంతో విద్యు త్ ఉత్పత్తిని అదనంగా సాధించగలుగుతున్నారు. మరో రెండు రోజుల్లో 140 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.