కాకతీయుల కాలంలో కళకళలాడిన చెరువులు.. సమైక్య రాష్ట్రంలో ఆనవాళ్లు కోల్పోయాయి. వర్షాకాలంలోనూ నీళ్లు లేక ఎడారిని తలపించాయి. స్వరాష్ట్రం సిద్ధించాక సీఎం కేసీఆర్ జల విప్లవానికి శ్రీకారం చుట్టారు. మిషన్ కాకతీయతో చెరువులకు జీవ కళ తీసుకొచ్చారు. ఉమ్మడి జిల్లాలో 1941 చెరువులను పునరుద్ధరించారు. చిన్నాభిన్నమైన చిన్ననీటి వనరులకు పూర్వవైభవం తీసుకొచ్చి కరువు పరిస్థితులను శాశ్వతంగా దూరం చేశారు. ఎండాకాలంలోనూ తటాకాలు నిండుగా కనిపిస్తున్నాయి. నాడు ఏటా ఒక పంట పండడమే కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు రెండు పంటలు పండుతున్నాయి. దిగుబడులు దండిగా పెరిగాయి. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు కళ్లముందే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల వేళ.. ప్రభుత్వం నేడు ఊరూరా చెరువుల పండుగ నిర్వహిస్తున్నది. కట్ట మీద మైసమ్మ పూజలు,
సామూహిక వన భోజనాలతో సరికొత్త ఉత్సాహం వెల్లివిరియనున్నది.
ఎల్లారెడ్డి, జూన్ 7 : పల్లె జీవనానికి ఆధారమైన చెరువులు, కుంటలు ఉమ్మడి రాష్ట్రంలో పట్టించుకోకపోవడంతో ధ్వంసమయ్యాయి. చెరువులపై ఆధారపడి బతికిన ఎంతో మంది వ్యవసాయాన్ని వదులుకున్న పరిస్థితులు. కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రారంభించిన మిషన్కాకతీయ పథకంతో చెరువులు, కుంటలు పూర్వవైభవాన్ని సంతరించుకున్నాయి. కాలువల ఆధునీకరణ, తూముల రిపేర్లు, చెరువుల్లో పూడికతీతతో వానకాలంలో నిల్వ అయిన జలాలు యాసంగిలో పంటల సాగునీటి అవసరాన్ని తీరుస్తున్నాయి. తద్వారా చెరువుల కింద ఆయకట్టు 60 నుంచి 90శాతానికి పెరిగినట్లు జలవనరుల శాఖ లెక్కలు చెబుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 1200 చెరువులున్నాయి. వీటి పరిధిలో యాసంగిలో ఒకప్పుడు 40 వేల ఎకరాలకు మాత్రమే సాగు నీరు అందేది. ఇప్పుడేమో సాగు విస్తీర్ణం రెట్టింపు అయ్యింది. 1.11 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతుండడం మిషన్ కాకతీయ పథకం ఫలితాలకు నిదర్శనం. కామారెడ్డి జిల్లాలోనూ చెరువుల కింద ఆయకట్టు భారీగా పెరిగింది.
లక్షలాది ఎకరాలకు జీవం..
సమైక్యాంధ్ర పాలకుల నిర్లక్ష్యానికి తెలంగాణ రాష్ట్రంలోని చిన్న, మధ్య తరహా నీటి వనరులు పూర్తిగా దెబ్బతిన్నాయి. సరైన కాలువలు లేక వర్షపు నీరు వృథాగా పోయేది. సామర్థ్యం ఉన్నప్పటికీ చెరువుల్లోకి వరద చేరే పరిస్థితి ఉండేది కాదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన మిషన్ కాకతీయ పథకంతో అనేక చెరువులకు కొత్త కళ వచ్చింది. పునరుద్ధరణ, శాశ్వత మరమ్మతు పనులతో ఇప్పుడు ఎక్కడ చూసినా తటాకాల్లో పుష్కలంగా నీళ్లు నిల్వ ఉన్నాయి. వాటి ద్వారా ఉమ్మడి జిల్లాలో సుమారు రెండున్నర లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి.
తొలిగిన కరువు ఛాయలు..
కామారెడ్డి జిల్లా ఉమ్మడి రాష్ట్రంలో కరువు ప్రాంతంగా ముద్ర పడింది. కానీ ‘కాకతీయ’ ఫలితంగా ఇప్పుడు పంటల ఉత్పత్తిలో మిగతా జిల్లాలతో పోటీ పడుతుండడం విశేషం. జిల్లా వ్యాప్తంగా 1,954 చెరువులు, కుంటలున్నాయి. వీటి ద్వారా 97,881 ఎకరాల ఆయకట్టుకు ప్రాణం పోసినట్లు అయ్యింది. 100 ఎకరాలకు పైబడిన 194 చెరువుల పరిధిలో 46,338 ఎకరాలు, 100 ఎకరాల్లోపు ఆయకట్టు సామర్థ్యం కలిగిన 1,056 చెరువుల్లో 39,803 ఎకరాలు సాగవుతున్నాయి. 721 కుంటలు, చిన్నపాటి నీటి వనరుల కింద 12,400 ఎకరాల్లో పంటలు పండుతున్నాయి.
జలసిరులు
సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు మిషన్ కాకతీయ పథకం అంటే చెరువులను బాగు చేసుకోవడం ఒక్కటే కాదు. వర్షపు నీటిని 10 నెలల పాటు నిల్వ చేసుకొని ఆయకట్టుకు కొరత లేకుండా సాగు నీరు అందించడం ప్రధానమైన ధ్యేయం. తటాకాల్లో పూడికతీత పనులు చేపట్టం ద్వారా చెరువుల సామర్థ్యం పెరిగింది. గతంలో దశాబ్దాలుగా కూరుకుపోయిన పూడికను తీయడం ద్వారా చెరువులకు పూర్వ వైభవం వచ్చింది. తద్వారా వర్షపు నీరు ఎక్కువగా నిల్వ చేసుకునే సౌలభ్యం ఏర్పడింది. స్వరాష్ట్రం ఏర్పడడానికి ముందు వరకు భారీ వానలు పడితే ఎక్కడో ఒక చోట చెరువులకు బుంగలు పడడం, గండి పడి కొట్టుకపోవడం వంటివి కనిపించేవి. ఇప్పుడు చెరువు కట్టలు బలోపేతం చేయడం ద్వారా చెక్కుచెదరకుండా కనిపిస్తున్నాయి. లీకేజీలతో కొట్టుమిట్టాడిన తూములు బాగుపడడంతో ఇబ్బందులు లేకుండా పోయా యి. చెరువు చుట్టూ ప్రాంతాల్లో భూగర్భ జలాలు సైతం భారీగా పెరిగాయి.
రెండు పంటలు పండుతున్నాయి…
మా ఊరి చెరువు నిండాలంటే వానకాలం సరిపోక పోయేది. తెలంగాణ వచ్చినంక మిషన్ కాకతీయ పథకంలో అటవీ ప్రాంతం నుంచి వెళ్లే వరదను పెద్ద కాలువ తీసి చెరువులకు కలిపారు. అప్పటి నుంచి మా చెరువులో నీటికి ఢోకా లేకుండా పోయింది. జూలై నెలలోనే చెరువు నిండి అలుగు పారుతున్నది. ఈ సంవత్సరం చెరువు కింద యాసంగి పంట పండినా ఇంకా నీళ్లు ఉన్నాయి. ఇదంతా కేసీఆర్ సార్ పుణ్యమే మరి.
-మన్నె బాలయ్య, శెట్పల్లి, లింగంపేట
గొలుసుకట్టు చెరువు దిశ తిరిగింది
మా మండలంలో గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. ఒక చెరువు నిండితేనే మరో చెరువులోకి నీరు వస్తది. మా పైన ఉండే పోతాయిపల్లి చెరువు నిండే దాకా మా చెరువులకు నీరు వచ్చేది కాదు. మిషన్ కాకతీయ పథకంతో అన్ని చెరువులు బాగుపడ్డాయి. మా ఊరికి నీరు అందించే చౌదరి చెరువుకు బుంగలు ఎక్కువగా పడేవి. చెరువుకట్ట పెంచి బాగు చేయడంతో ఆ బాధలు తప్పాయి. ఇప్పుడు చౌదరి చెరువు కింద ఏడు వందల ఎకరాలకు రెండు పంటలకు నీరు అందుతున్నది. ఇంతకు ముందు అలుగులు సరిగా లేక పోవడంతో చెరువులో నీరు ఎక్కువ రోజులు ఉండక పోయేవి. ఇప్పుడు ఎండాకాలంలో కూడా చాలా నీళ్లు ఉన్నాయి.
-తలారి సాయిలు, పోల్కంపేట, లింగంపేట.