ఖలీల్వాడి, డిసెంబర్ 3 : ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నాయకులు చేస్తున్న నిరాధార ఆరోపణలను ఖండిస్తున్నామని జడ్పీచైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు. నగరంలోని జడ్పీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఉద్యమ నాయకురాలు కవిత జోలికి వస్తే సముద్రంలో కలిపేస్తామని, తప్పుడు ఆరోపణలు చేస్తున్న బీజేపీ నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
కవితకు సీబీఐ కేవలం వివరణ కోసమే నోటీసులు ఇచ్చిందని, ఈ విషయంపై బీజేపీ నేతలు ఏదో జరిగిపోయినట్లు ప్రచారాలు చేయడం సరికాదన్నారు. సీబీఐకి ఎమ్మెల్సీ కవిత సహకరిస్తానని ప్రకటించారని చెప్పారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో నిందితులుగా ఉన్న బీజేపీ వారు సిట్ ముందుకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ కేంద్రంలో ప్రకంపనాలు సృష్టిస్తుండడంతో మతిభ్రమించి బీజేపీ నేతలు జంకుతున్నారని, అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాకుంటే బండి సంజయ్కు రాష్ట్ర పదవి వచ్చేనా అని ప్రశ్నించారు.
జీవితంలో ఎంపీ సీటు కూడా రాకపోయేదన్నారు. బీజేపీ కేంద్ర పెద్దలు చేస్తున్న అవినీతిని బట్టబయలు చేస్తారన్న ఉద్దేశంతో ఇలాంటి నోటీసులు పంపిస్తున్నారన్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా ముందుగా మోదీ సీబీఐని పంపించడం సర్వసాధారణ విషయమని ప్రజలందరికీ తెలుసన్నారు. రాష్ట్ర సాధనలో కేసీఆర్ కుటుంబం చేసిన త్యాగంతోనే ప్రస్తుతం బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడు అయ్యాడని గుర్తు చేశారు. సమావేశంలో నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఏటీఎస్ శ్రీనివాస్, తెలంగాణ శంకర్, నీలంరెడ్డి, మనోహర్రావు పాల్గొన్నారు.