మాక్లూర్, జనవరి1: మండలంలోని మదన్పల్లి గ్రామంలో నిజాం కాలంలో నిర్మించిన ఇరుకు వంతెనతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. నిజాం కాలంలో నిర్మించిన ఈ బ్రిడ్జిపైనుంచే రాకపోకలు కొనసాగుతున్నాయి. 63వ జాతీయ రహదారి మానిక్బండార్ నుంచి 44వ జాతీయ రహదారి సికింద్రాపూర్ వరకు ఈ దహదారిలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. బ్రిడ్జి ఇరుకుగా ఉండడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో యాదవులకు చెందిన రెండు పాడి గేదెలు బ్రిడ్జిపై నుంచి కాలువలో పడి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.
అమాద్ మీదుగా ఓడ్యాట్పల్లి, ముత్యంపల్లి, మదన్పల్లి, ఆమ్రాద్ తండా, అమ్రాద్ గ్రామాలతోపాటు డిచ్పల్లి, జక్రాన్పల్లి, హైదరాబాద్కు వెళ్లే మాక్లూర్ నందిపేట్ మండలాల ప్రయాణికులు అత్యధికంగా ఈ వంతెన మీదుగా ప్రయాణిస్తుంటారు. జిల్లా కేంద్రానికి వెళ్లకుండా నేరుగా డిచ్పల్లి మండలంలోని ధర్మారం, జక్రాన్పల్లి మండలంలోని సికింద్రాపూర్ రహదారికి చేరుకోవచ్చు. ఇలా తక్కువ దూరంతోపాటు, సమయం ఆదా అవుతోంది. అక్కడి నుంచి జాతీయ రహదారి వెంట ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రయాణం చేయడానికి వీలుంటుంది. ఈరూట్లో వెళ్తే 10 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. పక్కనే ఉన్న ఒడ్యాట్పల్లిలోని ఒడ్డెటమ్మ ఆలయానికి ఆదివారం అధిక సంఖ్యలో వాహనాల్లో భక్తులు వెళ్తుంటారు. అధికారులు స్పందించి కొత్త వంతెన నిర్మించాలని వాహనదారులు కోరుతున్నారు.
శిథిలావస్థకు చేరింది
నిజాం కాలంలో నిర్మించిన బ్రిడ్జి ఇరుకుగా ఉంది. శిథిలావస్థకు చేరింది. జాతీయ రహదారి వైపు వెళ్లే వాహనదారులు ఈ రూట్లోనే వెళ్తుంటారు. బ్రిడ్జి వెడల్పు చేయకుండా రోడ్డు ఎత్తు పెంచడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కొత్త వంతెన నిర్మించాలి. – రాస మహేశ్, మదన్పల్లి
కొత్త వంతెన నిర్మిస్తే సౌకర్యంగా ఉంటుంది
ఈ బ్రిడ్జి మీదుగా డిచ్పల్లి, మాక్లూర్, నందిపేట్, జక్రాన్పల్లి మండలాలకు చెందిన ప్రజలు ప్రయాణిస్తారు. ఇరుకుగా ఉన్న బ్రిడ్జి స్థానంలో కొత్త వంతెన నిర్మిస్తే వాహనదారులకు అనుకూలంగా ఉంటుంది.
– బెల్దారి భూమన్న
కొత్త బ్రిడ్జి కోసం ప్రతిపాదనలు పంపాం
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆదేశాల మేరకు బ్రిడ్జికి సంబంధించి ఆర్అండ్బీ సీఈ కార్యాలయానికి ప్రతిపాదనలు రూపొందించి, బ్రిడ్జి నిర్మాణానికి రూ.కోటి వ్యయం అవుతుందని అంచనాలు పంపించాం. ఎమ్మెల్యే జీవన్రెడ్డి లెటర్ను కూడా అధికారులకు పంపాం. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తాం. -గులాబ్సింగ్, ఆర్అండ్బీ ఏఈ