నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 17: ఉమ్మడి జిల్లా పోలీసుశాఖలో బదిలీల ప్రక్రియ కొనసాగుతున్నది. బదిలీల ప్రక్రియ మూడు రోజుల క్రితం ప్రారంభమవగా, నిజామాబాద్ సీపీ కార్తికేయ కొత్త జీవో ప్రకారం జోన్ల వారీగా బదిలీలు చేపట్టారు. బదిలీల్లో మ్యూచువల్ అండర్ స్టాండింగ్ కింద సిబ్బంది అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని, ముందుగా వారి సమ్మతిని పరిశీలిస్తున్నారు. కానిస్టేబుల్ నుంచి ఏఎస్సై స్థాయి వరకు సీనియార్టీ ప్రకారం బదిలీలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లాలో పనిచేసిన సిబ్బందిని కామారెడ్డి జిల్లాకు బదిలీ చేస్తే అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. వెళ్లడం వీలుగాక ఇక్కడే ఉండాలనుకునే వారు పక్క జిల్లా సిబ్బందితో అండర్స్టాండింగ్ చేసుకొని, అధికారులను అభ్యర్థిస్తే అంగీకారం తెలుపుతున్నట్లు కొందరు ఉద్యోగులు తెలిపారు. ఇంట్లో సమస్యలు ఉన్నవారు లేక వృద్ధ తల్లిదండ్రులకు సేవలు చేసే వారు తమ పరిస్థితిని వివరిస్తూ సీపీకి దరఖాస్తు చేసుకుంటున్నారు. వారికి సైతం బదిలీ చేయకుండా ఇక్కడే విధులు నిర్వర్తించేలా అవకాశం కల్పిస్తున్నారు.
జోన్ల వారీగా బదిలీలు
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీవో 317 ప్రకారం జోన్ల వారీగా బదిలీలు చేస్తున్నారు. ఇదివరకు నిజామాబాద్ జిల్లాలో విధులు నిర్వర్తించే వారిని కామారెడ్డి జిల్లాకు బదిలీ చేయడం, కామారెడ్డి జిల్లాలో పని చేస్తు వారిని కరీంనగర్ లేదా మెదక్ జిల్లాలకు బదిలీ చేసేవారు. ప్రస్తుతం విధానం మారింది. జోనల్, మల్టీ జోనల్ విధానం అమలుచేస్తున్నారు. కొత్త జీవో ప్రకారం నిజామాబాద్ జిల్లాను జోన్ -2 లో, కామారెడ్డి జిల్లాను జోన్-3లో చేర్చారు. కొత్త జీవో ప్రకారం జోన్-2 కు బదిలీ పై వెళ్లిన వారిని ఉద్యోగ విరమణ వరకు అదే జోన్ పరిధిలోని జిల్లాలకే బదిలీ చేస్తారు. మరో జోన్కు బదిలీ చేసే ప్రసక్తి లేదు. జోన్ -3 పరిధిలోకి బదిలీపై వెళ్లినవారు మల్టీజోన్కు బదిలీపై వచ్చే అవకాశం లేకుండా కొత్త జీవోను ప్రవేశ పెట్టారు. జోనల్, మల్టీ జోనల్ ప్రకారం బదిలీలను క్యాడర్ స్థాయి ప్రకారం చేస్తున్నారు. కానిస్టేబుల్ స్థాయి వరకు జిల్లాల పరిధిలో బదిలీ చేస్తారు. హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సై వరకు జోన్ల వారీగా బదిలీ చేపడుతున్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ నుంచి డీఎస్పీ, ఏసీపీ స్థాయి వరకు మల్టీజోన్లకు బదిలీలు ఉంటాయి. రెండు జోన్లను కలుపుతూ ఒక మల్టీజోన్గా పరిగణించారు. దీని ప్రకారమే బదిలీలు నిర్వహిస్తున్నారు.
జోన్ల వారీగా విభజించిన జిల్లాలు
జోన్-2 పరిధిలో: 1) నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల
జోన్-3 పరిధిలో: 1)సిద్దిపేట్ (కమిషనరేట్), కరీంనగర్(కమిషనరేట్), కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల జిల్లాలు ఉన్నాయి.
మూడు రోజులుగా కొనసాగుతున్న బదిలీల ప్రక్రియ
దాదాపుగా పూర్తయినట్లు తెలిసింది. త్వరలో సీఎం కేసీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన అనంతరం బదిలీ అయిన పోలీసు సిబ్బంది తమకు కేటాయించిన స్థానాలకు వెళ్లి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.