భారీగా నిధులు మంజూరు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి చొరవతో అభివృద్ధి
ఘాట్రోడ్డు, ఆలయాల నిర్మాణం, మౌలిక వసతులు
ఆర్మూర్, జూలై 1 : నవనాథులు నడయాడిన నల్లటి రాళ్లగుట్ట.. సిద్ధుల గుట్టగా ప్రసిద్ధి చెందింది. సహజ అందాలను సంతరించుకున్న ఈ గుట్ట.. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఎవరూ పట్టించుకోలేదు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి కృషితో సిద్ధులగుట్ట పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందుతున్నది. ప్రస్తుతం పర్యాటక సొబగులు అద్దుకుంటున్నది. గుట్టపైకి రవాణా సౌకర్యం, మౌలిక వసతులు కల్పించడంతో నిత్యం భక్తులతో కళకళలాడుతున్నది.
భారీగా రాష్ట్ర ప్రభుత్వ నిధులు..
సిద్ధుల గుట్టను అభివృద్ధి చేయడంతోపాటు పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులను మంజూరు చేస్తున్నది. గుట్టపై పలు ఆలయాల నిర్మాణం, గుట్ట సుందరీకరణ పనులను పూర్తి చేసేందుకు సిద్ధేశ్వరుడి సాక్షిగా స్థానిక ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆరేండ్లక్రితం దీక్షబూనారు. రాష్ట్ర మంత్రులు, అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయించారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 8 కోట్ల నిధులతో ఘాట్ రోడ్డు నిర్మించి రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చారు. రూ.15లక్షల నిధులతో గుట్టపై చిల్డ్రన్ పార్కును ఏర్పాటు చేశారు. వీటితో పాటు టీయూఎఫ్ఐడీసీ ద్వారా ఆలయాల సుందరీకరణ పనులు, అయ్యప్ప మందిర భోజనశాల, రామాలయ ఉత్సవాల షెడ్డు నిర్మాణానికి రూ. 4.5కోట్లు మంజూరు చేయించారు. రూ. 10 లక్షలతో మూత్రశాలలు నిర్మించారు.
పలు ఆలయాల నిర్మాణం..
స్థానిక భక్తులు, వివిధ సంఘాల సహకారంతో గుట్టపై అయ్యప్ప మందిరం, క్షత్రియ సమాజ్ సహస్రార్జున మందిరం, ధ్యాన మందిరం నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ప్రతిసోమవారం గుట్టను దర్శించుకునే వేలమంది భక్తులకు ఎమ్మెల్యే జీవన్రెడ్డి తన సొంత డబ్బులతో అన్నదానం చేస్తున్నారు. సిద్ధులగుట్టను రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రంగా, పర్యాటక ప్రాంతగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే జీవన్రెడ్డి పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి నిధులిచ్చేనా..
ఆర్మూర్ ప్రాంతంలో కేంద్ర రక్షణ, పర్యాటక శాఖ మంత్రి అజయ్ తమ పార్టీ కార్యకలాపాల కోసం మూడు రోజులుగా పర్యటిస్తున్నారు. ప్రసిద్ధిగాంచిన సిద్ధుల గుట్టను దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధులగుట్టను పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేస్తారని భక్తులు ఆశగా ఎదురుచూస్తున్నారు.