వరి పంట పండింది.. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం పోటెత్తింది. వచ్చిన వడ్లను వచ్చినట్లు రాష్ట్ర సర్కారు వేగంగా కొంటున్నది. వెంట వెంటనే ఖాతాల్లో డబ్బులు జమ అవుతుండడంతో రైతుల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తున్నది. వానకాలంలో అంచనాలకు మించి ధాన్యం దిగుబడులు వచ్చాయి. భారీ వర్షాలు వెంటాడినా పుట్లకొద్దీ వడ్లు పండాయి. దిగుబడులకు అనుగుణంగా కేసీఆర్ ప్రభుత్వం ధాన్యం సేకరణకు చర్యలు చేపట్టింది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులకు పైగా వడ్లు కొనుగోలు చేశారు. రైతుల ఖాతాల్లో వెంట వెంటనే డబ్బులు జమ చేస్తున్నారు. మరోవైపు, ధాన్యం కొనేందుకు ప్రైవేట్ వ్యాపారులు సైతం పోటీ పడుతున్నారు. పొలాలకు వద్దకు వెళ్లి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఇక, రెండేండ్లుగా ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెడుతూ ఇబ్బందులకు గురి చేసింది. అయితే, మిగిలిన రాష్ర్టాల్లో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవడంతో మన రాష్ట్రంలో పండించిన ధాన్యమే ఇప్పుడు కేంద్రానికి కావాల్సి వచ్చింది.
నిజామాబాద్, డిసెంబర్ 1, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఓ వైపు భారీ వర్షాలు… ఏకధాటిగా దంచిన వానలు… పొలాలన్నీ చెరువులను తలపించిన పరిస్థితులు. దిగుబడుల మాటేమిటని దేవుడిపై భారమేసి కాలం గడిపారు రైతులు. అతివృష్టి సంభవించినప్పటికీ వరి దిగుబడుల్లో ఎక్కడా నష్టం మాత్రం సంభవించలేదు. కొన్ని ప్రాంతాల్లోనే ఇబ్బందులుండగా విరామం లేని వర్షాలతో వరి పైరు ఏపుగా పెరగడంతో పాటు చీడపీడల బాధ నుంచి విముక్తి లభించినట్లు అయ్యింది. తద్వారా ఊహించినట్లుగానే దిగుబడులు రావడంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు ఈసారి కూడా ధాన్యాగారమై వెలుగొందుతున్నాయి. ప్రభుత్వ అంచనాల మేరకు మార్కెట్లోకి ధాన్యం వచ్చినప్పటికీ చాలా చోట్ల ప్రైవేటు వ్యాపారుల హడావుడి ఎక్కువగా కనిపించింది. సన్న రకం ధాన్యానానికి కనీస మద్దతు ధరకు దీటుగా చెల్లింపులు జరిపి రైతుల నుంచే నేరుగా కొనుగోలు చేశారు. నిజామాబాద్లో 8లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేయగా రెండున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రైవేటు వ్యక్తులే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందూరులో 5లక్షల మెట్రిక్ టన్నులు, కామారెడ్డి జిల్లాలో 3.5లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యాన్ని ప్రభుత్వమే సేకరించింది.
మోదీ విఫల ప్రయోగంతో…
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న విధానపరమైన లోపాలతో ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతూనే ఉన్నాయి. రెండేండ్ల క్రితం నుంచి ప్రతి పంట సీజన్కు ధాన్యం సేకరణలో కొర్రీలు పెడుతూ ఇబ్బందికి గురి చేస్తున్నది. తద్వారా దేశంలో ధాన్యం నిల్వలు ఘోరంగా పడిపోయాయి. 2022 వానకాలం సీజన్లో మన దగ్గర తప్ప మిగిలిన రాష్ర్టాల్లో ఆశించిన స్థాయిలో వరి ఉత్పత్తి లేకపోవడంతో మన రైతులు పండించిన ధాన్యమే కేంద్రానికి కావాల్సి వచ్చింది. మార్కెట్లో ప్రైవేటు వ్యాపారులకు సైతం ధాన్యం కొరత ఏర్పడడంతో వా రంతా రంగంలోకి దిగి రైతుల చెంతకే వచ్చి సన్న రకం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇలా పోటాపోటీ పరిస్థితుల మధ్య సాఫీగా ప్రక్రియ సాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లతో రైతుల నుంచి నేరుగా వరి పంటను సేకరిస్తున్నది. మద్దతు ధరను చెల్లిస్తూనే చివరి గింజ వరకు ధాన్యాన్ని సేకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నది. తద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు ఎనిమిదిన్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే సేకరించారు. వెనువెంటనే మర ఆడించేందుకు మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు సైతం చకచకా చేస్తున్నారు.
ఆనందంలో అన్నదాత …
ధాన్యం సేకరణకు ఏటా దాదాపు 2 నెలల పాటు ప్రక్రియ సాగుతుండడం పరిపాటి. కానీ ఈసారి సీజన్ ఆరంభం నుంచి సరిగ్గా నెల రోజుల్లోనే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ధాన్యం సేకరణ వేగంగా పూర్తయ్యింది. పడిగాపులకు ఆస్కారం లేకుండా నిర్ణీత కాల వ్యవధిలోనే మద్దతు ధర రైతుల ఖాతాల్లో జమ కూడా జరిగింది. ఎక్కడో ఒక చోట ఇబ్బందులు తలెత్తడం మినహా మిగిలిన అన్ని కొనుగోలు కేంద్రాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టవంతంగా ఏర్పాట్లు చేసింది. తద్వారా సేకరణ ప్రక్రియ విజయవంతంగా పూర్తి కావస్తున్నది. నిజామాబాద్ జిల్లాలో ఐకేపీ ద్వారా 65 సెంటర్లు ప్రారంభించి 44,949 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఇందులో 20 కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తయ్యింది. పీఏసీఎస్, డీసీఎంఎస్ ద్వారా 400 కేంద్రాల ద్వారా 4.38లక్షల మెట్రిక్ టన్నులు సేకరించారు. మెప్మా ద్వారా 5 కేంద్రాల్లో 6,227 మెట్రిక్ టన్నులు, 11 వ్యవసాయ మార్కెట్లలో 8,296 మెట్రిక్ టన్నులు సేకరించారు. 73,808 మంది రైతుల నుంచి మొత్తం 474 కేంద్రాల ద్వారా రూ.1025 కోట్లు విలువ చేసే 4లక్షల 97 వేల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించారు. ఇందులో 4.85లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపించారు.
ఇబ్బందుల్లేకుండా…
కరెంట్, సాగు నీరు, పెట్టుబడి సాయం, విత్తనాలు, ఎరువులు దేనికది ఓ ప్రణాళిక ప్రకారం రైతులకు అందుబాటులో ఉండడంతో ఉమ్మడి జిల్లా రైతాంగం మునుపెన్నడూ లేనంత సంతోషంగా ఉంది. వ్యవసాయ రంగాన్ని అన్ని రకాల సంక్షోభం నుంచి పరిరక్షించాలన్న సంకల్పం ప్రభుత్వానికి ఉండడంతోనే ఆ సంకల్పానికి మద్దతు అన్ని విధాలుగా లభిస్తోంది. కామారెడ్డి జిల్లాలో 21 ఐకేపీ కేంద్రాలు, 9 మార్కెట్ కమిటీలు, 317 పీఏసీఎస్ సెంటర్లు కలిపి మొత్తం 347 కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ వేగంగా జరుగుతున్నది. ఇప్పటి వరకు 56వేల మంది రైతుల నుంచి 3లక్షల 50వేల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని సేకరించారు. సేకరించిన మొత్తం ధాన్యం విలువ రూ.700కోట్లుగా ఉంది. ప్రస్తుతం క్వింటాలు వరి ధాన్యానికి మద్దతు ధర సాధారణ రకానికి రూ.2,040, ఏ గ్రేడ్ రకానికి రూ.2,060 చొప్పున అందుతున్నది. సన్న రకం ధాన్యానికి అనేక చోట్ల రూ.2,200 నుంచి రూ.2,500 వరకు ధర పలుకుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నా రు. వానకాలంలో ఎక్కువగా పొట్ట కోసం సన్నాలను వేసుకునే రైతులు సైతం అధిక ధరల నేపథ్యంలో ధాన్యం విక్రయానికే మొగ్గు చూపారు.
చివరి దశకు ధాన్యం సేకరణ
నిజామాబాద్ జిల్లాలో వరి ధాన్యం సేకరణ ప్రక్రియ దాదాపు చివరి దశకు చేరుకున్నది. కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాల ఆధ్వర్యంలో ధాన్యం రాక నిలిచి పోవడంతో కేంద్రాలను మూసేస్తున్నాం. ప్రతి కేంద్రం పరిధిలో చివరి గింజ వరకు సేకరించాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆ మేరకు పని చేస్తున్నాం. నిజామాబాద్లో రూ.వేయి కోట్ల ధాన్యాన్ని సేకరించగా ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలింపు ప్రక్రియ సైతం జరుగుతున్నది.
– చంద్రప్రకాశ్, పౌరసరఫరాల శాఖ అధికారి, నిజామాబాద్ జిల్లా
రైతులకు మద్దతు ధర కల్పిస్తున్నాం
కామారెడ్డి జిల్లాలో ధాన్యం సేకరణ చురుగ్గా కొనసాగుతున్నది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాం. గత అనుభవాల దృష్ట్యా కేంద్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లు చేశాం. సేకరించిన ధాన్యాన్ని తరలింపు విషయంలోనూ వాహనాల కొరతను పకడ్బందీ ప్రణాళికతో అధిగమిస్తున్నాం. మద్దతు ధర కన్నా తక్కువ రేటుకు రైతులు తమ పంటను అమ్ముకోవద్దని కోరుతున్నాం. సేకరించిన ధాన్యానికి మద్దతు ధరను కల్పిస్తున్నాం.
– జితేంద్రప్రసాద్, పౌరసరఫరాల సంస్థ మేనేజర్, కామారెడ్డి జిల్లా