నిజామాబాద్ కల్చరల్, అక్టోబర్ 22: ఆశ్వయుజ శుద్ధ దశమిని విజయానికి సంకేతంగా అమ్మవారిని ఆరాధించుకొనే విజయదశమి పర్వదినాన్ని సోమవారం ప్రజలు అట్టహాసంగా జరుపుకోనున్నారు. తొమ్మిది రోజులపాటు వైభవంగా సాగిన దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు దసరానాడే పూర్ణాహుతి, ఉత్తర పూజతో సంపూర్ణం కానున్నాయి. దసరాను పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.
పాలపిట్ట దర్శనం
పండుగనాడు పాలపిట్టను చూడడం ప్రత్యేకత. పాండవులు అరణ్య అజ్ఞాతవాసాలను ముగించుకొని రాజ్యానికి తిరిగి వస్తుండగా పాలపిట్ట కనబడిందని, అప్పటినుంచి వారికి విజయాలు కలిగాయని, అది విజయదశమి రోజు కావడంతో అనాటి నుంచి దశమినాడు పాలపిట్టను చూడడం ఆనవాయితీగా వస్తున్నది. పాలపిట్ట శుభాలకు, విజయాలకు చిహ్నం. పండుగరోజున ఈ పాలపిట్టను చూడడం ఎంతో అదృష్టంగా ప్రజలు భావిస్తారు. పాలపిట్టతోపాటు జంబి చెట్టు దర్శనం చేసుకోవడం ఈ రోజు మరోప్రత్యేకం.
మార్కెట్లో సందడి..
విజయదశమిని పురస్కరించుకొని కొనుగోలుదారులతో మార్కెట్లు సందడిగా మారాయి. పండుగ వేళ పండ్లు, పూలు, తమలపాకులు, పలురకాల స్వీట్లకు డిమాండ్ పెరిగింది. నగరంలో బంతి, చామంతి, గులాబీపూల విక్రయాలు జోరందుకున్నాయి. కిలో పూల ధర రూ. 100 నుంచి 150 వరకు విక్రయిస్తున్నారు. వీటితోపాటు జమ్మి ఆకు, మామిడి ఆకులు తదితర పూజా సామగ్రిని విక్రయిస్తున్నారు.
ప్రజలకు పోచారం, వేముల దసరా శుభాకాంక్షలు
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకొనే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. దసరా పండుగ రోజున చేపట్టిన ప్రతి కార్యం సఫలీకృతం కావాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు.