బాల్కొండ, జనవరి 5 : పేదలందరికీ ఆరు గ్యారెంటీ పథకాలను అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నది. చాలా గ్రామాల్లో అధికారులు సమయపాలన పాటించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గత నెల 28న ప్రారంభించిన ప్రజాపాలన కార్యక్రమం నేటి (శనివారం)తో ముగియనున్నది. దరఖాస్తు ఫారానికి జత చేయాల్సిన వివరాలపై రెండుమూడు రోజుల వరకు స్పష్టత లేకపోవడంతో చాలా మంది కేవలం సమాచారం తీసుకొని వెళ్లిపోయారు. జనంలో ఇలాంటి గందరగోళం నెలకొనగా.. ప్రభుత్వం ఇచ్చిన గడువు సమీపించింది. దీంతో దరఖాస్తులు అందించేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు.
ఈ నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ప్రజలకు మరింత ఆందోళన చెందుతున్నారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాల్సి ఉండగా, బాల్కొండ మండలంలోని వన్నెల్(బీ) గ్రామంలో సిబ్బంది శుక్రవారం 4 గంటలకే అన్నీ సర్దుకొని వెళ్లిపోయారు. దరఖాస్తు ఫారాలు అందించేందుకు వచ్చిన ప్రజలు ఖాళీ కుర్చీలు, టేబుళ్లను చూసి విస్తుపోయారు. సమయం అయిపోయిందని అక్కడ ఉన్నవారు సమాధానం ఇవ్వడంతో చేసేదేమీ లేక వెనుదిగిరిగారు. దరఖాస్తులు అందించేందుకు శనివారంతో గడువు ముగియనుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.