విద్యానగర్,జనవరి 24 : ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు వజ్రాయుధం లాంటిది. దేశాభివృద్ధి కోసం నిస్వార్థంగా పని చేసేవారిని ఎన్నుకోవడానికి ఓటు ఒక చక్కటి మార్గంగా పనిచేస్తుంది. ఓటు హక్కును పొందడానికి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ అర్హులే. అర్హులైన వారు ఓటు హక్కు పొందడానికి ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో గ్రామస్థాయి నుంచి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నది. యువత సకాలంలో ఓటు హక్కు పొందితే దీనికి మరింత సార్థకత చేకూరుతుంది.
దేశప్రగతికి నిస్వార్థంగా పనిచేసేవారిని ఎన్నుకోవడానికి ఓటు చక్కటి మార్గం. భారత రాజ్యాంగం 15వ భాగంలోని 326వ నిబంధన ద్వారా దీన్ని కల్పించింది. 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటింగ్ వయస్సు 18 సంవత్సరాలకు తగ్గించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందేలా ఎన్నికల సంఘం కృషి చేసింది. దేశంలో పార్లమెంట్, శాసనసభలకు ఐదేండ్లకోసారి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 1980 వరకు వయోజనుల ఓటు హక్కు 21 ఏండ్లుగా ఉండేది. రాజీవ్గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఓటుహక్కును 18 ఏండ్లకు కుదించారు. అప్పటి నుంచి 18 ఏండ్లకు ఓటు హక్కు కల్పించింది రాజ్యాంగం.
యువత ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి
నోటు మాటున ఓటెయ్యకుండా ప్రజాస్వామ్యాన్ని కాటేయకుండా ఉండే నాయకుడిని ఎన్నుకునేందుకు ప్రతి ఒకరూ కృషి చేయాలి. గత అభ్యర్థి గుణాగణాలను గుర్తుంచుకొని ఓటు వేయాలి. అవినీతిపరుల ఆట కట్టించడానికి ఓటు పనిచేస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యదేశమైన ఇండియాలో ఎన్నికల ద్వారా నాయకులను ఎంపిక చేసుకొనే హక్కు ఉంది. యువత తన ఓటు లెక్కలోకి రాదని కాకుండా ప్రజాస్వామ్యాన్ని ముందుకు నడిపించేందుకు తప్పనిసరిగా ఓటు వేయాలి. ఒక్కరోజు ఓటు వేయక పోతే 5 ఏండ్లు బాధపడాల్సి ఉంటుంది. దేశంలో వచ్చే ప్రతి మార్పు యువత భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమే అన్న అవగాహన ప్రతి ఒకరిలో రావాలి. మంచి నాయకుడితోనే దేశాభివృద్ధి జరుగుతుంది.
ఓటుకు నోటు కాకుండా పనిచేయాలి. నచ్చిన అభ్యర్థి లేక పోతే నోటాను వినియోగించుకోవాలి. మంచి నాయకుడిని చూసి ఓటు వేయాలి కానీ పార్టీని చూసి ఓటు వేయకూడదు. నూతన ఓటర్లు ఆలోచించి ఓటువేయాలి. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు హక్కు. కులమతాలకు అతీతంగా ఓటును వేయాలి. దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎన్నికల విధానం ప్రపంచంలోనే గొప్పది. తమ చట్టు పక్కల నిరక్షరాస్యులు, అవగాహన లేని వారికి ఓటు హక్కు గొప్పతనంపై యువకులు అవగాహన కల్పించి ప్రజాస్వామ్య పరిరక్షణపై చైత్యనం కల్గిస్తూ ప్రజాస్వామాన్ని కాపాడాల్సిన హక్కు ఉంది.
ఓటర్ గుర్తింపు కార్డు ప్రయోజనాలు
ఓటు వేయడానికి, పాస్పోర్టు పొందడానికి, పాన్కార్డు పొందడానికి, సంక్షేమ కార్యక్రమాల లబ్ధికి, గుర్తిపు వయస్సు, మొబైల్ కనెక్షన్, బ్యాంక్ ఖాతా, డ్రైవింగ్ లైసెన్స్ తదితర సంబంధించిన విషయాల్లో ఓటరు కార్డు ఉపయోగపడుతుంది. మరిన్ని వివరాలకు టోల్ఫ్రీ నంబర్ 1950 ఉపయోగించి తెలుసుకోవచ్చు. ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి పౌరుని బాధ్యత. ఓటరు నమోదు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓటరు కార్డును పొందాలి.