ఖలీల్వాడి జూలై 20 : తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో శుక్రవా రం మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ఐటీ హబ్లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ మేళాను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని భూమారెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించే జాబ్మేళాకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జాబ్మేళాలో అరూప టెక్నాలజీస్, భారత్ క్లౌడ్, బ్రియో టెక్నాలజీస్, చిత్రపురి ఫిల్మ్ఫెస్టివల్, క్రిటికల్ రివర్ టెక్నాలజీస్, ధరణి జియోస్పాటియల్ టెక్నాలజీస్, డిజిటల్ ఎమ్ఎల్ సొల్యూషన్స్, డీఎస్ టెక్నాలజీస్, హెచ్ఆర్హెచ్ నెక్ట్స్ , ఐటీ అమెరికా, ప్రణతి సాఫ్ట్వేర్ సర్వీసెస్, వీటెల్ గ్లోబల్ కమ్యూనికేషన్, విమాక్స్ ఈ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ తదితర కంపెనీలు పాల్గొంటున్నాయి. కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా హాజరవుతున్నట్లు టాస్క్ సిబ్బంది తెలిపారు.
స్థానిక యువతకు ఉపాధే లక్ష్యం..
నగరంలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న ఐటీ హబ్ను అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్గుప్తా.. టాస్క్ సీఈవో శ్రీకాంత్తో కలిసి గురువారం పరిశీలించారు. ఐటీ హబ్లో ఉద్యోగాల భర్తీ కోసం భూమారెడ్డి కన్వెన్షన్లో నిర్వహించనున్న జాబ్మేళా ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగాన్ని విస్తరించి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పం నెరవేరనున్నదన్నారు. ఐటీ హబ్ నిర్మాణం పూర్తయ్యిందని, ఈ నెల 29న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు.
ఐటీ హబ్లో ఉద్యోగాల కల్పన కోసం టాస్క్ ఆధ్వర్యంలో పలు ప్రఖ్యాత కంపెనీలతో ఒప్పందాలు పూర్తయ్యాయని, శుక్రవారం ప్రముఖ కంపెనీలు భూమారెడ్డి కన్వెన్షన్లో జాబ్మేళా ద్వారా ఐటీ హబ్లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయన్నారు. స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని, ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, బీఆర్ఎస్ నాయకులు సుజీత్సింగ్ ఠాకూర్, సత్యప్రకాశ్, ధర్మపురి, చింతకాయల రాజు, టాస్క్ ప్రతినిధుల బృందం పాల్గొన్నారు.