మెండోరా/బాల్కొండ/ ముప్కాల్/వేల్పూర్/ ఏర్గట్ల, జూలై 28 : భారీ వర్షాల నేపథ్యంలో నష్టపోయినవారిని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వరదలో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి భోజన వసతి కల్పించినట్లు చెప్పారు. బాధితులకు ఆపద్బంధు, పూర్తిగా ఇండ్లు కోల్పోయిన వారికి గృహలక్ష్మి పథకం అందజేసి ఆదుకుంటామన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో బాల్కొండ నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి శుక్రవారం పర్యటించారు. వేల్పూర్ మండలం పడిగెల్ గ్రామంలో తెగిన నవాబ్ తదితర చెరువులు, ధ్వంసమైన రహదారులు, వంతెనలను పోలీస్ వాహనంలో వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిశీలనకు వెళ్తూ మార్గమధ్యంలో బాల్కొండ, ముప్కాల్ మండలకేంద్రాల్లో స్థానిక నాయకులతో మాట్లాడారు. లోతట్టు ప్రాంతాల్లో బాధితులకు అండగా ఉండాలని, నిత్యావసర సరుకులు అందించాలని సూచించారు. వన్నెల్(బీ), బోదేపల్లి, బాల్కొండ మండల ప్రజలు, నాయకులను కలుస్తూ ఆయా గ్రామాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మెండోరా మండలం కోడిచెర్ల-సావెల్ రహదారిపై నుంచి ఉధృతంగా వరద పారడంతో మంత్రి పరిశీలించారు. ఆర్అండ్బీ అధికారులకు ఫోన్చేసి శాశ్వత ప్రాతిపదికన ఏం చేయవచ్చునో పరిశీలించాలని ఆదేశించారు. ఎస్సారెస్పీ 30 గేట్ల ద్వారా మిగులు జలాలను గోదావరిలోకి వదులుతుండడంతో అధికారులతో కలిసి పరిశీలించారు. ఏర్గట్ల మండలం బట్టాపూర్ శివారులోని పెద్దవాగుతోపాటు ఏర్గట్ల నుంచి జగిత్యాల్ జిల్లా వర్షకొండకు వెళ్లే మార్గంలో ఉన్న తీగలవాగు వంతెనను వేముల పరిశీలించారు.
గోదావరి సమీపానికి వెళ్లే సాహసం వద్దు..
ఎస్సారెస్పీ వద్ద మంత్రి ప్రశాంత్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎగువ ప్రాంతం నుంచి భారీగా ఇన్ఫ్లో ఉన్నందున గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నది సమీపానికి వెళ్లే సాహసం చేయొద్దని హితవు పలికారు. ఈ మేరకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎస్సారెస్పీకి 80 నుంచి 82 టీఎంసీల వరకు నీరునిల్వ ఉంచుతూ, మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. వరద మరింత పెరిగినా ఇబ్బంది ఉండదని, 5లక్షల క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేయవచ్చని మంత్రి స్పష్టం చేశారు.
ఎస్సారెస్పీని గతంలో ఏ సీఎం పట్టించుకోలేదు..
గత ముఖ్యమంత్రులు ఏనాడూ ఎస్సారెస్పీని పట్టించుకోలేదని మంత్రి వేముల అన్నారు. సీఎం కేసీఆర్ మొదటిసారి ఎస్సారెస్పీ గేట్ల మరమ్మతుల కోసం రూ.22కోట్ల నిధులను మంజూరు చేశారని గుర్తుచేశారు. ఒకేసారి అన్ని గేట్ల మరమ్మతులు చేపట్టడం సాధ్యపడనందున విడుతల వారీగా పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం మరో ఆరు గేట్లకు మరమ్మతులు పూర్తికావాల్సి ఉందన్నారు. వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉందని, దెబ్బతిన్న రోడ్లు, చెరువులకు తక్షణమే తాత్కలిక మరమ్మతులు చేపట్టాలని ఆదేశించామన్నారు. ప్రభుత్వపరంగా అన్ని సహాయక చర్యలు చేపడుతున్నామని, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ బాధితులను ఆదుకునేందుకు చొరవ చూపాలని పిలుపునిచ్చారు. ఇంకా వరదలు ప్రవహిస్తున్న దృష్ట్యా మరో రెండు రోజుల పాటు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని మంత్రి కోరారు.