వినాయక్నగర్, ఫిబ్రవరి 20: కాంగ్రెస్ పార్టీ నాయకులు చేతకాని దద్దమ్మలు. అరవై ఏండ్ల పాలనలో పసుపు రైతులను అధోగతి పట్టించిండ్రు. చెరుకు ఫ్యాక్టరీలు బంద్ చేయించిండ్రు. అలాంటి కాంగ్రెస్ దొంగలను రైతులు నమ్మొద్దని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి మండిపడ్డారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారితో కలిసి నిజామాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు.
హస్తం పార్టీ దిక్కుమాలిన రాజకీయాలతో రైతులు మోసపోతున్నారని తెలిపారు. 34 ఏండ్లలో కాంగ్రెస్ పార్టీతో చేతకాని పసుపుబోర్డును బీజేపీ తీసుకొచ్చిందన్నారు. చెరుకు ఫ్యాక్టరీలను తెరిపిస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. ఎప్పుడు తెరిపిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రూ.14 వేలు ఉన్న పసుపు ధరను రూ.20 వేలు ఎలా దాటిస్తామో చూడాలని సవాల్ విసిరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ర్యాలీకి అనుమతించిన పోలీసులు.. శివాజీ జయంతి ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడం సరికాదన్నారు.