ఇందల్వాయి, ఫిబ్రవరి 4: వరి దిగుబడులు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. స్థూలపోషకాలతోపాటు సూక్ష్మపోషకాల లోపంతో మొక్క ఎదుగుదల మందగిస్తుంది. వరి, ఇతర ప్రధాన పంటల్లో జింక్ పోషక లోపం ప్రధాన సమస్యగా మారింది.
పైరుకు నత్రజని అవసరం మొదటి నుంచి చివరి వరకూ ఉంటుంది. 3-4 దఫాలుగా యూరియా వేయాలి. యూరియా వేసేటప్పుడు తేమ ఉండేలా చూడాలి. వరి నాట్లు వేసేటప్పుడు, పిలక, చిరుపొట్ట దశలో వేయాలి. నీరు తీసేసి బురద పదును మీద చల్లి 24-48 గంటల తర్వాత నీరు పెట్టాలి. వేపపిండి కలిపి యూరియా వేసుకుంటే నత్రజని సామర్థ్యం పెరగడంతోపాటు చీడపీడలను అరికడుతుంది. (50 కిలోల యూరియాలో 5 కిలోల వేపపిండి కలపాలి) భూమిలో తగిన తేమ లేనప్పుడు ఎరువును వేసిన తర్వాత నీరు పెట్టడానికి వసతి లేనప్పుడు, సమస్యాత్మక భూములలో నత్రజని అందించడానికి సాధారణంగా అన్ని పంటల మీద, ఫలవృక్షములపై 2-3 శాతం యూరియా ద్రావణాన్ని పిచికారీ చేయాలి. మెట్ట పైర్లలో యూరియా వెదజల్లడం లేదా మొక్క పక్కనే గుంతలో వేసి మట్టి కప్పితే యూరియా వృథాను అరికట్టవచ్చు.