నవీపేట, మార్చి 12: మండల కేంద్రంలో మంగళవారం పట్టపగలే సినీఫక్కీలో చోరీ జరిగింది. నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ సతీశ్కుమార్, ఎస్సై యాదగిరిగౌడ్ కథనం మేరకు.. రిటైర్డ్ విద్యుత్ శాఖ ఉద్యోగి నర్సింహస్వామి మండల కేంద్రంలోని లింగమయ్య గుట్టలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. మంగళవారం 11 గంటలకు ఆయన మార్కెట్కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నాడు. పాత పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురుగా మాస్కులు ధరించి బైక్పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు నర్సింహస్వామిని అడ్డగించారు.
తాము పోలీసులమని, ముందర మా పెద్ద సార్లు తనిఖీలు చేస్తున్నారని, బంగారు చైన్, రెండు ఉంగరాలు ప్యాక్ చేసి స్కూటీ డిక్కీలో పెట్టుకోవాలని చెప్పారు. బంగారాన్ని తీయగా నిందితులు ఓ కాగితంలో ప్యాక్ చేసి వారి వద్ద ఉన్న రోల్డ్ గోల్డ్ బంగారాన్ని డిక్కీలో పెట్టారు. మూడున్నర తులాల అసలు బంగారాన్ని ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు క్లూస్ టీంలను రంగంలోకి దించి నిందితుల కోసం గాలిస్తున్నామని సీఐ, ఎస్సై పేర్కొన్నారు.