పసుపు రైతుకు ఈ యేడు కూడా కన్నీళ్లు తప్పట్లేదు. ఆశించిన మేర దిగుబడులు రావట్లేదు. అదే సమయంలో మార్కెట్లో గిట్టుబాటు ధర కూడా దక్కట్లేదు. సీజన్ ఆరంభంలోనే నష్టాలు పలుకరిస్తుండడంతో అన్నదాతలు ఆగమవుతున్నారు. నిజామాబాద్ మార్కెట్యార్డుకు ఇప్పుడిప్పుడే పసుపు ఉత్పత్తులు వస్తున్నాయి. గంపెడాశతో మార్కెట్కు పంటను తీసుకొస్తున్న రైతులు.. ధరలు చూసి నివ్వెరపోతున్నారు. క్వింటాలు ధర గరిష్ఠంగా రూ.6 వేలలోపే పలుకుతుండడం కర్షకులను కలవరపాటుకు గురిచేస్తున్నది. పసుపుబోర్డు తెస్తానని మోసం చేసిన ఎంపీ అర్వింద్.. కనీసం ధర విషయంలోనూ పట్టించుకోక పోవడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తన వల్లే పసుపు ధర రూ.10 వేలకు చేరిందని ప్రచారం చేసుకుంటున్న బీజేపీ ఎంపీ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. మాట్లాడితే స్పైసిస్బోర్డు గురించి గప్పాలు కొట్టుకునే అర్వింద్.. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మద్దతు ధర ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
నిజామాబాద్, జనవరి 13, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పసుపు రైతుల గోస ఈ సీజన్లో తీవ్రంగానే ఉండబోతున్నది. ఓ వైపు దిగుబడుల రందితో దిగాలుగా ఉన్న అన్నదాతలకు మార్కెట్లో మద్దతు ధర లేకపోవడంతో మరింత నిరుత్సాహానికి గురి చేస్తున్నది. సీజన్ ఆరంభంలో ఎప్పుడైనా భారీగా ధర పలకడం ఆనవాయితీ. అందుకు విరుద్ధంగా ఈసారి కనిష్ఠంగా రూ.4వేలు మాత్రమే ఉండడంతో రైతన్నలు నిట్టూరుస్తున్నారు. పెట్టుబడులు చేతికి వస్తే అదే పది వేలు అనుకుంటున్న వేళ మద్దతు ధర అన్నది లభించకపోతే మా పరిస్థితి ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పసుపు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంటే బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాత్రం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడం విడ్డూరంగా మారింది. తాజాగా స్పైసెస్ బోర్డు మెంబర్గా పదవిని స్వీకరించిన ఎంపీ కనీసం పసుపు రైతుల ఊసెత్తకపోవడంపై కర్షకులు కన్నెర్ర చేస్తున్నారు. చేతికొస్తున్న పసుపు పంటను పాలిష్ చేస్తున్న రైతులు ఇప్పుడిప్పుడే అమ్మకానికి సిద్ధం అవుతున్నారు. మరికొద్ది రోజుల్లోనే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కు భారీగా పసుపు దిగుబడులు రానున్నాయి. ఈ సమయంలో రైతుల అవస్థలు వర్ణనాతీతంగా మారుతున్నాయి.
నిజామాబాద్ జిల్లాలో ఈ సీజన్లో పసుపు పంట చాలా తక్కువ విస్తీర్ణంలోనే సాగైంది. ప్రతి సంవత్సరం సుమారు 34 వేల ఎకరాల్లో పసుపు సాగయ్యేది. ఈ సారి కేవలం 30వేల ఎకరాల్లోపే పరిమితమైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు ఈసారి తెగుళ్ల బాధతో పసుపు రైతులు తీవ్రంగా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మండ ఎదుగుదలపై తెగుళ్లు ప్రభావం చూపుతుండడంతో నాలుగు నెలలుగా పసుపు సాగు చేస్తున్న రైతుల్లో ఆందోళన వెంటాడుతున్నది. మందులు పిచికారీ చేసినప్పటికీ దిగుబడి ఎంత వస్తుందో? అన్న బాధలో వారంతా మునిగి తేలుతున్నారు.
9 నెలల పంట కాలం కాస్త ఇప్పుడు చివరి దశకు చేరింది. జనవరి 13 తేదీకి ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో కొద్ది మంది రైతులు ఇప్పటికే పసుపును తవ్విస్తున్నారు. ప్రాసెసింగ్లోనూ తలమునకలవుతున్నారు. సీజన్ ఆరంభం అవుతున్న వేళ మార్కెట్లో రూ.4వేలు మాత్రమే క్వింటాలుకు ధర పలకడం వారిని తీవ్రంగా వేధిస్తున్నది. ఇలాగైతే పసుపు పంటను అమ్ముకునేదెలా అంటూ దిగాలు చెందుతున్నారు. గరిష్ఠంగా రూ.6,333 ధర పలుకుతున్నప్పటికీ మార్కెట్లో అడ్తిదారుల మాయాజాలంతో రైతన్న బలి కావడం తథ్యం. ఫలితంగా గరిష్ఠ ధర సైతం చేతికి రావడం అనుమానంగానే ఉంది.
గతేడాది తన వల్లే రికార్డు స్థాయిలో పసుపునకు క్వింటాలు ధర రూ.10వేలకు పైగా పలికిందని గొప్పలు చెప్పుకున్న ఎంపీ అర్వింద్ ఇప్పుడెందుకు స్పందించడం లేదంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు 2019 సాధారణ ఎన్నికల్లో పసుపు బోర్డు, పసుపు పంటకు కనీస మద్దతు ధర కల్పిస్తానంటూ ఏకంగా రైతులకు రూ.100 బాండ్ పేపర్ రాసిచ్చిన ఘనుడు ఎంపీ అర్వింద్కే చెల్లింది. మూడున్నరేండ్లుగా పదవిని దర్జాగా అనుభవిస్తూ రైతుల బాధలను మాత్రం పట్టించుకోవ డం లేదు. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కనీసం దృష్టి పెట్టడం లేదు.
పసుపు బోర్డుకు మంగళం పాడినట్లే కనీస మద్దతు ధర అంశాన్ని అటకెక్కించిన అర్వింద్ను ఇప్పుడు రైతులు అడుగడుగునా ప్రశ్నిస్తున్నారు. రూ.4వేలకే పసుపు పంట క్వింటాలు ధర దక్కుతుంటే రైతుల కష్టార్జితం ఏమి కావాలని రైతులు అడుగుతున్నారు. మద్దతు ధర విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో చర్చించి రైతులకు న్యాయం చేయించాల్సిన బాధ్యత ఎంపీకే ఉందని ఇందూర్ ప్రాంత కర్షకులు డిమాండ్ చేస్తున్నారు. దొంగ హామీలతో ఓట్లు వేయించుకున్న అర్వింద్కు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామంటూ హెచ్చరిస్తున్నారు.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సరిగ్గా నెలకోసారి మాత్రమే నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తుంటాడు. కొంత కాలంగా పత్తా లేకుండా పోయి న ఎంపీ… శుక్రవారం బీజేపీ కార్యాలయానికి వచ్చాడు. స్థానికంగా బీజేపీ కార్యక్రమాల్లోనే పా ల్గొని వెనుతిరిగాడు. ఈ మధ్యనే స్పైసెస్ బోర్డులో మెంబర్గా పదవి తెచ్చుకున్న అర్వింద్ ఆ హోదాలోనూ జిల్లాలో తొలిసారి కాలు మోపాడు. స్పైసెస్ బోర్డు ఎక్స్టెన్షన్ కార్యాలయం పేరుతో కాలయాపన చేస్తున్న అర్వింద్ ఇప్పుడేకంగా బోర్డు మెంబర్గా ఏమి ఎలగబెడుతాడంటూ రైతులు ఎదురు చూస్తున్నారు.
ఎంపీ హోదాలో అధికారిక కార్యక్రమాల్లో తక్కువగా పాల్గొనే అర్వింద్… నిజామాబాద్ జిల్లాలో ఎక్కువగా కాషాయ పార్టీ కార్యక్రమాల్లోనే పాల్గొంటాడు. అందులో బీఆర్ఎస్ పార్టీ నేతలను రెచ్చగొట్టడానికి తన సమయాన్ని కేటాయించడం తప్ప అభివృద్ధిపై, ప్రజల సంక్షేమంపై మాట్లాడేది ఏమీ ఉండదు. దీంతో అర్వింద్ జిల్లాకు ఎప్పుడొచ్చినా జనం రాక అన్నది సన్నగిల్లింది. వెంట వచ్చే కాషాయ కార్యకర్తలు సైతం తగ్గుముఖం పడుతున్నారు. అర్వింద్తో తిరిగితే ఇజ్జత్ కూడా దొరుకుతలేదు అన్నట్లుగా లోలోపల బీజేపీ శ్రేణులు మథన పడుతున్నట్లుగా తెలిసింది. ఇందుకు గ్రూపుల వారీగా బీజేపీలో జరుగుతున్న లొల్లి సైతం కారణంగా నిలుస్తున్నది.
మోర్తాడ్ : పసుపు బోర్డు తెస్తానని రైతులకు పంగనామాలు పెట్టిన అరవింద్ జిల్లాలో పసుపు రైతుల బాధల విషయంలో ఇప్పటికీ స్పందించకపోవడం విడ్డూరం. మాట్లాడితే అబద్దాలు..ఏదో చేసి గెలవాలి రైతులు, ప్రజలు మోసపోతే నాకేంటి నేను పదవిలో ఉండాలి అనే తత్వం ఎంపీలో కనబడింది. పసుపురైతులు ఆగమవుతున్నా జిల్లాలోని ఎంపీగా ఇప్పటి వరకు పట్టించుకోకుండా రైతులను ఆగం చేస్తుంటే ఏమనుకోవాలో అర్థంకాని పరిస్థితి. పసుపురైతుల విషయంలో కేంద్రం మాకేంటి అనే రీతిలో వ్యవహరిస్తుందన్నది.
-తాటిపల్లి శ్రీనివాస్, రైతు దొన్కల్
ప్రతి సారి ప్రారంభంలో మార్కెట్కు పంట తీసుకెళ్లిన సమయంలో ధర ఎక్కువగా ఉంటుండే. ఈ సారి కనీసం ఖర్చులు కూడా రాని పరిస్థితి. ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియదు. ఎన్నో ఆశలతో పసుపు పంటను పండించే మేము ఇప్పుడు నిరాశతో ఉన్నాం. ఏటా పసుపు పంటతో లాభాలు వస్తాయని ఎన్నో ఆశలతో ఉంటాం కానీ సరైన ధరలు రాక ఇబ్బందుల పడుతున్నాం. ఇప్పటికైనా ధర సరిగా వచ్చేలా చూసి మాకు లాభం చేకూరేలా చూడాల్సిన అవసరం ఉంది.
-అరబ్బు పెద్దగంగారెడ్డి, రైతు దొన్కల్
పసుపుబోర్డు తీసుకొస్తానని చెప్పి రైతులను మోసం చేసి ఎంపీగా ఎన్నికైన అరవింద్ ఏం చేస్తున్నాడు. ఎందుకు హామీ ఇవ్వడం.. ఎందుకు రైతులను మోసం చేయడం ఇప్పటికీ దీనికి సరైన సమాధానం చెప్పని పరిస్థితి. ఎంపీగారు ఇప్పటికైనా ఆలోచించి పసుపు రైతులకు న్యాయం చేసేలా చూడాలి. ఏది మాట్లాడితే అది రైతులు నమ్ముతారని అనుకుంటే భవిష్యత్తులో మేమేంటో చూపుతాం. ఇప్పటికైనా పసుపు రైతులను కేంద్రం ఆదుకునే దిశగా ఎంపీ ప్రయత్నించాల్సిన అవసరం ఉంది.
-క్యాతం సంతోష్, రైతు పాలెం
ఎన్నడూ లేని విధంగా ఈసారి పసుపు ధర తక్కువగా ఉంది. ఏటా సీజన్ ప్రారంభంల ఎక్కువ ధర ఉంటుండే. ఇయ్యోడు రూ.4వేల వరకే ఉంది. మా పరిస్థితి ఏమిటోనని భయమైతున్నది. ఎంతో ఆశతో పంట పండిస్తే గిట్టుబాటు అయితలేదు. చేతపనితో పాటు చేతినుంచి ఉల్టా పైసలు పోతున్నయి. రేటు ఇట్లనే ఉంటే పసుపు పండించుడు బంద్ అయితది. ఇప్పటికైనా ఎంపీ అర్వింద్ రైతులకు ఎట్ల న్యాయం చేస్తారో చెప్పాలి.
– గుండేటి శంకర్, రైతు, పాలెం