బోధన్ రూరల్, మార్చి 2: హోలీ పండుగ అంటేనే ప్రతి ఒక్కరూ రంగులు చల్లుకుంటూ అనందంలో మునిగిపోతారు. కానీ సాలూరా మండలంలోని హున్సా గ్రామంలో హోలీ పండుగ రోజున పిడిగుద్దులాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈసారి కూడా బుధవారం పిడిగుద్దులాట నిర్వహించనుండగా, ఇందుకోసం గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి కొన్ని నిమిషాల పాటు పరస్పరం ముఖాలపై పిడిగుద్దులు కురిపించుకుంటారు. హోలీ పండుగ వచ్చిందంటే చాలు గ్రామంలో సందడి నెలకొంటుంది. ఈ ఆటను చూసేందుకు మహారాష్ట్ర నుంచి కూడా ప్రజలు తరలివస్తారు. పిడిగుద్దులాట బయటివారికి వింతగా కనిపించినా హున్సా గ్రామస్తులు మాత్రం ఆచారంగా భావిస్తారు. ఈ ఆటను ఎంతో ఇష్టంతోఆడుతారు.
ఆటను ఎలా ఆడుతారు?
పిడిగుద్దులాట బాక్సింగ్ను తలపిస్తుంది. కొన్నేండ్లుగా ఈ ఆటను ఆడడం ఆచారంగా వస్తుందని గ్రామస్తులు తెలిపారు. మంగళవారం చంద్ర గ్రహణం ఉండడంతో హోలీ సంబురాలు, పిడిగుద్దులాటను బుధవారం నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. సాయంత్రం కుస్తీపోటీలు నిర్వహించిన అనంతరం హనుమాన్ మందిరం వద్ద పిడిగుద్దులాటను జరుపుకొంటారు. రెండు వర్గాలుగా విడిపోయి మధ్యలో పెద్దతాడును అడ్డంగా కడతారు. తాడును రెండు వైపులా మోహరించిన గ్రామస్తులు సుమారు 5 నుంచి 10 నిమిషాలపాటు కొట్టుకుంటారు. ఈ ఆటలో ఎలాంటి గాయాలైనా మందుల జోలికి వెళ్లరు. అక్కడి మట్టిని గాయాలకు రాసుకుంటే తగ్గిపోతాయని వారి నమ్మకం. పిడిగుద్దులాట తర్వాత ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఈ ఆటను ఆడకుంటే గ్రామానికి అరిష్టం జరుగుతుందని గ్రామస్తుల నమ్మకం.