కోటగిరి, ఫిబ్రవరి 2: వర్ని మండలం జలాల్పూర్ గ్రామ శివారులోని బడాపహాడ్ వద్ద మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఉర్సు గురువారం ప్రారంభమయ్యింది. ఈ ఉత్సవాలను సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించగా..రాష్ట్ర వక్ఫ్బోర్డు చైర్మన్ మసీఉల్లా ఖాన్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి పాల్గొన్నారు. గ్రామంలోని మసీదు వద్ద ఏర్పాటు చేసిన కవ్వాలి కార్యక్రమంలో సభాపతిని ముస్లిములు సన్మానించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న బడాపహాడ్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ పుణ్యక్షేత్రం ప్రాముఖ్యతను కాపాడుకుందామని పిలుపునిచ్చారు.
మన రాష్ట్రం మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక పరిసర రాష్ర్టాల ప్రజలు సైతం బడాపహాడ్ పుణ్యక్షేత్రానికి తరలి వచ్చి షాదుల్లా బాబా ఆశీస్సులు పొందుతారని తెలిపారు. ఉర్సులో సర్వ మత సమానత్వం స్పష్టంగా కనబడుతుందన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజలు సహకరించాలని కోరా రు. అంతకుముందు ఉత్సవాల ప్రారంభానికి ముందు స్పీకర్ బడాపహాడ్ వద్ద భక్తుల సౌకర్యాల కల్పన కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి వక్ఫ్బోర్డు చైర్మన్ మసీఉల్లాఖాన్తో కలిసి పర్యటించారు. దర్గా వద్ద భక్తుల నుంచి బలవంతంగా వసూలు చేస్తున్నారని, వస్తువులను కూడా అధిక ధరలకు విక్రయిస్తున్నారని, అవినీతి కూడా ఎక్కువగాఉన్నదని చర్యలు తీసుకోవాలని వక్ఫ్బోర్డు చైర్మన్కు సూచించారు.
వర్ని మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శిబిరంలో నేత్ర పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం బడాపహాడ్ వద్ద రూ. 10 లక్షలతో నిర్మించిన బస్టాండ్ను ప్రారంభించారు. బస్టాండును భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ మేక శ్రీలక్ష్మీ వీర్రాజు, జడ్పీటీసీ బర్దావల్ హరిదాస్, వైస్ ఎంపీపీ దండ్ల బాలరాజు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ సింగంపల్లి గంగారాం, మండల కో -ఆప్షన్ మెంబర్ కరీం, ఏఎంసీ వైస్ చైర్మన్ వెలగపూడి గోపాల్, సహకార సంఘాల అధ్యక్షులు నామాల సాయిబాబా, కృష్ణారెడ్డి, సర్పంచులు అనితా వెంకట్ గౌడ్, రాజు, రేణుక, పద్మ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.