రాజకీయ ఉద్దండుడిగా పేరున్న ధర్మపురి శ్రీనివాస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆరోగ్యం సహకరించని ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపీ అర్వింద్.. తన స్వార్థం కోసం తండ్రిని అడ్డం పెట్టుకొని కుటిల రాజకీయాలకు తెరలేపాడంటూ ప్రజలే కాకుండా సొంతింటి వారే అసహ్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లోని ఓ వ్యక్తి డర్టీ పాలిటిక్స్ చేస్తున్నాడని.. ఇది బీజేపీ చేస్తున్న డ్రామా అని.. అనవసరంగా తల్లిని రాజకీయాల్లోకి లాగుతున్నారని డీఎస్ పెద్ద కుమారుడు సంజయ్ బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. అర్వింద్ ఒత్తిడితోనే డీఎస్ ఒక్కరోజులోనే కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారంటూ తమ్ముడి తీరుపై మాజీ మేయర్ సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మొదటి నుంచి తండ్రి వెంటే నడిచిన అర్వింద్ బీజేపీలో చేరాడు. దీంతో రాజకీయ భవిష్యత్తు కోసం డీఎస్ బీఆర్ఎస్లో చేరగా రాజ్యసభ సీటును అప్పగించింది. ఆదరించిన గులాబీ పార్టీపైకే తండ్రిని అర్వింద్ ఉసిగొల్పాడు. దీంతో డీఎస్పై అసమ్మతినేతగా ముద్రపడింది. ఇక పెద్దకొడుకు సంజయ్తో కలిసి ఇటీవల కాంగ్రెస్లో చేరగా తల్లితో ఓ వీడియోను, తండ్రితో రాజీనామా లేఖను ఇప్పించి తన స్వార్థం కోసం కుటుంబ సభ్యులను పావులుగా వాడుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.
నిజామాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ధర్మపురి శ్రీనివాస్ సంక్షిప్తంగా డీఎస్. ఈ పేరు నిజామాబాద్ రాజకీయాల్లో తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లాలో బలమైన నాయకుడిగా ఉన్న ఆయన.. ఇప్పుడు వృద్ధాప్యంలో కొడుకుల చేతిలో కీలుబొమ్మగా మారడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరీ ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీరుతో డీఎస్ పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావంటూ సోషల్ మీడియాలో సెటైర్లు తెగ వైరల్ అవుతున్నాయి. తన స్వార్థ రాజకీయం కోసం తండ్రిని ముందు పెట్టి రాజకీయం చేయడం ఏమిటని నిజామాబాద్ వాసులు నేరుగా అర్వింద్ను ప్రశ్నిస్తున్నారు. నీ అవసరం కోసం తండ్రి ఆరోగ్యాన్ని కూడా పణంగా పెడతావా? అంటూ సెటైర్లు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరుతున్నట్లుగా ఇటీవల స్పష్టం చేసిన డి.శ్రీనివాస్ ఏకంగా 24గంటలు తిరగక ముందే తిరిగి రాజీనామా చేస్తున్నట్లు లేఖ విడుదల కావడం, అందులో డీఎస్ భార్య కూడా వీడియో విడుదల చేయడం ఉమ్మడి జిల్లాలో తీవ్ర దుమారం రేపుతోంది. నేటికీ ఈ అంశం ఆయా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
చాలా రోజులుగా డి.శ్రీనివాస్ బాహ్య ప్రపంచానికి కనిపించడం లేదు. ఆరోగ్యం సహకరించకపోవడంతో కేవలం ఇంటికే పరిమితం అయ్యారు. మధ్యలో ఒకసారి ఆరోగ్య పరిస్థితి సీరియస్గా ఉండడంతో హైదరాబాద్
గచ్చిబౌలిలోని ఓ దవాఖానలో చేర్పించారు. పరిస్థితి నిలకడగా మారిన అనంతరం బంజారాహిల్స్లోని ఆయన నివాసంలో భార్య విజయలక్ష్మితో కలిసి ఉంటున్నారు. వీరికి సహాయకులుగా ఎంపీ అర్వింద్ వర్గీయులు ఉండడం ఇప్పుడు సమస్యలు తీసుకువచ్చింది. పెద్ద కొడుకు ధర్మపురి సంజయ్ను డీఎస్తో నేరుగా మాట్లాడించకపోవడం, ఏమి మాట్లాడినా వెంటనే అర్వింద్కు అక్కడి వారు చేరవేయడం వంటి కోవర్డు ఆపరేషన్ జరుగుతున్నది. ఈ విషయమై డీఎస్ పెద్ద కొడుకు సంజయ్ నిజామాబాద్లో స్వయంగా సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్ను లేపకుండా పని వాళ్లతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ దుమారంపై చాలా రోజులుగా సంజయ్ అసంతృప్తితోనే ఉండగా.. తాజాగా కాంగ్రెస్లో తాను చేరినప్పుడు అర్వింద్ అందుకు విరుద్ధంగా స్పందించడం ఆగ్రహం తెప్పించింది. డీఎస్ కాంగ్రెస్లో చేరలేదంటూ ప్రకటన ఇప్పించి తన రాజకీయ భవిష్యత్తుకు ఎసరు పెట్టేలా కుట్రలు చేయడంతో తీవ్రంగా మండిపడ్డాడు.
రాష్ట్ర రాజకీయాల్లో డీఎస్కు ప్రత్యేక స్థానం ఉంది. రెండు సార్లు ఉమ్మడి రాష్ర్టానికి పీసీసీ చీఫ్గా పని చేసి కాంగ్రెస్కు అధికారం కట్టబెట్టిన ఘనత కూడా ఆయన సొంతం. అలాంటి వ్యక్తి ఉన్నట్టుండి కాంగ్రెస్లో ప్రాధాన్యతను కోల్పోయారు. 2014 ఎన్నికల నాటికి ప్రభా వం లేకపోవడంతో రాజకీయాల్లో అంతగా రాణించలేకపోయారు. అనంతరం 2019 సాధారణ ఎన్నికల సమయానికి డీఎస్ తనయుడిగానే అర్వింద్ రాజకీయాల్లోకి వచ్చాడు. అప్పటి వరకు తండ్రితో కాంగ్రెస్ పార్టీలో చేదో డు వాదోడుగా ఉంటూ కీలకమైన సందర్భాల్లో తండ్రితోనే అంటకాగిన అర్వింద్ ఒక్కసారిగా కాషాయ జెండా ను కప్పుకున్నాడు. తన రాజకీయ జీవితానికి తండ్రి వ్యవహారం ఇబ్బంది కావొద్దని నిర్ణయించుకుని బీఆర్ఎస్ పార్టీలో చేరి రాజ్యసభ సీటు దక్కించుకున్న డీఎస్ను ఆదరించిన గులాబీ పార్టీపైకి ఉసిగొల్పాడు. అలా అసమ్మతి నేతగా డీఎస్ పేరొందడంతో గులాబీ పార్టీలో అంటీముట్టనట్లు పదవీ కాలాన్ని ముగించారు. అనంతరం ఏ పార్టీలో ఉన్నారో తెలియని సందిగ్ధంతో పెద్ద కొడుకుతో కలిసి ఇటీవల డీఎస్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరగా.. మళ్లీ ఎంపీ అర్వింద్ తెర వెనుకాల ఉండి మరో నాటకాన్ని ఆడించాడు. ఏకంగా తల్లితో ఒక వీడియోను, తండ్రితో లేఖలను ఇప్పించి గందరగోళం సృష్టించారు. తన రాజకీయం కోసం కుటుంబాన్ని ముందుకు తీసుకువచ్చినట్లు వారి దగ్గరి వ్యక్తులే చెబుతున్నారు. అర్వింద్ వ్యవహారంతో బీజేపీలోని వ్యక్తులతో పాటు కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురి అవుతుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.