దృష్టి లోపాలను దూరం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం కంటిన్యూ అవుతున్నది. జనవరి 19న నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ప్రారంభమైన నేత్ర పరీక్షల ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతున్నది. ఇప్పటికే లక్షన్నర మందికి కంటి పరీక్షలు చేసి, 53 వేల మందికి కళ్లద్దాలను పంపిణీ చేశారు. దృష్టి లోపాలతో బాధ పడుతున్న వారికి కొత్త వెలుగులు అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ‘కంటివెలుగు’కు శ్రీకారం చుట్టారు. ఉచితంగా నేత్ర పరీక్షలతో పాటు ఫ్రీగా కళ్లద్దాలు అందజేస్తున్నారు. అలాగే, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు కూడా చేయించేలా ఏర్పాట్లు చేశారు. పద్దెనిమిదేండ్ల యువకుల నుంచి పండు ముసలి వరకు అందరికీ నేత్ర పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా నిజామాబాద్ జిల్లాలో 70, కామారెడ్డి జిల్లాలో 44 వైద్య బృందాలు నిరంతరాయంగా పని చేస్తున్నాయి. రెండు జిల్లాల్లో కలిపి 20 లక్షల మందికి పైగా కంటి పరీక్షలు చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి.
ఖలీల్వాడి/కామారెడ్డి, ఫిబ్రవరి 3 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నది. వైద్య బృందాలు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు, మందులను ఉచితంగా అందజేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 70, కామారెడ్డి జిల్లాలో 44 బృందాలతో పరీక్షలు కొసాగుతున్నాయి. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకునేలా ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికీ తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లోనే కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తుండడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
పైసా ఖర్చులేకుండా పరీక్షలు నిర్వహిస్తుండడం.. అవసరమైన వారికి కంటి అద్దాలు, మందులు పంపిణీ చేస్తుండడంతో ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని అంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం 9578 మందికి పరీక్షలు నిర్వహించి 1205 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 95,300 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 42,667 మందికి కళ్లజోళ్లను అందజేశారు. కామారెడ్డి జిల్లాలో శుక్రవారం 5,570 మందికి పరీక్షలు నిర్వహించి అవసరమైన 833 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 54,012 మందికి పరీక్షలు నిర్వహించి 10,816 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు.
బాల్కొండ, ఫిబ్రవరి 3 : గ్రామంలో మళ్లీ కంటి పరీక్షలు చేస్తున్నారు. చూపు సరిగ్గా లేని వాళ్లకు మందులు, కండ్లద్దాలు ఇచ్చుడు సంతోషంగా ఉన్నది. నాలుగేండ్ల కిందట బాల్కొండలో నాకు డాక్టర్లు పరీక్షలు చేసి ఉచితంగానే కండ్లద్దాలను ఇచ్చిండ్రు. అవి పెట్టుకున్నప్పటి సంది కండ్ల ఆపరేషన్ అవసరం లేదన్నారు. ఇప్పుడు మళ్లా కొత్త కండ్లద్దాలు ఇచ్చిండ్రు. సంతోషంగా ఉన్నది. సీఎం కేసీఆర్ సల్లంగా ఉండలె.
– పౌడపల్లి లక్ష్మి, బాల్కొండ
నాకు ఇంతకు ముందు నుంచి కండ్ల సమస్య ఉంది. ప్రైవేటు దవాఖానలో పరీక్షలు చేయించుకుంటే పదివేల దాకా ఖర్చు అయినాయి. సీఎం కేసీఆర్ ప్రజల కోసం ఉచితంగా ఏర్పాటు చేసిన కంటి వెలుగు సెంటర్లో మళ్లీ కంటి పరీక్షలు చేయించుకున్నాను. ఒక్క పైసా ఖర్చు కాలె.ఉచితంగానే కండ్ల అద్దాలు , మందులు ఇచ్చారు. దీంతో నాకు మస్తు పైసల్ మిగిలినయ్..
-దొబ్బల భూమన్న, ఏర్గట్ల.
భీమ్గల్ ఫిబ్రవరి 3 : నాకు చాలా రోజుల నుంచి కంటి సమస్య ఉంది. నిజామాబాద్కు వెళ్లి చూపించుకోవాలనుకున్నా. డబ్బులు బాగా ఖర్చు అవుతాయని ఊరుకున్నా.. మా వార్డుకే కండ్ల డాక్టర్లు వస్తున్నారని మున్సిపల్ సార్లు మా ఇంటికి కాడికి వచ్చి చెప్పారు. నేను ఈ రోజు ఇక్కడ కంటి పరీక్షలు చేయించుకున్నా. చాలా మంచిగా చూసిండ్రు. కండ్ల మందు, అద్దాలు ఇచ్చిండ్రు మాలాంటి వారికి సీఎం కేసీఆర్ చాలా చేస్తుండు ఎప్పటికీ మేము కేసీఆర్తోనే…
– మూత గంగు, భీమ్గల్
మెండోరా, ఫిబ్రవరి 3 : గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరంలో పరీక్షలు చేయించుకున్నాను. దగ్గరి చూపు తగ్గడంతో కండ్లద్దాలను ప్రభుత్వం ఉచితంగా అందజేసింది. దీంతో టైలర్ షాపులో పని సులువుగా సాగుతున్నది. అవసరమైన వారికి ఉచితంగా మందులు ఇస్తున్నారు. ఇంతటి మంచి క్యాక్రమాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ సార్కు, నియోజకవర్గంలో చురుకుగా సాగేట్లు చేస్తున్న మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ధన్యవాదాలు.
– సంజీవ్, టైలర్, పోచంపాడ్
మోర్తాడ్, ఫిబ్రవరి 3 : కండ్లు మంచిగ కనిపిత్తలేవు. దవాఖానాలకు పోదామంటే వేలకువేలు కావాలె. మోర్తాడ్లనే గవర్నమెంటోళ్లు సూత్తుండ్రంటే అచ్చిన. పైసా ఖర్సు లేకుండనే మంచిగ సూత్తుండ్రు. కేసీఆర్ సార్ సల్లగుండాలె. ఆ సారే ఊర్లళ్ల కండ్లు మంచిగ లేనోళ్లకు సూడుమని సెప్పిండట. ఇట్ల ఎప్పుడెప్పుడు డాక్టర్లు వస్తే మాలాంటోళ్లకు మంచిగుంటది.
– మోత్కు గంగాధర్, మోర్తాడ్