ట్రింగ్ట్రింగ్.. ట్రింగ్ట్రింగ్.. అంటూ మార్మోగిన ల్యాండ్లైన్ టెలిఫోన్ క్రమంగా కనబడకుండా పోతున్నది. రెండు దశాబ్దాల క్రితం స్టేటస్ సింబల్గా పిలుచుకునే టెలిఫోన్ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పూర్తిగా అదృశ్యమవుతున్నది. పట్టణ ప్రాంతాల్లో మాత్రం కాస్త తన ఉనికి కాపాడుకునేందుకు ఊగిసలాడుతున్నది. కాలగమనంలో అరచేతిలోకి సెల్ఫోన్ వచ్చి చేరడంతో ల్యాండ్లైన్కు ఆదరణ కరువైంది. ఒకప్పుడు ఇండ్లల్లో రాజసానికి సింబాలిక్గా నిలిచిన ల్యాండ్ఫోన్.. సెల్ఫోన్ సునామీతో నేడు మ్యూజియం వస్తువుగా మారింది.
-కోటగిరి, ఫిబ్రవరి 4
శతాబ్దాలుగా పట్టణాలకే పరిమితమైన టెలిఫోన్ సౌకర్యం 1988లో మండలాలు, పెద్దపెద్ద గ్రామ పంచాయతీలకు వచ్చింది. ఎవరితోనైనా మాట్లాడాలి అనుకుంటే పోస్టాఫీసుకు వెళ్లి ట్రంక్ కాల్ బుక్ చేసుకొని గంటల తరబడి కూర్చొని మాట్లాడి వచ్చేవారు. 2000 సంవత్సరం వరకు ఓ వెలుగు వెలిగిన బీఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ ఫోన్ సేవలు రానురాను తగ్గుముఖం పడుతూ 2006 సంవత్సరం నుంచి తన ఉనికిని కోల్పోవడం మొదలైంది. 2009లో మొబైల్ ఫోన్కు 3జీ సెక్టార్ రావడంతో ఎక్కడి నుంచైనా మాట్లాడుకునే సౌకర్యం ఉండడం, మెస్సేజ్లు పంపుకొనే వీలు కలగడంతో దాదాపు అందరూ అటువైపు మొగ్గు చూపారు. గ్రామగ్రామాన సెల్ఫోన్ టవర్లు ఏర్పాటు చేయడంతోపాటు సుమారు రెండేండ్ల పాటు జియో 4జీ సేవలు పూర్తి ఉచితంగా అందించడంతో ఆ సునామీలో ల్యాండ్లైన్ నిలువలేకపోయింది.
ఇరవై ఏండ్ల క్రితం చదువుకొని ఉద్యోగం రాని నిరుద్యోగ యువత పట్టణాల్లో ఎస్టీడీ బూత్లు ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందేవారు. వీటిలో షిఫ్ట్ల పద్ధతిలో వేలాది మంది పనిచేసేవారు. కాలక్రమేనా ల్యాండ్లైన్ స్థానంలో కాయిన్ బాక్సులు రావడంతో పట్టణం నుంచి పల్లెల్లో వీధివీధినా ముఖ్యంగా దుకాణాల దగ్గర ఎక్కడ చూసినా రూపాయి కాయిన్ బాక్స్లు ఉండేవి. అంతే స్పీడ్గా స్మార్ట్ ఫోన్ సేవలు అందుబాటులోకి రావడంతో ఆ సేవలన్నీ కనిపించకుండా పోయాయి.
సుమారు మూడు దశాబ్దాల క్రితం ఏదైనా గ్రామంలో టెలిఫోన్ ఎక్సేంజ్ ఉందంటే అది పెద్ద వ్యాపార లావాదేవీలు ఉన్న గ్రామంగా గుర్తించేవారు. ఎవరింట్లోనైనా టెలిఫోన్ ఉందంటే వారిని ధనవంతులుగా, రాజకీయ నాయకులు, పెద్ద వ్యాపారవేత్తలుగానో చెప్పుకుంటూ వారిని సంపన్నులుగా భావించేవారు. కొంతకాలానికి ల్యాండ్లైన్ ఫోన్ మధ్యతరగతి వారి ఇండ్లకూ చేరింది. కాలగమనంలో అతి తక్కువ ధరకు సెల్ఫోన్లు రావడంతోపాటు ఇంట్లో వారు ఫోన్ మాట్లాడేందుకు ఎవరికి వారు ప్రైవసీకి అలవాటు పడడంతో ల్యాండ్లైన్ ఫోన్లు ఆదరణ కోల్పోయాయి.
2000 సంవత్సరం వరకు నిజామాబాద్ జిల్లాలో సుమారు 80-90వేల బీఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ ఫోన్ కనెక్షన్లు ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య ఆరు వేలకు పడిపోయింది. గ్రామాల్లో పూర్తిస్థాయిలో ల్యాండ్లైన్లు కనుమరుగవ్వగా పట్టణాల్లోని ప్రభుత్వ కార్యాలయాలైన విద్యుత్, పోలీస్స్టేషన్, రెవెన్యూ, హాస్పిటల్, బ్యాంకులు, పెద్దపెద్ద వ్యాపార సంస్థల్లో మాత్రమే ల్యాండ్ఫోన్లు కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా కనుమరుగై పోవడంతో ఉద్యోగుల సంఖ్య కూడా భారీగా తగ్గింది.
టెక్నాలజీ పెరగడంతో ల్యాండ్లైన్ కనెక్షన్లు తగ్గాయి. ల్యాండ్లైన్ ఫోన్ వాడడంతో రేడియేషన్ సమస్య ఉండదు. కానీ చాలా మంది వినియోగదారులు వైర్లెస్ ఫోన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. బీఎస్ఎన్ఎల్ ద్వారా గతంలో 80-90 వేల కనెక్షన్లు ఉండేవి. ప్రస్తుతం 6వేల కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి. ల్యాండ్లైన్ ఫోన్కు అయ్యే ఖర్చుతో సెల్ఫోన్ వస్తుండడంతో అందరూ అటు వైపే మొగ్గుచూపారు. దీనికి తోడు 2015లో వచ్చిన ఓ ప్రైవేట్ నెట్వర్క్ రెండేండ్ల వరకూ ఉచిత సేవలు అందించడంతో బీఎస్ఎన్ఎల్కు కనెక్షన్లు తగ్గాయి. అయినప్పటికీ ల్యాండ్లైన్ ఫోన్ స్థానంలో కొత్తగా ఫైబర్ టూ హోం (బ్రాడ్బ్యాండ్)కనెక్షన్ ఇస్తున్నాం.
-జి.జగ్రామ్, డీజీఎం, బీఎస్ఎన్ఎల్ నిజామాబాద్
మొబైల్తో పోలిస్తే ల్యాండ్లైన్ ఫోన్కు అయ్యే ఖర్చు ఎక్కువ. ఎప్పుడైతే అందరూ ప్రైవసీకి అలవాటు పడ్డారో అప్పటి నుంచి ల్యాండ్లైన్ ఫోన్కు ఆదరణ తగ్గిపోవడమేకాక అంతగా ఎవరూ ఇష్టపడడం లేదు. 2005లో బీఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ ఫోన్ కనెక్షన్ ఉండేది. స్మార్ట్ఫోన్ వచ్చాక 2018లో ల్యాండ్లైన్ కనెక్షన్ను తొలగించాం. స్మార్ట్ఫోన్ ద్వారా అందే సమాచారం, వినోదం ల్యాండ్ఫోన్లకు ఉండకపోవడంతో కాలక్రమేనా వాటికి ఆదరణ తగ్గుతూ వచ్చింది.
– పోల అశ్విన్కుమార్ గుప్తా, వ్యాపారి, కోటగిరి