Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో గందరగోళం కొనసాగుతున్నది. రిజిస్ట్రార్ కుర్చీ చుట్టూ జరుగుతున్న రాజకీయంతో యూనివర్సిటీ పరువు బజారున పడుతున్నది. వీసీ రవీందర్ వచ్చి నిండా రెండేండ్లు కూడా పూర్తి కాలేదు.. తొమ్మిది సార్లు రిజిస్ట్రార్లు మారారు. 22 నెలల వ్యవధిలో ఇంత మంది రిజిస్ట్రార్లు మారడం ఏ వర్సిటీ చరిత్రలో కూడా నమోదు కాలేదు. వీసీ రవీందర్ గుప్తా వచ్చాక యూనివర్సిటీలో నియామకాల రచ్చ మొదలైంది. రిజిస్ట్రార్ మొదలు అవుట్ సోర్సింగ్ సిబ్బంది నియామకాల వరకూ వివాదాస్పదమైంది. రిజిస్ట్రార్ను టీయూ పాలకవర్గం నియమిస్తే వైస్ చాన్స్లర్ మోకాలడ్డడం, వీసీ నియమిస్తే ఈసీ ఆమోదం తెలుపకపోవడం వంటి ఘటనలతో కొన్ని నెలలుగా సందిగ్ధత కొనసాగుతున్నది. 59వ ఈసీ మీటింగ్లో ప్రొఫెసర్ యాదగిరిని రిజిస్ట్రార్గా కొనసాగిస్తూ పాలక మండలి నిర్ణయం తీసుకున్నది. కానీ 24 గంటలు కూడా గడవక ముందే ప్రొఫెసర్ కనకయ్యను రిజిస్ట్రార్గా నియమిస్తూ వీసీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వెంటనే కనకయ్య బాధ్యతలు స్వీకరించారు. వర్సిటీలో ఎవరికి వారే ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండడంతో పరిపాలన కుప్పకూలింది. విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.
నిజామాబాద్, మే 26, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఒకటోసారి… రెండోసారి… మూడోసారి అన్నట్లుగా తెలంగాణ యూనివర్సిటీలో ఇప్పుడు తొమ్మిదోసారి రిజిస్ట్రార్ మార్పు జరిగింది. ఆరుగురు వ్యక్తులతో తొమ్మిది సార్లు కేవలం 22 నెలల కాలంలోనే రిజిస్ట్రార్లుగా మారడం బహుశా ఏ యూనివర్సిటీ చరిత్రలోనూ చోటు చేసుకోలేదని టీయూ వర్గాలు చెబుతున్నాయి. వైస్ చాన్స్లర్గా ప్రొఫెసర్ రవీందర్ గుప్తా వచ్చిన నాటి నుంచి నేటి వరకు పూటకొకరు మారుతూ వస్తున్నారు. పాలకవర్గం నియమిస్తే వీసీ మోకాలడ్డు పెట్టడం, వీసీ నియమిస్తే ఈసీ ఆమోదం తెలపకపోవడం వంటి ఘటనలతో సందిగ్ధత నెలల తరబడి కొనసాగుతూ నే ఉంది. ఇందులో ఎవరి విచక్షణ ఎంత? ఎవరి అధికారాలు ఏమిటన్నదే తేలడం లేదు. తెలంగాణ యూనివర్సిటీస్ యాక్టు ప్రకారం పాలకవర్గం నడుచుకుంటున్నప్పటికీ వైస్ చాన్స్లర్ హోదాలో విచక్షణాధికారం పేరిట వీసీ ఇష్టానుసారంగా మార్పు లు, చేర్పులు చేస్తుండడంతో అంతులేని వివాదాలతో యూనివర్సిటీ పరిపాలన కుప్పకూలింది. పరిపాలన అన్నదే లేకపోవడంతో టీయూలో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారుతున్నది. అయోమయం నెలకొనడంతో లక్షలాది మంది జీవితాలపై ప్రభావం చూపుతున్నది. టీయూలో పరిస్థితులు ఎప్పుడు సద్దుమణుగుతాయో? ఎప్పటికి పరిస్థితులు మునపటి స్థితికి చేరుతాయోనని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తుండడమే మిగిలింది. విరామం లేని వివాదాలతో తెలంగాణ యూనివర్సిటీ ప్రతిష్ట రోజురోజుకూ మసకబారుతున్నది.
టీయూలో మరోసారి రిజిస్ట్రార్ మార్పు కలకలం రేపుతున్నది. 59వ పాలకవర్గ సమావేశం జరిగిన 24 గంటల్లోనే వీసీ తనకు నచ్చిన మరో వ్యక్తిని రిజిస్ట్రార్గా నియమించడంతో వివాదం మరింత ముదిరింది. గురువారమే హైదరాబాద్ రూసా బిల్డింగ్లో సమావేశమైన పాలకవర్గ సమావేశానికి విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ చైర్పర్సన్గా సభ్యులంతా భేటీ అయ్యారు. వీసీ గైర్హాజరు అయ్యారు. ఈసీ గతంలో మాదిరిగానే ప్రొఫెసర్ యాదగిరినే రిజిస్ట్రార్గా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నది. అంతలోనే ఒక రోజు కూడా గడవకముందే రిజిస్ట్రార్ మార్పు సంభవించింది. పాలకవర్గం గతంలో వద్దన్న వ్యక్తికే పట్టం కడుతూ ఇన్చార్జి రిజిస్ట్రార్గా తెలుగు విభాగానికి చెందిన కనకయ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే కనకయ్య ఏకంగా రిజిస్ట్రార్ సీట్లో ఆసీనులై బాధ్యతలను సైతం చేపట్టాడు. 2021, మే 22న టీయూకు వీసీగా రవీందర్ గుప్తా నియమితులు అయ్యారు. నాటి నుంచి నేటి వరకు వీసీ రవీందర్ గుప్తా ఇష్టానుసారంగా రిజిస్ట్రార్లను మార్చుకుంటూ పోతున్నారు. వీసీగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే 2021, సెప్టెంబర్1న అప్పటి వరకు రిజిస్ట్రార్గా ఉన్న నసీమ్ను తొలగించి కనకయ్యకు ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు. ఈసీ అనుమతి లేకుండానే ఈయన హయాంలో అనేక నిర్ణయాలను తీసుకోవడం వివాదాస్పదమైంది. యూనివర్సిటీలో వందలాది మందిని అవుట్ సోర్సింగ్ పేరి ట సిబ్బందిని అక్రమ పద్ధతిలో నియమించారు.
వివాదాస్పదంగా మారిన వీసీ తీరుతో పాలక మండలి 2021లో అక్టోబర్ 30న యూనివర్సిటీలో సమావేశమైంది. కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే నవంబర్ 27కు హైదరాబాద్లోని రూసా భవనంలో మరో మీటింగ్ను నిర్వహించింది. అప్పటి వరకు ఇన్చార్జి రిజిస్ట్రార్గా ఉన్న కనకయ్యను ఈసీ తొలగించి యాదగిరిని రిజిస్ట్రార్గా నియమించింది. పాలక మండలి ఆదేశాలను ధిక్కరించి వీసీ రవీందర్ గుప్తా మరోమారు రిజిస్ట్రార్గా శివశంకర్ను నియమించారు. అంతలోనే తాను చెప్పినట్లు వినట్లేదని, సంతకాలు చేయట్లేదని భావించిన వీసీ ఏకంగా శివశంకర్ను తప్పించి విద్యావర్ధినికి బాధ్యతలిచ్చారు. విద్యావర్ధిని నియామకం చెల్లదంటూ ఈసీ తేల్చి చెప్పి తిరిగి యాదగిరికి రిజిస్ట్రార్ బాధ్యతలను అప్పగించింది. ఈసీ నిర్ణయాలను కాదని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నిర్మలాదేవిని రప్పించి ఆమెకు రిజిస్ట్రార్ బాధ్యతలు ఇవ్వగా ప్రగల్భాలు పలికిన ఓయూ ప్రొఫెసర్ మూడు రోజులకే తిరిగి వెనక్కి వెళ్లారు. ఆ తర్వాత ఈసీ ఆదేశాలతో యాదగిరి మరోసారి రిజిస్ట్రార్గా వచ్చారు. రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళం వేయడం, సిబ్బందికి సహకరించొద్దంటూ హుకుం జారీ చేయడం వంటి వీసీ నిర్ణయాలతో అయోమయం నెలకొన్నది. 59వ ఈసీ మీటింగ్లో యాదగిరినే రిజిస్ట్రార్ అంటూ ప్రకటించడం తో 24గంటల్లోనే గతంలో తొలగించిన ప్రొఫెసర్ కనకయ్యను తిరిగి రిజిస్ట్రార్ కుర్చీలో కూర్చోబెట్టడం టీయూ పరిస్థితిని తేటతెల్లం చేస్తున్నది.
టీయూ పాలకవర్గం వర్సెస్ వైస్ చాన్స్లర్ మధ్య జరుగుతోన్న పోరులో మధ్యలో దేవాలయం లాంటి విశ్వవిద్యాలయం పరువు బజారున పడుతున్నది. నెలల తరబడి ఎడతెగని వివాదాల మూలంగా అకడమిక్, నాన్ అకడమిక్ సిబ్బంది సైతం తలలు పట్టుకునే దుస్థితి దాపురించింది. వీసీ పదవిని అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడడం, నిధులను నిబంధనలకు విరుద్ధంగా వెచ్చించడం వంటి ఆరోపణలపై ఈసీ కీలకమైన నిర్ణయాలను తీసుకున్నది. విచారణకు ఏసీబీ, ఎన్ఫోర్స్మెంట్కు లేఖలు రాసింది. మరోవైపు వీసీ అధికారాలను కత్తిరించింది. క్రిమినల్ కేసులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నది. అయినప్పటికీ వీసీ రవీందర్ గుప్తాలో ఇసుమంతైన మార్పు కనిపించడం లేదు. అదే బరితెగింపుతో ఈసీని లెక్కచేయకుండానే నిర్ణయాలను తీసుకుంటుండడం తీవ్ర దుమారం రేపుతున్నది.
2021, నవంబర్ 27 అనంతర కాలం జారీ చేసిన వీసీ ఉత్తర్వులు అన్నింటినీ పాలకవర్గం రద్దు చేసినప్పటికీ వీసీ మాత్రం వాటిని పరిగణలోకి తీసుకోకుండానే అమలు చేసేందుకే ప్రయత్నాలు చేస్తున్నాడు. అడ్డగోలుగా నియమించిన సిబ్బంది విషయంలోనూ మొండి వాదనకు దిగుతున్నాడు. ప్రభుత్వ ఉత్తర్వుల ఉల్లంఘనలు ఉన్నాయని ప్రశ్నిస్తే వీసీగా తనకు విచక్షణాధికారం ఉందంటూ చెబుతుండడం పరిస్థితి ఎటు వైపు వెళ్తుందన్న ఆసక్తి ఉమ్మడి జిల్లా ప్రజల్లో నెలకొన్నది. ఈసీ దూకుడుగా వ్యవహరించడం ద్వారా మధ్యలో వీసీ ఏకంగా ఒకడుగు వెనక్కి వేసినట్లుగా ప్రవర్తించాడు. మీడియా ముఖంగా కలిసి పని చేస్తామంటూ వ్యాఖ్యానించాడు. అంతలోనే ఏమైందో తాజాగా మరో రిజిస్ట్రార్ మార్పుతో పరిస్థితి మొదటికి వచ్చింది.