ఖలీల్వాడి, ఫిబ్రవరి 5: సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం అభాసుపాలవుతున్నది. తమ సమస్యలు పరిష్కారమవుతాయన్న ఆశతో జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు నిరాశే ఎదురవుతున్నది. ప్రజావాణి కార్యక్రమానికి కొన్ని ప్రభుత్వ శాఖల అధికారులు గైర్హాజరవడం, వందల సంఖ్యలో వస్తున్నవారిని క్రమపద్ధతిలో నిలువరించకపోవడంతో అధికారులకు వినతిపత్రాలు, ఫిర్యాదులు ఇవ్వడానికి నానా అవస్థలు పడాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తాజాగా సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తుండగా.. వేల్పూర్ మండలం పచ్చల నడ్కుడ గ్రామస్తులు సుమారు 50 మంది లోపలికి చొచ్చుకు వచ్చారు. జాన్కంపేట్, పచ్చల నడ్కుడ గ్రామాల మధ్య ఉన్న వాగు సమస్యను పరిష్కరించాలని కోరుతూ బైఠాయించి, నిరసన వ్యక్తంచేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు.
సమావేశపు హాలులోకి పరిమిత సంఖ్యలో ఫిర్యాదుదారులను పంపించాల్సి ఉండగా.. ఒకేసారి 50 మంది చొచ్చుకురావడంతో సెక్యూరిటీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజావాణి కార్యక్రమంలో ఇలా నిరసన తెలుపడం తొలిసారి కావడం గమనార్హం.
సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 97 వినతులు రాగా.. కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు రాకపోవడంతో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాతోపాటు పలువురు అధికారులు స్వీకరించారు. నగరానికి చెందిన రాజయ్య, సరోజ, గంగాధర్ దివ్యాంగులు తమకు ఆసరా పింఛన్ రావడంలేదని ఇప్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. నగరంలోని 171,172 సర్వేనంబర్లోని ప్రభుత్వ భూమిలో రెండేండ్లుగా గుడిసెలు వేసుకొని 300 కుటుంబాలు నివసిస్తున్నాయని, తమను రియల్ ఎస్టేట్ వ్యాపారులు వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్, డీపీవో జయసుధ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
న్యూ కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన రంగురంగుల పూలమొక్కలకు రక్షణ కరువైంది. నిత్యం ఏదో ఒక పని నిమిత్తం వచ్చే వారు తమకు నచ్చిన పూల మొక్కలను యథేచ్ఛగా తీసుకెళ్తున్నారు.