రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని అవగాహన కల్పించినా మారడం లేదు కొందరు ప్రబుద్ధులు. ‘ఈ-చలాన్ల’ రూపంలో జరిమానాలు విధించినా పట్టించుకోవడం లేదు. రూల్స్ బ్రేక్ చేస్తూ ఇతర వాహనదారులు, ప్రజలను ప్రమాదాలకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇష్టారీతిన వాహనాలను నడుపుతున్న వారిని దారిలోకి తెచ్చేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
రోడ్లపై ఇష్టారీతిన వాహనాలు నడిపే వారిని ఇక ఉపేక్షించకూడదని పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా, కొందరిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. వాళ్లు చేసిన తప్పుకు అమాయక వాహనదారులు, మరొకరు ప్రమాదాలకు గురికావాల్సి వస్తున్నది. ఈ క్రమంలో కుర్రకారు స్పీడ్కు హద్దు లేకుండా పోతున్నది. మరికొంత మంది కనీస నిబంధనలు తుంగలోకి తొక్కి వాహనాలతో రోడ్లపైకి వస్తున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు ఎక్కడికక్కడ కేసులు నమోదు చేసి చలాన్లు కూడా విధిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా మళ్లీ షరా మామూలుగానే వ్యవహరించడం గమనార్హం. జరిమానాలు వేసిన తర్వాత చాలా మంది వాటిని చెల్లించడం లేదు. తిరిగి యథావిధిగా రోడ్లపైకి వచ్చి నిబంధనలు అతిక్రమిస్తూనే ఉన్నారు. దీంతో ఒక్కో వాహనంపై భారీగా పెండింగ్ చలాన్లు పేరుకుపోతున్నాయి. దీంతో పేరుకుపోయిన చలనాలు వసూలు చేయడంతోపాటు నిబంధనలు అతిక్రమిస్తున్న వారిపై చర్యలు చేపట్టేందుకు పోలీసులు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
వాహనదారులు రూల్స్ బ్రేక్ చేసిన ప్రతిసారీ పోలీసులు చలాన్ విధిస్తున్నారు. పోలీసులు ఫైన్ విధించిన వెంటనే సదరు వాహన యజమాని ఫోన్కు మెస్సేజ్ వెళ్తుంది. చాలా మంది వాహనదారులు ఫైన్ పడిన వెంటనే చెల్లించకుండా జాప్యం చేస్తున్నారు. ఇలా ఒక్కో వాహదారుడికి 4 నుంచి 5లేదా అంతకన్నా ఎక్కువ ఈ చలాన్లకు సంబంధించి సుమారు రూ.2వేల నుంచి రూ.4వేల వరకు బకాయి ఉన్నట్లు పోలీసుల తనిఖీల్లో వెల్లడవుతున్నది. పెద్దమొత్తంలో బకాయి ఉన్న వాహనదారుడు మళ్లీ నిబంధనలు పాటించకుండా పట్టుబడితే జరిమానా డబ్బులు మొత్తం చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఈ ఏడాది మూడు నెలల వ్యవధిలో విధించిన ఈ చలాన్లలో 9వేల మంది సుమారు రూ.6లక్షల వరకు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. పెండింగ్ చలాన్ల రూపంలో వచ్చే ఆదాయం సుమారు రూ.10లక్షల వరకు ఉండే అవకాశం ఉన్నది. వీరిని గుర్తించి జరిమానా కట్టించేందుకు ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
ట్రాఫిక్ పోలీసులు నిత్యం నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్లో నిబంధనలు పాటించని వాహనదారులకు చలాన్ విధిస్తున్నారు. ఇలా ప్రతి రోజు సగటున 200-300 మంది వాహనదారులకు జరిమానా వేస్తున్నారు. గత 70 రోజుల వ్యవధిలోనే సుమారు 25వేల ఈ చలాన్లు విధించినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో కేవలం 9వేల మంది జరిమానాలు చెల్లించగా, మిగతా 16వేల మంది ఫైన్ చెల్లించాల్సి ఉన్నట్లు తెలిసింది.
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రతి వాహనదారుడు ఆర్టీఏ, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సంబంధిత శాఖల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది. కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలోని పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ వస్తున్నారు. ట్రాఫిక్, సివిల్ పోలీసులు సైతం వాహనాల తనిఖీ చేపడుతూ జరిమానా విధిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రదేశాల్లో సీట్ బెల్టు పెట్టుకొని ఫోర్ వీలర్ డ్రైవర్లతోపాటు హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడుపుతున్న వారికి, ట్రిపుల్ రైడింగ్, రాంగ్రూట్, ధ్రువపత్రాలు లేని, ఆర్టీఏ నిబంధనలు పాటించని వారికి ఈ చలాన్ విధిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులే రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు వందలాదిగా ఈ చలాన్లు విధిస్తున్నారంటే వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఎంత మేరకు ఉల్లంఘిస్తున్నారో తెలుస్తున్నది.