నిజామాబాద్ క్రైం, జనవరి 21 : రాష్ట్ర పోలీసు శాఖలో ‘ఫంక్షనల్ వర్టికల్’ పని విధానంలో భాగంగా డీజీపీ ఆదేశాల మేరకు డ్యూటీలో ప్రతిభ చూపిన పోలీస్ సిబ్బందికి ప్రత్యేక రివార్డులు ప్రకటించారు. డిసెంబర్ నెల పనితీరు ఆధారంగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని పోలీస్స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న 13 ఫంక్షనల్ వర్టికల్లో వివిధ కేటగిరీల్లో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద్ బాబు శనివారం ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు. ప్రశంసాపత్రాలు అందుకున్న వారిలో నిజామాబాద్ త్రీ టౌన్ పోలీస్స్టేషన్ ఎస్సై ఆర్.లక్ష్మయ్య, జక్రాన్పల్లి ఎస్సై కె.శ్రీకాంత్, రెంజల్ ఎస్సై పి.సాయన్న, టూ టౌన్ ఏఎస్సై లక్ష్మణ్తో పాటు కోర్టు డ్యూటీ కానిస్టేబుల్, ట్రాఫిక్ సిబ్బంది, నందిపేట్, మెండోరా, మోర్తాడ్, జక్రాన్పల్లి, కమ్మర్పల్లి, నవీపేట్, బోధన్ స్టేషన్ రైటర్, రిసెప్షనిస్ట్లు మొత్తం 22 మంది సిబ్బందిని సీపీ అభినందించారు. కార్యక్రమంలో ఎన్ఐబీ ఇన్స్పెక్టర్ ముఖీద్ పాషా, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.