రంగుల పండుగకు వేళయ్యింది. హోలీ సంబురాలు జరుపుకొనేందుకు ఉమ్మడి జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. రంగులు చల్లుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కొన్నిచోట్ల హోలీ పండుగను ఆదివారం జరుపుకోగా.. మిగతా ప్రాంతాల్లో సోమవారం జరుపుకోనున్నారు. హోలీ సందర్భంగా చిన్నాపెద్ద కలిసి వేడుకల్లో పాల్గొననున్నారు. యువతతోపాటు చిన్నారులు సైతం రంగులను కొనుగోలు చేసే పనుల్లో పడ్డారు. దీంతో రంగులు విక్రయించే దుకాణాలు రద్దీగా మారాయి. కొన్ని కాలనీల్లో ఒకచోట అందరు చేరి రంగులు పూసుకుంటూ వేడుకలను జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తమ స్నేహితులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపేందుకు రెడీ అయ్యారు.
బోధన్ రూరల్, మార్చి 24: సాలూరా మండలంలోని హున్సా గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా పిడిగుద్దులాట కార్యక్రమం నిర్వహించనున్నారు. గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పిడిగుద్దులాటను ప్రత్యక్షంగా తిలకించేందుకు మహారాష్ట్ర నుంచి కూడా ప్రజలు తరలివస్తారు. పిడిగుద్దులాటకు జిల్లాలోని హున్సా గ్రామం ప్రత్యేకతగా నిలిచింది. ఈ కార్యక్రమం బయటివారికి విచిత్రంగా కనిపించినా.. హున్సా గ్రామస్తులు మాత్రం ఆచారంగా భావిస్తారు. ఈ ఆటను గ్రామస్తులు ఎంతో ఇష్టంతో ఆడుతారు.
పిడిగుద్దులాట బాక్సింగ్ ఆటను తలపిస్తుంది. హోలీ పండుగ రోజున రంగులు చల్లుకొని సందడి చేస్తారు. సాయంత్రం కుస్తీపోటీలు నిర్వహించిన అనంతరం గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి హనుమాన్ మందిరం వద్దకు చేరుకొని పిడిగుద్దులాటను ప్రారంభిస్తారు. సుమారు 5 నుంచి 10 నిమిషాల పాటు కొట్టుకుంటారు. ఒకవేళ ఎలాంటి గాయాలైనా మందులను వాడకపోవడం గమనార్హం. అక్కడి మట్టిని గాయపడిన చోట రాసుకుంటే గాయాలు తగ్గిపోతాయని వారి నమ్మకం.
హోలీ పర్వదినం రోజున మోదుగపూలతో తయారు చేసిన రంగులను వాడితే చర్మవ్యాధులు రాకుండా ఉంటాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. కెమికల్స్ కలిపిన రంగులతో హోలీ ఆడడంవల్ల కంటి జబ్బు లు, చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మోదుగ పూలు ఈ కాలంలో వచ్చే రోగాలకు దివ్యమైన ఔషధమని పేర్కొంటారు. సహజరంగులతో పండుగ సంబురాలు జరుపుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్లో ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో ఆదివారం కామదహన యజ్ఞాన్ని ఆర్య సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ వక్త ఆచార్య వేదమిత్ర మాట్లాడుతూ.. వనమూలికలతో కామ దహన యజ్ఞాన్ని నిర్వహించడంవల్ల ప్రకృతి శాంతిస్తుందని, లోక కల్యాణం జరుగుతుందని తెలిపారు. చెడుపై మంచికి సంకేతంగా హోలీ పండుగను ప్రతిఏటా ఫాల్గుణ పౌర్ణమి నాడు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వివేకానంద కాలనీలో ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో కామదహన యజం నిర్వహించారు.