వేల్పూర్/మోర్తాడ్(కమ్మర్పల్లి), ఏప్రిల్ 29 : హామీలను అమలుచేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన వేల్పూర్ మండలం వెంకటాపూర్, కుకునూర్, కోమన్పల్లి, కమ్మర్పల్లితోపాటు ఉప్లూర్ గ్రామాల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్షోలో వేముల మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీల్లో పదమూడు హామీలను అధికారంలోకి రాగానే అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. వందరోజులైనా అమలుచేయడంలేదన్నారు. ఉచిత బస్సు ఒకటి మాత్రమే అమలుచేసిందని, మిగతావి ఎటు పోయాయని రేవంత్ సర్కార్ను ప్రశ్నించారు. గ్రామానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను హామీలపై నిలదీయాలని పిలుపునిచ్చారు. దేశంలో ఏ సీఎం చేయని అభివృద్ధి పనులు కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగాయని, అంత చేసినా కాంగ్రెస్ అబద్ధపు హామీలనే జనం నమ్మారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ప్రొసీడింగ్ కాపీలు ఉత్తవేనని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు..కలెక్టర్తో చెప్పిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఒకవైపు తీవ్రమైన విద్యుత్ కోతలు, మరోవైపు తాగునీటితో గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 140 రోజులకే ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ..మున్ముందు ఇంకెన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ఆ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని స్పష్టం చేశారు.
పసుపు బోర్డు ఏర్పాటైందని చెబుతున్న బీజేపీ అభ్యర్థి అర్వింద్.. అది ఎక్కడ ఏర్పాటు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే పసుపు బోర్డు ఏర్పాటు చేశామని నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత లోక్సభ ఎన్నికల్లో మోసం చేసి ఎంపీగా గెలిచిన అర్వింద్కు ఈ ఎన్నికల్లో రైతులు బుద్ధి చెబుతారని అన్నారు.