మాక్లూర్, డిసెంబర్ 24: ఆర్మూర్ అర్బన్ పార్కు నిర్మాణం పనులను నెలరోజుల్లోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి వెల్లడించారు. ‘నమస్తే నవనాథపురం’లో భాగంగా మండలంలోని చిన్నాపూర్ గ్రామంలో ఆర్మూర్ అర్బన్ పార్కు నిర్మాణ పనులను ఆయన శనివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా అధికారులతో సమావేశమై పార్కు నిర్మాణంలో భాగంగా చేపట్టిన పనుల పురోగతిపై సమీక్షించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అటవీశాఖ పర్యవేక్షణలో ఆర్మూర్ అర్బన్ పార్కు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. 470 ఎకరాల్లో చేపట్టిన ఈ పార్కు నిర్మాణాన్ని నెల రోజుల్లోగా పూర్తి చేసి త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ పార్కులో ఆరు కిలోమీటర్ల పొడవునా వాకింగ్ ట్రాక్ను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంతపెద్ద వాకింగ్ ట్రాక్ ఉన్న ఏకైక పార్కు ఇదేనన్నారు.
పార్కులో అభివృద్ధి పనులను ఇప్పటికే రూ.ఆరు కోట్లను ఖర్చు చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. మరో రూ.5కోట్లలో పార్కు సమీపంలో ఉన్న చిన్నాపూర్ చెరువుతోపాటు గాజులకుంట, ఇనాయి కుంటలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని, బోటింగ్ ఏర్పాటు, మినీట్యాంకుబండ్ల నిర్మాణం వంటి పలు పనులు చేపడుతామన్నారు. 30 ఫీట్ల ఎత్తులో నెలకొల్పిన వాచ్టవర్ రాష్ట్రంలోనే అతిపెద్దదవుతుందన్నారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు శ్రీనివాస్, సౌమ్య, అశోక్కుమార్, మండల పరిషత్ అధ్యక్షుడు ప్రభాకర్, సర్పంచ్ గంగారెడ్డి, అడవి మామిడిపల్లి సర్పంచ్ మల్లారెడ్డి, ఎంపీటీసీ సత్యనారాయణ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్యం, ఉపసర్పంచ్ అహ్మద్, జిబి.గోవర్ధన్, రంజిత్, అశోక్, శ్యామ్రావు, గణపతినాయక్, జలంధర్, నర్సాగౌడ్, తాజ్, వినోద్, మారుతి, డిసి.గంగాధర్, సర్పంచులు, ఎంపీటీసీలు నగర కార్పొరేటర్ రాయిసింగ్, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.