మాతాశిశు సంరక్షణే ధ్యేయంగా కామారెడ్డి జిల్లాలో ప్రారంభించిన న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా సాగుతున్నది. గర్భిణుల్లో రక్తహీనతను తగ్గించి, మాతృ మరణాలను నివారించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. కేసీఆర్ కిట్ విజయవంతం కావడంతో ఇదే స్ఫూర్తితో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ ప్రక్రియను ప్రారంభించింది. మొదటి విడుతలో రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయగా.. కామారెడ్డి జిల్లాకు చోటు దక్కింది. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకం రెండు నెలలుగా విజయవంతంగా అమలవుతున్నది. జిల్లాలో 19,450 మంది గర్భిణులను గుర్తించి ప్రొటీన్స్, మినరల్స్, విటమిన్స్, పోషకాహార మిళితమైన పదార్థాలతో కూడిన కిట్ను అందిస్తున్నారు. వీటిని గర్భిణులు క్రమం తప్పకుండా స్వీకరించడం ద్వారా రక్తహీనత వంటి సమస్యను అధిగమించవచ్చును. గర్భిణులకు పౌష్టికాహారం అందడంతోపాటు ఆర్థిక భారం తప్పుతున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిజామాబాద్ జిల్లాలోనూ ప్రారంభం కానున్నది.
నిజామాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ సూపర్గా సక్సెస్ అవుతున్నది. కామారెడ్డి జిల్లాలో ప్రారంభమైన ఈ బృహత్తర కార్యక్రమం గర్భిణులందరికీ అందుతున్నది. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ను అర్హుల ఇంటికే వెళ్లి వైద్యారోగ్య శాఖ సిబ్బంది అందజేస్తున్నారు. ప్రభుత్వ కృషిని వివరిస్తూనే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్తో కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నారు. 2022, డిసెంబర్ 21న ఈ కార్యక్రమాన్ని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి లాంఛనంగా కామారెడ్డిలో ప్రారంభించారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో అమలుచేస్తున్న ఈ పథకాన్ని కామారెడ్డి గడ్డ మీదినుంచే ప్రారంభించారు. రెండు నెలలుగా ఈ కార్యక్రమం విజయవంతంగా అమలవుతున్నది. 19వేల 450 మంది అర్హులను గుర్తించిన వైద్యారోగ్య శాఖ అందుకు తగిన ఏర్పాట్లుచేసి కిట్లను అందిస్తున్నారు. గర్భిణులతోపాటు పుట్టబోయే బిడ్డల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా చేపట్టిన న్యూట్రిషన్ కిట్ పథకాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిజామాబాద్ జిల్లాలోనూ ప్రారంభించనున్నారు.
రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులు ప్రసవ సమయంలో తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. డెలివరీ సమయంలో రిస్క్ అవుతున్న నేపథ్యంలో మాతా, శిశు సంరక్షణే ప్రధాన ధ్యేయంగా పని చేస్తున్న బీఆర్ఎస్ సర్కారు.. ఈ సమస్యను నివారించడంపై దృష్టి సారించింది. తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడేందుకు పేద, మధ్య తరగతి కుటుంబాల్లో పౌష్టికాహారలోపాన్ని దూరం చేసేందుకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని తీసుకువచ్చారు. ప్రొటీన్స్, మినరల్స్, విటమిన్స్తో కూడిన పదార్థాలను క్రోడీకరించి కిట్ రూపంలో అందిస్తున్నారు. వీటిని గర్భిణులు క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తహీనత వంటి సమస్యను అధిగమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఫలితంగా ప్రసవ సమయంలో ఇబ్బందులు తొలగిపోవడంతోపాటు తల్లీబిడ్డల ఆరోగ్యం రక్షించబడుతున్నది. రక్తహీనత తగ్గించి హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడం కోసం రూ.1962 విలువ చేసే కిట్ను రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా అందిస్తున్నది. కిట్లో కిలో న్యూట్రిషన్ మిక్స్ పౌడర్, కిలో ఖర్జూర, మూడు ఐరన్ సిరప్ బాటిళ్లు, 500 గ్రాముల నెయ్యి, ఆల్బెండజోల్ టాబ్లెట్లు, కప్పు, ప్లాస్టిక్ బాస్కెట్ వంటివి ఉన్నాయి.
పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన మహిళలకు ఆర్థిక భారాన్ని తప్పించేందుకు రాష్ట్ర సర్కారు అనేక చర్యలను చేపట్టింది. విప్లవాత్మకమైన నిర్ణయాలతో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజారోగ్యంపై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది. ప్రభుత్వ వైద్యశాలలను బలోపేతం చేయడంతోపాటు సేవలను పేదల చెంతకు చేర్చింది. మౌలిక సదుపాయాలను కల్పించడంతో సర్కారు దవాఖానాలపై ప్రజలకు భరోసా పెరిగింది. ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవాలను పెంచడం కోసం తీసుకువచ్చిన కేసీఆర్ కిట్ పథకం బంపర్ హిట్టయ్యింది. ఆడ బిడ్డ పుడితే రూ.13వేలు, మగ బిడ్డ పుడితే రూ.12వేలు నగదు ప్రోత్సాహాన్ని విడుతల వారీగా అందించడంతోపాటు ప్రసవ సమయంలో అందించే రూ.2వేల విలువ చేసే కేసీఆర్ కిట్ ఇప్పటికే విశేష ఆదరణ పొందింది. తాజాగా కామారెడ్డిలో ప్రారంభమైన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ మరో విభిన్నతను సాధించింది.
కామారెడ్డితో పోలిస్తే నిజామాబాద్ జిల్లాలో మాతా, శిశు సంరక్షణ మెరుగ్గా ఉన్నది. రక్తహీనతతో బాధపడుతున్న వారి సంఖ్య చాలా తక్కువ. ఉమ్మడి జిల్లా కేంద్రం కావడంతో మొదటినుంచి మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు ప్రజలు కూడా జాగ్రత్తలు పాటిస్తారు. కానీ గిరిజన గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో అవగాహన లేమి కారణంగా రక్తహీనత సమస్య వెలుగు చూస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది జిల్లాల్లో అమలైన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకంతో మంచి ఫలితాలు రావడంతోపాటు స్పందన అద్భుతంగా ఉంది. దీంతో ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలుచేసేందుకు రాష్ట్ర సర్కారు నిశ్చయించింది. ఇందులో భాగంగా త్వరలోనే నిజామాబాద్ జిల్లాలోనూ అమలుకావడం ఖాయంగా కనిపిస్తోంది. 2023-24 బడ్జెట్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టబోతున్నట్లుగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ప్రకటించారు. ఈ మేరకు గణాంకాల సేకరణలో వైద్యారోగ్య శాఖ నిమగ్నమైంది. నిజామాబాద్లో దాదాపు 25వేల మంది వరకు అర్హులు ఉండొచ్చని అంచనాలున్నాయి.
నా భర్త ప్రైవేటు జాబ్ చేస్తాడు. ప్రతినెలా మేము ప్రైవేటు దవాఖానకు పోయి బయట మందులు కొనాలంటే అప్పులు చేయాల్సి వచ్చేది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న న్యూట్రిషన్ కిట్తో ప్రైవేటు దవాఖానలు, ఇతర మందులు కొనే బాధ తప్పింది. ఇంటింటికీ పెద్దన్న మాదిరిగా గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు ఇచ్చి ఆదుకుంటున్న కేసీఆర్ సార్కు జన్మజన్మలా రుణపడి ఉంటాం.
-సుష్మిత, బీర్కూర్
నా భర్త ఆటో డ్రైవర్. మంచి మందులు, తాకత్ ఇచ్చే ఆహారం కొనాలంటే డబ్బులు సరిపోవు. మా ఆరోగ్యాన్ని కాపాడేందుకు సీఎం కేసీఆర్.. కుటుంబ సభ్యుడిలా శ్రద్ధ పెట్టడం ఆనందంగా ఉంది. న్యూట్రిషన్ కిట్లో మందులు, బలాన్నిచ్చే ఆహారం ఉన్నాయి. వాటిని తీసుకొని ఆరోగ్యంగా ఉంటున్నాం. కాన్పు సమయంలో ఇబ్బందులు ఉండవు. సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు.
-అఫ్రీన్, బీర్కూర్
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇంట్లో ఉంటాం. నా భర్త కూలి పనులు చేస్తాడు. మందులు, మంచి ఆహారం కొనాలంటే ఇబ్బందే. గర్భిణులకు ప్రభుత్వమే న్యూట్రిషన్ కిట్లను ఇవ్వడం సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు. నేను, మా కుటుంబం, ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం.
-ప్రేమల, బీర్కూర్