ఖలీల్వాడి మే 24: ఉమ్మడి జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. భానుడు అగ్ని గుండంలా మారి నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం నుంచే భానుడు భగభగ మంటున్నాడు. దీంతో బయటికి వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. ఎండవేడిమికి తట్టుకోలేక రోజంతా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒక్కసారిగా పెరిగిన ఎండ తీవ్రతకు బెంబేలెత్తుతున్నారు. పలు మండలాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రతి ఇంట్లో ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు 24 గంటలూ నడుస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
కొన్నిరోజులుగా ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకుపైగా నమోదుకావడం ఆందోళనకు గురిచేస్తున్నది. వడదెబ్బ బారిన పడి ఇప్పటికే పలువురు మృత్యువాత పడగా, తాజాగా భీమ్గల్ మండలంలో ఓ ఉపాధి హామీ మహిళా కూలీ వడదెబ్బతో మృతి చెందింది. మండుతున్న ఎండలకు ముఖ్యంగా వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు బయటికి వెళ్లాలంటే తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కొందరు ఎండ దెబ్బ, వడ దెబ్బ తెలియక ఆందోళన చెందుతున్నారు. ఎండదెబ్బ తగిలిన కూడా వడదెబ్బ అనుకొని కంగారు పడి సమస్యను మరింత తీవ్రతరం చేసుకొని దవాఖానలకు వెళ్తున్నారు.
వడ దెబ్బ, ఎండ దెబ్బకు తేడాలు..
వడ దెబ్బ అంటే ఎండ ఎక్కువగా ఉండి వేడి గాలులు వీచినప్పుడు శరీరం తట్టుకోలేక విఫలమై ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంది. అధిక ఉష్ణోగ్రతలకు ఎక్కువగా గురి కావడం అలసటకు దారితీస్తుంది. వేడి తిమ్మిరి వడ దెబ్బకు దారితీస్తుంది. మానసిక పరిస్థితి, చెమట, వికారం, వాంతులు, ఎర్రబడిన చర్మం, తలనొప్పి వడ దెబ్బకు సూచికలు. వెంటనే వైద్యులను సంప్రదించాలి. పిల్లలు, శిశువులు, 65 ఏండ్లు పైబడిన వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలి. వడ దెబ్బ తగిలినప్పుడు రోగిని వెంటనే చల్లని ప్రదేశాలకు తీసుకెళ్లాలి. తేలికపాటి దుస్తువులు వేయించాలి. రోగి చుట్టూ గుంపులు గుంపులుగా ఉండకూడదు.
ఎండ దెబ్బ అంటే శరీరం వేడిని తట్టుకోలేక అలసట చెందడం. శరీరంలోని నీటిని లేకుండా చేసి డీహైడ్రేషన్కు గురిచేస్తుంది. కండ్లు తిరగడం, కండరాల నొప్పులు, తలనొప్పి, తిమ్మిరి లక్షణాలు కల్పిస్తాయి. వెంటనే మజ్జిగ , ఓఆర్ఎస్ నీటిని అందించాలి. ఫ్యాన్ కింద గాలి తగిలే చోట ఉంచాలి. వడదెబ్బ, ఎండ దెబ్బకు తేడా తెలియక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఎండ దెబ్బ తగిలితే వెంటనే చల్లని నీటిని సేవించాలి. మజ్జిగ అందించాలి. కొన్నిసార్లు ఫిట్స్ వచ్చే అవకాశం ఉన్నది.
వడ దెబ్బతో ఉపాధి హామీ కూలీ మృతి
భీమ్గల్, ఏప్రిల్ 24: మండలంలోని రాహత్నగర్ చౌడ తండాకు చెందిన ఓ మహిళ వడ దెబ్బతో మృతిచెందింది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. తండాకు చెందిన దారావత్ బుజ్జి (42) రోజుమాదిరిగా శనివారం కూడా ఉపాధి పనులకు వెళ్లి వచ్చి తీవ్ర అస్వస్థతకు గురైంది. తగ్గుతుందని భావించి విశ్రాంతి తీసుకుంటుండగా ఆదివారం పరిస్థితి తీవ్రంగా మారడంతో అంబులెన్సులో భీమ్గల్లోని ఓ దవాఖానకు తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించారు. వారి సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం ఆర్మూర్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
మానసిక ఒత్తిడిని తగ్గించాలి
వడదెబ్బ తగిలిన వారికి ముందుగా మానసిక ఒత్తిడిని తగ్గించాలి. ఆందోళన కు గురిచేయకుండా ధైర్యం చెప్పాలి. ధైర్య మే ఒక బెస్ట్ మెడిసిన్. నిర్లక్ష్యం చేయకుండావెంటనే వైద్యులకు చూపించాలి.
-డాక్టర్ విశాల్, మానసిక వైద్య నిపుణుడు
జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలి
ఎండ దెబ్బ ..వడ దెబ్బ తగిలితే వెంటనే ప్రథమ చికిత్స ముందుగా చేయాలి. నీడపట్టునకు తీసుకెళ్లి మజ్జిగ తాగించాలి. శరీరాన్ని చల్లటి వస్త్రంతో తుడవాలి. ఆ తర్వాత వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. నిర్లక్ష్యం చేయవద్దు. ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు.
-డాక్టర్ జలగం తిరుపతిరావు, వైస్ ప్రిన్సిపాల్, ప్రభుత్వ వైద్యశాల