వినాయక్నగర్,ఫిబ్రవరి 4: నగరంలోని ఐదో టౌన్ పోలీస్స్టేషన్ ఏరియాలో ముగ్గురు ఇంటర్ విద్యార్థులు డమ్మీ పిస్తోల్తో హల్చల్ చేశారు. చీకట్లో కూర్చొని తమ వద్ద ఉన్న తుపాకీని పేలుస్తూ భయబ్రాంతులకు గురిచేశారు. నగరంలోని ఖిల్లా పరిధిలోని బొడ్డెమ్మ చెరువు సమీపంలో ఉన్న కేంద్రీయ విద్యాలయం పక్కన శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నది. బొడ్డెమ్మ చెరువుకు వెళ్లే దారిలో మహిళలు, వృద్ధులు రోజూ సాయంత్రం వాకింగ్ చేస్తుంటారు. శనివారం రాత్రి మహిళలు అటు నుంచి వెళ్తున్న క్రమంలో చీకట్లో కూర్చొని ఉన్న ముగ్గురు పోకిరీలు తమ చేతిలో ఉన్న తుపాకీని పేల్చడంతో భారీ శబ్దానికి వారు ఉలిక్కిపడ్డారు.
అదే సమయంలో విధులు ముగించుకొని అటుగా వెళ్తున్న మహిళా హోంగార్డు ఇదంతా గమనించింది. వెంటనే బ్లూకోట్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో స్థానికుల సహాయంతో ఆ ముగ్గురిని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇదిలా ఉండగా గతేడాది అక్టోబర్ 18న వన్టౌన్ పరిధిలో సైతం పోకిరీలు డమ్మీ తుపాకీతో జనాలను భయపెట్టారు. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మూడున్నర నెలల్లోనే రెండు ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
రాత్రి మా సిబ్బంది స్టేషన్కు తీసుకువచ్చిన పిస్తోల్ను డమ్మీ (లైటర్)తుపాకీగా గుర్తించాం. హైమద్పుర, మాలపల్లి కాలనీకి చెందిన ముగ్గురు మైనర్లు.. హైమదీ మార్కెట్లో రూ.వెయ్యికి పిస్తోల్ను కొనుగోలు చేసినట్లుగా దర్యాప్తులో తేలింది. ఇప్పటి వరకు ఎవరినైనా బెదిరించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం.