ధర్పల్లి, డిసెంబర్ 19 : రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రజల సౌకర్యార్థం నిర్మిస్తున్న రోడ్లను ధ్వంసం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, కేజ్వీల్ ట్రాక్టర్స్ ఎలాంటి రక్షణ ప్రత్యామ్నాయ మార్గాలు లేకుండా రోడ్డుపై తిరగకుండా చూడాలని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఎస్సై వంశీకృష్ణరెడ్డికి సూచించారు. సోమవారం సాయంత్రం మండలంలోని ప్రాజెక్టు రామడ్గు గ్రామానికి ఓ అభివృద్ధి కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తున్న సందర్భంగా ఇటీవలే కోట్లాది రూపాయలు వెచ్చించి వేయించిన తారు రోడ్డుపై కేజ్వీల్ ట్రాక్టర్స్ నడిచి రోడ్డుపై గీతలు పడడం, సైడ్లు కోసుకుపోవడాన్ని గమనించిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా వాహనాన్ని ఆపి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ప్రతి ఒక్కరూ రోడ్డు పాడవకుండా చూడాలని ప్రజా ప్రతినిధులకు, అక్కడున్న వారికి సూచించారు. రోడ్డును ధ్వంసం చేస్తే ఉపేక్షించరాదని, చర్యలు తీసుకోవాలన్నారు. కేజ్వీల్ ట్రాక్టర్స్ రోడ్డుపై నడిపేటప్పుడు పట్టీలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టాలని ఎస్సైకి సూచించారు. ఈ మేరకు గ్రామాల్లో సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఎమ్మెల్యే వెంట జిల్లా ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు, జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, కేసీఆర్ సేవాదళ్ కన్వీనర్ కోర్వ దేవేందర్, రామడ్గు సొసైటీ చైర్మన్ రాజేందర్రెడ్డి, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు రమేశ్గౌడ్, నాయకులు సోమ శేఖర్రెడ్డి, నాయకులు ఉన్నారు.