నిజామాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) మహిళా సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం.. అతివల ఆరోగ్యానికి సైతం పెద్దపీట వేస్తున్నది. మహిళా ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు ద్వారా వారికి ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నది. అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఆరోగ్య మహిళా కేంద్రాలకు శ్రీకారం చుట్టింది. ప్రతి మంగళవారం మహిళలకు ఎనిమిది రకాల వైద్య పరీక్షలు చేసి, అవసరమైన చికిత్సలు అందిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయా కేంద్రాలు సత్ఫలితాలనిచ్చాయి. ప్రధానంగా పేద, మధ్యతరగతికి చెందిన మహిళల కోసం ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలు అమూల్యమైన సేవలందిస్తున్నాయి.
ఈ తరుణంలో ఆరోగ్యమహిళా కేంద్రాలను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో కొత్తగా మరో మూడు కేంద్రాలను, కామారెడ్డి జిల్లాలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నది. నిజామాబాద్ జిల్లాలో నగరంలోని గౌతమ్నగర్ యూపీహెచ్సీ, వేల్పూర్, చౌట్పల్లి పీహెచ్సీలలో నేటి నుంచి మహిళలకు ఎనిమిది రకాల వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు. ఇక, కామారెడ్డి జిల్లాలో రాజీవ్నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్(యూపీహెచ్సీ), లింగంపేట్, సదాశివనగర్, రాజంపేట్ పీహెచ్సీలలోనూ మహిళా ఆరోగ్యకేంద్రాలను ప్రారంభించనున్నారు. ఆయా కేంద్రాల్లో మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, సర్వైకల్, రొమ్ముక్యాన్సర్ స్క్రీనింగ్, థైరాయిడ్, మూత్రకోశ సంబంధిత వ్యాధుల పరీక్షలు చేస్తారు. అవసరమైన మందులు అందజేస్తారు.