నిజామాబాద్ క్రైం,డిసెంబర్ 9 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజారాం స్టేడియంలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల ఈవెంట్స్ రెండో రోజైన శుక్రవారం కొసాగాయి. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన శారీరదారుఢ్య పరీక్షలను కమిషనర్ ఆఫ్ పోలీస్ కె.ఆర్.నాగరాజు పర్యవేక్షణలో సాయంత్రం వరకు నిర్వహించారు. రెండో రోజు 800 మంది అభ్యర్థులను పిలువగా 683 మంది మాత్రమే హాజరయ్యారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్, బయోమెట్రిక్తో పాటు 1600 మీటర్ల పరుగు పందెం నిర్వహించారు. ఎత్తు కొలతలు తీసుకోవడంతో పాటు ఈవెంట్స్ నిర్వహించారు. 359 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు అధికారులు వెల్లడించారు.
ఎంపిక సమయంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద్ బాబు, అదనపు డీసీపీ గిరిరాజు, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, సీసీఎస్, హోమ్గార్డ్స్, ట్రాఫిక్, సీటీసీ ఏసీపీలు ఏ.వెంకటేశ్వర్, ఆర్.ప్రభాకర్ రావు, కె.ఎం.కిరణ్ కుమార్, రమేశ్, శ్రీనివాస్, నారాయణ, శ్రావణ్ కుమార్, ఏఆర్ ఏసీపీ సంతోష్, కామారెడ్డి ఏఆర్ డీఎస్పీ ఉదయ్ కృష్ణ, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులుతో పాటు ఇతర అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి వస్తున్న అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల ఈవెంట్స్లో భాగంగా మూడో రోజైన శనివారం కేవలం మహిళలకు మాత్రమే నిర్వహించనున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన మహిళా అభ్యర్థులు ఈవెంట్స్కు హాజరుకావాల్సి ఉంటుంది.