నిజామాబాద్ : జిల్లాలో హరితహారం మొక్కల నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం పట్ల కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సీరియస్ అయ్యారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించిన అధికారులు, సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించారు.
మల్కాపూర్, అబ్బాపూర్(ఎం) గ్రామ శివార్లలో హరితహారం మొక్కలు అస్తవ్యస్తంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత ఎంపీడీఓ, ఉపాధి హామీ ఏపీవో, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది అందరికి మెమోలు జారీ చేయాలని ఆదేశించారు.
కలెక్టర్ నారాయణరెడ్డి శుక్రవారం జానకంపేట్ – బాసర మార్గంలో జిల్లా సరిహద్దు వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలు పరిశీలించారు. ఈ సందర్భంగా మల్కాపూర్, అబ్బాపూర్ (ఎం) శివార్లలో మొక్కలు ఎండిపోవడం, ట్రీగార్డులు కింద పడిపోవడం, మొక్కల చుట్టూ సాసరింగ్ చేయకపోవడం, మొక్కలకు నీరందించకపోవడం వంటి లోపాలను గమనించిన కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రజా ధనాన్ని పెద్ద ఎత్తున వెచ్చిస్తూ నాటిన మొక్కల నిర్వహణ ఇంత అధ్వాన్నంగా ఉండడం అధికారుల నిర్లక్ష్యాన్ని చాటుతోందని అన్నారు. బాధ్యులైన వారందరికి మెమోలు జారీ చేయాలని కలెక్టర్ అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు.
హరితహారం పనుల్లో పాల్గొంటున్న కూలీలకు నిబంధనలకు అనుగుణంగా వెంటనే వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.