నవీపేట, డిసెంబర్ 11 : మరికొద్ది గంటల్లో పెండ్లి పీటలు ఎక్కాల్సిన వధువు విగతజీవిగా మారింది. పచ్చని పందిరి కింద సంతోషంగా గడపాల్సిన ఇంట్లో రోదనలు మిన్నంటాయి. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలో వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం చోటు చేసుకున్నది. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన వ్యాపారి ప్రభాకర్-ఉషారాణిలకు కుమారుడు, కూతురు ర్యాగల్ల రవళి (26) ఉన్నారు. నిజామాబాద్కు చెందిన సంతోష్తో రవళి నిశ్చితార్థం ఆగస్టులో జరిగింది.
కాగా సంతోష్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. రూ. 2 లక్షల కట్నం, రెండు కిలోల వెండి, ఐదు తులాల బంగారం కట్నంగా ఇచ్చేందుకు అంగీకారం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 11వ తేదీన (ఆదివారం) నిజామాబాద్లో పెండ్లి చేయాలని నిర్ణయించారు. కూతురు పెండ్లిని అంగరంగంగా వైభవంగా చేసేందుకు తల్లిదండ్రులు అన్ని ఏర్పాట్లు చేశారు. రవళి కూడా ఉద్యోగం చేయడంతో పాటు, ఆస్తిలో సగం వాటా కావాలని సంతోష్ నిత్యం వేధింపులకు గురిచేసేవాడు.
శనివారం మెహందీ ఫంక్షన్ సందర్భంగా అప్పటి వరకు కుటుంబ సభ్యులతో సంతోషంగా నృత్యాలు చేస్తూ రవళి ఆనందంగా గడిపింది. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో రవళికి సంతోష్ నుంచి ఫోన్ వచ్చింది. కుటుంబ సభ్యులందరూ నిద్రలోకి జారుకున్న కొద్ది క్షణల్లోనే రవళి పక్క గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. రవళితో చివరి ఫోన్ కాల్ సంతోష్తోనే మాట్లాడింది. ఈ కోణంలో పోలీసులు సైతం అబ్బాయి అమ్మాయి ఫోన్ కాల్డేటాలను పరిశీలిస్తున్నారు.
రవళి ఆత్మహత్యకు సంతోష్ కారణమని తండ్రి ప్రభాకర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆగస్ట్టులో నిశ్చితార్ధం జరిగిందని అప్పటి నుంచి సంతోష్ ఆస్తి కోసం కూతురిని వేధిస్తున్నాడని పేర్కొన్నారు.
ఎన్నో కలలతో దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టాలనుకున్న రవళి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. పీజీ వరకు చదువుకున్న కూతురు భవిష్యత్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని భావించిన ఆ తల్లిదండ్రులు ఆమె మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు.
రవళి ఆత్మహత్య సంఘటనలో సంతోష్పై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై రాజారెడ్డి తెలిపారు. సంతోష్.. ఉద్యోగం చేయాలని రవళిపై ఒత్తిడి చేసి ఆత్మహత్యకు ప్రేరేపించాడని తెలిపారు. తండ్రి ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. రవళి ఆత్మహత్యకు కారణమైన సంతోష్ను కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తెడ్డు పోశెట్టి, బి.సూరిబాబు డిమాండ్ చేశారు.