పల్లెటూళ్లు ప్రగతిపథంలో దూసుకెళ్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ ప్రోత్సాహంతో అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి. మన పల్లెల విజయసోపానాలు దేశంలో మార్మోగుతున్నాయి. జాతీయ అవార్డులు వరుస కడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లెప్రగతితో పల్లెల ముఖచిత్రమే మారిపోయింది. పారిశుద్ధ్యం మెరుగుపడింది. ప్రకృతివనాలతో పచ్చదనం విచ్చుకున్నది. సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులతో పల్లెటూరు సరికొత్త శోభను సంతరించుకున్నది. సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన పల్లెలు.. స్వరాష్ట్రంలో సర్వాంగ సుందరంగా మారాయి. చెత్తాచెదారం పోయి అద్దంలా మెరుస్తున్నాయి. అభివృద్ధి బాట పట్టిన గ్రామాలే తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనకు గీటురాయిగా నిలుస్తున్నాయి. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు ఊరూరా ఘనంగా పల్లెప్రగతి దినోత్సవం నిర్వహించనున్నారు.
తెలంగాణ పల్లెలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. ఒకప్పుడు మురికి కూపాలుగా ఉన్న గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో మన పల్లెలు అభివృద్ధికి మారుపేరుగా నిలుస్తున్నాయి. వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, కంపోస్టు షెడ్లు, సీసీ రోడ్లు, ఇంటింటికీ తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేస్తుండడంతో కొత్త సొబగులు అద్దుకుంటున్నాయి. హరితహారంలో మొక్కలు నాటి సంరక్షిస్తుండడంతో గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. పల్లెల్లో ప్రగతి జోరుకు జాతీయ స్థాయిలో సొంతం చేసుకుంటున్న అవార్డులే నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ప్రగతికి నిదర్శనం పాల్దా..
నిజామాబాద్ రూరల్, జూన్ 14 : ఉమ్మడి రాష్ట్ర పాలనలో చాలీచాలనీ నిధులు, అరకొర సౌకర్యాలతో సమస్యల వలయంలో కొట్టుమిట్లాడుతూ దశాబ్దాల తరబడి బతుకు జీవనం సాగించిన నిజామాబాద్ రూరల్ మండలంలోని పాల్దా గ్రామస్తులు ప్రస్తుతం సకల సౌకర్యాలతో సంతోషంగా జీవనం గడుపుతున్నారు. రాష్ట్రం సాధించాక సీఎం కేసీఆర్ పుష్కలంగా నిధులు మంజూరు చేస్తుండడంతో పల్లె ప్రాంతాలన్నీ అభివృద్ధి బాట పడుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా పాల్దా గ్రామం నాలుగేండ్లలోనే ఊహించని విధంగా అభివృద్ధి సాధించి జిల్లాస్థాయిలో రెండుసార్లు ఉత్తమ జీపీ అవార్డు దక్కించుకున్నది. సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన (ఎస్ఏజీవై) పథకం అమలులో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు జాతీయస్థాయిలో 3వ స్థానంలో నిలిచింది.
వైకుంఠధామంలో సకల వసతులు
రెండున్నరేండ్ల క్రితం వరకు ఇక్కడ ఉన్న వైకుంఠధామం వసతుల లేమితో కొట్టుమిట్టాడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మంజూరు చేసిన రూ.12 లక్షలతో సర్వ హంగులతో వైకుంఠధామం నిర్మించారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బోరు వేయించి నీటివసతి కల్పించారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్రావు అందించిన విరాళంతో శంకరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
పారిశుద్ధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత
పల్లెప్రగతి అమలులోకి వచ్చాక పారిశుద్ధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. కంపోస్ట్ షెడ్డులో సేంద్రియ ఎరువును తయారుచేస్తున్నారు.
విద్యుత్ సమస్యలు పరిష్కారం
గ్రామంలోవిద్యుత్ సమస్యలు తొలగిపోయాయి. వివిధ ప్రాం తాల్లో కొత్తగా 45 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. కిందికి వేలాడుతూ ప్రమాదకరంగా మారిన విద్యుత్ తీగెలను సరి చేశారు.
చేపట్టిన అభివృద్ధి పనులు
ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చొరవతో పాల్దా శివారులో ఉన్న వాగుపై రూ.4.45 కోట్లతో చెక్డ్యాం, రూ.16 లక్షలతో జీపీ భవనం, రూ.50లక్షలతో సీసీ రోడ్లు నిర్మించారు. రూ.2.20 కోట్లతో బీటీ రోడ్లు నిర్మించారు. కోటి రూపాయలతో నిజాంసాగర్ ఉప కాలువ ఆధునీకరణ పనులు చేపట్టారు. వైకుంఠధామం రూ.12 లక్షలతో, కంపోస్ట్ షెడ్డును రూ.2.50 లక్షలతో నిర్మించారు. సర్పంచ్ సుప్రియా నవీన్, ఎంపీటీసీ ఆమని నరేశ్, పాలకవర్గ సభ్యులు, సిబ్బంది, వీడీసీ సభ్యులు, అధికారులు సమష్టి కృషితో పల్లెప్రగతి పనులు ఆదర్శంగా నిలిచాయి.
రూపురేఖలు మారిన గిరిజన తండాలు..
గాంధారి, జూన్ 14 : రాష్ట్రంలోని ప్రతి గ్రామా న్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ 500 జనాభా కలిగిన ప్రతి పల్లె, తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పా టు చేశారు. కామారెడ్డి జిల్లాలో 214 కొత్త జీపీలు ఏర్పడగా, 116 తండాలు కొత్త పంచాయతీలుగా అవతరించాయి. జిల్లాలో మొత్తం 526 గ్రామపంచాయతీలుండగా ఇందులో వంద శాతం ఎస్టీ జనాభా కలిగిన తండాలు 63 ఉన్నాయి. నూతనంగా ఏర్పడిన జీపీలకు ప్రత్యేక నిధులు రావడంతో అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి. ప్రతి తండాలో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, నర్సరీలు, క్రీడా మైదానాలు, హరితహారం తదితర పనులను చేపట్టారు. ఒక్కప్పుడు ఎలాంటి అభివృద్ధికి నోచుకోని తండాలు.. పంచాయతీలుగా అవతరించిన నాటినుంచి అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి.
మారిన నీలా రూపురేఖలు
రెంజల్, జూన్ 14 : పల్లె ప్రగతితో మండలంలోని నీలా గ్రామ రూపురేఖలు మారిపోయాయి. నీలా పంచాయతీ పరిధిలో నీలా, నీలా క్యాంప్ గ్రామాలు ఉన్నారు. గ్రామంలో విడుతల వారీగా చేపట్టిన పల్లెప్రగతిలో కార్యక్రమాలతో ఏండ్లుగా ఉన్న సమస్యలు పరిష్కారమయ్యాయి. ప్రజల సమస్యలన్నీ పరిష్కారం కావడంతో ఇంటి పన్ను వసూళ్లలో ప్రతి ఏడాది వంద శాతం చెల్లింపు సాధ్యమవుతున్నది.
ప్రగతిబాట.. నవీపేట..
నవీపేట, జూన్ 14 : జిల్లా కేంద్రానికి ఆమడ దూరం లో ఉన్న నవీపేట గ్రామ ప్రజలు గుక్కెడు నీటి కోసం నానా తిప్పలు పడే వారు. సౌకర్యాల లేమి కొట్టచ్చినట్లు కనిపించేది. రాష్ట్రం ఏర్పాటు అనంతరం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక చొరవ, ఎమ్మెల్యే షకీల్ సహకారంతో సర్పంచ్ శ్రీనివాస్ గ్రామాన్ని అభివృద్ధి బాట పట్టించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పల్లెల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులను మంజూరు కావడంతో గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతున్నారు. తొమ్మిదేండ్లలో రూ.20 కోట్ల వ్యయంతో నవీపేట సర్వంగా సుందరంగా తయారైంది. మండలంలోని యంచ వద్ద ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పంప్హౌస్ నుంచి పైప్లైన్ ద్వారా ప్రతిరోజు ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నారు.
ఉత్తమ గ్రామపంచాయతీగా రైతునగర్
బీర్కూర్, జూన్ 14 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వినియోగించుకుంటూ.. అభివృద్ధి సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమ లు చేయడానికి రైతునగర్ పంచాయతీ పాలకవర్గం కృషి చేస్తున్నది. దీంతో సామాజిక భద్రతలో ఉత్తమ పంచాయతీ అవార్డును సొంతం చేసుకున్నది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉత్తమ గ్రామపంచాయతీల విభాగంలో కామారెడ్డి జిల్లా నుంచి రైతునగర్ గ్రామం ఎంపిక కావడంతో నేడు (గురువారం) రవీంద్ర భారతిలో సర్పంచ్ మద్దినేని నాగేశ్వర్రావు పురస్కారాన్ని అందుకోబోతున్నారు.
అవార్డుకు దోహదపడిన అంశాలు
ప్రతీ వీధిలో సీసీరోడ్లు, డ్రైనేజీలు, సర్పంచ్ సొంత నిధులతో ఎల్ఈడీ దీపాల ఏర్పాటు, మురికి నీరు నిల్వకుండా చర్యలు, కల్యాణ మండపం, క్రీడామైదానం, గ్రామపంచాయతీ, అంగన్వాడీ నూతన భవనాలు, రైతు వేదిక, వైకుంఠధామం, పల్లెప్రకృతివనం, డంపింగ్యార్డు, నర్సరీ, సురక్షిత మంచినీటి సదుపాయం తదితర అంశాలు ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డును తెచ్చిపెట్టాయి.
ఏడు అవార్డులు శ్రీనగర్ సొంతం
నిజామాబాద్ రూరల్, జూన్ 14 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లెప్రగతితో గ్రామాలు కొత్త సొబగులను అద్దుకున్నాయి. హామ్లేట్ గ్రామాలకు సైతం పంచాయతీ హోదా కల్పించడంతో అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. ఇందుకు నిజామాబాద్ రూరల్ మండలంలోని శ్రీనగర్ గ్రామమే నిదర్శనంగా నిలుస్తున్నది. గుండారం జీపీ పరిధిలో ఉన్న శ్రీనగర్ను నూతన పంచాయతీగా ఏర్పాటు చేశారు. పల్లెప్రగతి, హరితహారం తదితర కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేశారు. దీంతో గ్రామమంతటా పచ్చదనం పరుచుకున్నది.
వంద శాతం ఇంటి పన్ను వసూలుతో పాటు పచ్చదనం, పరిశుభ్రత, వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్డు నిర్మాణంతో రాష్ట్రీయ గ్రామస్వరాజ్ అభియాన్ కింద శ్రీనగర్ ఎంపిక కాగా ప్రభుత్వం రూ.20లక్షలు మంజూరు చేసింది. పంచాయతీల వారీగా ప్రభుత్వం అవార్డులు ప్రకటించగా శ్రీనగర్ జీపీ జిల్లాస్థాయిలో క్లీన్ అండ్ గ్రీన్ విభాగంలో అవార్డు దక్కించుకున్నది. దీంతో పాటు మండల స్థాయిలో మరో ఆరు అవార్డులు దక్కించుకుని ఆదర్శంగా నిలిచింది.
సోంపూర్కు కొత్త సొబగులు
కోటగిరి, జూన్ 14 : పల్లె ప్రగతితో మండలంలోని సోంపూర్ గ్రామ రూపురేఖలు మారాయి. విడుతల వారీగా చేపట్టిన పల్లె ప్రగతితో దీర్ఘకాలిక సమస్యలెన్నో పరిష్కారమయ్యాయి. పల్లె ప్రకృతి వనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వైకుంఠధామం, కంపోస్టు షెడ్డు, హరితహారం మొక్కలు, సీసీ రోడ్ల తో పల్లెలు కొత్తరూపు సంతరించుకున్నాయి. సోంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పీఎస్ఆర్ నగర్(రాంగంగానగర్)లో హరితహారం మొక్కలు నాటడంతోపాటు పల్లెలో శుభ్రం చేయించారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాట డం, వైకుంఠధామం, కంపోస్టుషెడ్డు, సీసీ రోడ్లు, ఎల్ఈడీ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. మండలంలోనే ఆదర్శంగా నిలవడంతో సోంపూర్ గ్రామానికి ఉత్తమ పంచాయతీ అవార్డును అందించారు.
కుకునూర్లో ప్రగతి వెలుగులు
వేల్పూర్, జూన్ 14 : మండలంలోని కుకునూర్ గ్రామంలో పల్లె ప్రగతితో అభివృద్ధి వెలుగులు నిండా యి. గతంలో గ్రామంలో తాగునీటికి అడుగడుగునా ఇబ్బందులు ఉండగా ప్రస్తుతం ఆ తిప్పలు తొలగిపోయా యి. ప్రస్తుతం ప్రతిరోజూ ఇంటింటికీ నీరు అందుతున్నది. దీంతో పాటు ఐదు విడుతలుగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాల ఫలితంగా గ్రామంలో ఎక్కడ చూసినా పచ్చదనం అలరారుతున్నది. గ్రామంలో వైకుంఠధామం,డంపింగ్ యార్డు, చెత్త సేకరణకు ట్రాక్టర్ ఏర్పాటు చేశారు. ఎక్కడా చూసినా సీసీ రోడ్లు దర్శనమిస్తున్నాయి. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రోత్సాహంతో పంచాయతీ పాలకవర్గం గ్రామంలో సకల సౌకర్యాలు కల్పించారు. గ్రామంలో జరుగుతున్న కార్యక్రమాలును అధికారులు గుర్తించి 2021-22 సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద దేశ వ్యాప్తంగా ఉత్తమ పంచాయతీగా ఎంపిక చేసింది.