తెలంగాణ యూనివర్సిటీలో నడుస్తున్న ‘గుప్తా’ధిపత్యానికి పాలక మండలి చెక్ పెట్టింది. ఈ మేరకు హైదరాబాద్లో బుధవారం జరిగిన ఈసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీసీ రవీందర్గుప్తా మాటను ఎవ్వరూ వినొద్దని ఆదేశించిన ఈసీ.. ఆయన అక్రమాలపై విచారణ జరపాలని ఏసీబీకి లేఖ రాసింది. అలాగే, ప్రొ.విద్యావర్ధినిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఏసీ శ్రీనివాస్ను శాశ్వతంగా తొలగించింది.
నిజామాబాద్, ఏప్రిల్ 26, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
తెలంగాణ యూనివర్సిటీలో నడుస్తున్న ‘గుప్తా’ధిపత్యానికి వర్సిటీ పాలక మండలి (ఈసీ) చెక్ పెట్టింది. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ గుప్తాకు గట్టిగా కళ్లెం వేసింది. యూనివర్సిటీలో ఇక మీదట వీసీ రవీందర్ గుప్తా మాటను ఎవ్వరూ వినొద్దని, ఆయన ఆదేశాలను అమలు చేయకూడదని పాలకవర్గం స్పష్టం చేసింది. ఈ మేరకు హైదరాబాద్లోని రూసా భవనంలో బుధవారం జరిగిన టీయూ ఈసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ఈ భేటీకి వీసీ డుమ్మా కొట్టడంతో, పాలకమండలి చైర్మన్గా సీనియర్ ఐఏఎస్ అధికారిణి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ వ్యవహరించారు. మొత్తం 14 మంది ఈసీ సభ్యుల్లో రాజేందర్రెడ్డి తప్ప అందరూ హాజరయ్యారు. ప్రభుత్వం నియమించిన ఈసీ మెంబర్లలో పి.గంగాధర్గౌడ్, మారయ్యగౌడ్, వసుంధరతో పాటు ప్రొ.నసీమ్, ప్రొ.రవీందర్, రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరి పాల్గొన్నారు. ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ సైతం మీటింగ్కు హాజరై వీసీ చేసిన తప్పులపై లోతుగా సమావేశంలో చర్చించారు. సమాచారం ఇచ్చినప్పటికీ వీసీ సమావేశానికి రాకపోవడంపై సభ్యులంతా అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ యూనివర్సిటీకి పాలనాపరంగా కీలకంగా వ్యవహరించాల్సిన వ్యక్తే ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కి ప్రవర్తించడం సరికాదన్నారు. ఇందుకు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్న అభిప్రాయాన్ని సభ్యులు స్పష్టం చేశారు. వీసీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలకవర్గాన్ని పట్టించుకోకుండా వీసీ తీసుకున్న అన్ని నిర్ణయాలపై సమావేశంలో సమీక్షించారు.
నసీమ్కు ప్రమోషన్..
పదోన్నతులపై పాలకమండలి సమావేశంలో సీరియస్గా చర్చ జరిగింది. ప్రొఫెసర్ పదోన్నతిలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమావేశం దృష్టికి వచ్చింది. 2012 బ్యాచ్ వాళ్లకు ప్రమోషన్లలో ఇబ్బందులు తలెత్తగా, వీటిని ఈసీ సమావేశం క్లియర్ చేసింది. దీంతో పాటుగా ప్రొఫెసర్ నసీమ్కు సీనియర్ ప్రొఫెసర్గా పదోన్నతికి ఆమోదం తెలిపింది. వీసీగా ప్రొ.రవీందర్ గుప్తా బాధ్యతలు చేపట్టిన సమయంలో రిజిస్ట్రార్గా పని చేసిన ఆమెకు సీనియర్ ప్రొఫెసర్గా ప్రమోషన్ రావాల్సి ఉంది. అయితే, వర్సిటీలో కొంత మంది ఆమెను కూడా వదలకుండా డబ్బులు డిమాండ్ చేసినట్లుగా తెలిసింది. పదోన్నతి కావాలంటే రూ.3 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు ప్రొ.నసీమ్ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఈసీ మెంబర్గా ఉన్న వ్యక్తి నుంచే డబ్బులు అడిగిన వైనంపై సీనియర్ ఐఏఎస్ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంత ఘోరమైన దుస్థితిని తామెప్పుడు చూడలేదని వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 19న జరిగిన మీటింగ్లో తీసుకున్న కీలక నిర్ణయాలపై ఎక్కువగా ఈసీ సభ్యులు చర్చించారు. వీసీ అక్రమాలపై విచారణ, పాలన తీరుతెన్నులపైనా రిజిస్ట్రార్ యాదగిరిని అడిగి తెలుసుకున్నారు.
వీసీ తింగర వేషాలు..
బాధ్యతాయుతమైన పదవిలో హుందాగా వ్యవహరించాల్సిన టీయూ వీసీ అందుకు విరుద్ధంగా వ్యవహరించడం నవ్వులపాలు చేస్తోంది. ఏప్రిల్ 19న జరిగిన ఈసీ మీటింగ్ నుంచి వీసీ రవీందర్గుప్తా వాకౌట్ చేశారు. దీంతో పాలకవర్గం నిబంధనల మేరకు.. ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ ఐఏఎస్ అధికారిణి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను సమావేశానికి చైర్మన్గా నియమించారు. ఆమె అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరిగి ఏప్రిల్ 26న సమావేశం కావాలని నిర్ణయించి, ఈ విషయాన్ని వీసీ రవీందర్కు సైతం సమాచారం ఇచ్చారు. అయితే, వీసీ వ్యవహరించిన ప్రవర్తన అందరినీ విస్తుగొల్పింది. బుధవారం (ఏప్రిల్ 26న) జరగాల్సిన ఈసీ మీటింగ్ రద్దు చేయబడినట్లుగా తనకు తాను గా ఒక లేఖను సృష్టించి ఈసీ సభ్యులకు విరుద్ధంగా పంపించడంతో వారు నివ్వెరపోయారు. వీసీ లేఖలను బుట్టదాఖలు చేసిన పాలకవర్గం ప్రభుత్వ ఆదేశాల మేరకు సమావేశమైంది. వరుసగా రెండోసారి వాకాటి కరుణను చైర్మన్గా నియమించి ఈసీ మీటింగ్ను కొనసాగించి కీలక నిర్ణయాలు తీసుకుంది.
వారంతా ఇంటికే..
వర్సిటీ పరిపాలన గాడిలోకి వచ్చే వరకు వరుసగా భేటీ కావాలని పాలకవర్గం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మే 5న మరోమారు సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని వీసీకి సాంకేతికంగా పంపించారు. ఆ రోజు వీసీ వచ్చినా, రాకున్నా యథావిధిగా సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పష్టంగా పేర్కొన్నారు. సర్కారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారు ఎంతటి వారైనా భవిష్యత్తులో చట్టం ముందు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని వారు కుండబద్దలు కొట్టారు. వీసీ ఆదేశాలను యూనివర్సిటీలో ఎవ్వరూ పాటించవద్దని, పాలకవర్గం తీసుకున్న నిర్ణయాలను మాత్రమే రిజిస్ట్రార్ అమలు చేస్తారని మరోసారి స్పష్టం చేశారు. వీసీ అక్రమాలపై ఐదుగురు సభ్యులు గల కమిటీ విచారణ ప్రారంభిస్తుందని తెలిపారు. ఈసీ అనుమతి లేకుండా వర్సిటీలో అక్రమంగా నియమితులైన వారిని ఇంటికి పంపించాల్సిందేనని ఈసీ నిర్ణయించింది. ఒకవేళ వారి వద్ద ఎవరైనా డబ్బులు వసూలు చేసి ఉంటే, అందుకు వ్యక్తిగతంగా సంబంధిత వ్యక్తులే బాధ్యులు అవుతారని పాలకమండలి పేర్కొంది.
వీసీ అక్రమాలపై ఏసీబీతో విచారణ
బుధవారం సమావేశమైన పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకున్నది. వీసీ రవీందర్ అక్రమాలపై విచారణ జరపాలని ఏసీబీకి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే, ఇన్చార్జి రిజిస్ట్రార్ హోదాలో అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ప్రొఫెసర్ విద్యావర్ధినిపై సస్పెన్సన్ వేటు వేశారు. నిజాయతీ నిరూపించుకునే వరకూ విధులకు రావొద్దని ఈసీ స్పష్టం చేసింది. అలాగే, తీవ్ర అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గణితశాస్త్ర విభాగం అకాడమిక్ కన్సల్టెంట్ శ్రీనివాస్ను శాశ్వతంగా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.