ఉపాధ్యాయుల ఎదురుచూపులు ఫలించనున్నాయి. బదిలీలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. రాఖీ కానుకగా రాష్ట్ర ప్రభుత్వం టీచర్లకు తీపికబురు అందిస్తూ.. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ట్రాన్స్ఫర్లు చేయాలని నిర్ణయించింది. బదిలీ ప్రక్రియకు సంబంధించి నేడో, రేపో పూర్తి స్థాయిలో స్పష్టత రానుంది. నెల రోజుల్లోపే ట్రాన్స్ఫర్లు పూర్తి చేయాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉన్నది. దాదాపు అందరికీ అవకాశం కల్పించాలన్న లక్ష్యంతో సెప్టెంబర్ 1వ తేదీని కటాఫ్గా నిర్ణయించింది. హైకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి గురువారం అధికారులతో సమీక్షించారు. అత్యంత పారదర్శకంగా బదిలీలు చేపట్టాలని, ట్రాన్స్ఫర్లకోసం దరఖాస్తు చేసుకోవాలని టీచర్లకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. కోర్టు తీర్పు వెలువడిన 24 గంటల్లోనే ప్రభుత్వం వేగంగా స్పందించండం, బదిలీలు చేపట్టాలని నిర్ణయం తీసుకోవడంపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– నిజామాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం దొరికింది. బదిలీ ప్రక్రియకు సంబంధించి కీలక నిర్ణయం వెలువడిన నేపథ్యంలో ఉపాధ్యాయ మిత్రులంతా సంయమనం పాటిస్తూ దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నా. కోర్టుకు వెళ్లకుండా సంయమనం పాటించి బదిలీ ప్రక్రియ విజయవంతమయ్యేలా సహకరించాలి.
– కుషాల్, పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి, కామారెడ్డి జిల్లా