నిజామాబాద్, ఆగస్టు 7, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అంచనాలను నిలబెడుతూ కామన్వెల్త్ క్రీడల్లో యువ బాక్సర్ నిఖత్ యావత్ దేశ ప్రజలను గర్వపడేలా చేసింది. కామన్వెల్త్ క్రీడల్లో 48-50 కేజీల విభాగంలో జరిగిన బాక్సింగ్లో బంగారు పతకాన్ని కొల్లగొట్టింది. సరిగ్గా ఇదే సంవత్సరంలో మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్.. అదే జోరును కనబరిచింది. తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది. ఫైనల్ పోరులో ప్రతి బౌట్లోనూ పంచ్ల మీద పంచ్లతో ప్రత్యర్థిని మట్టి కరిపించి పాయింట్ల పట్టికలో ముందు వరుసలో నిలిచింది.
ఉత్తర ఐర్లాండ్కు చెందిన కార్లే మెక్న్యూయ్పై అద్భుత విజయం సాధించి చరిత్ర సృష్టించింది. విజయ నాదంతో వేదికపై గర్జించి చూపరులను నిఖత్ ఆకట్టుకున్నది. నిఖత్ పసిడి పతకంతో కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు 17వ స్వర్ణం దక్కింది. మరోవైపు నిఖత్ విజయంతో విజేతల జాబితాలో ఇండియా ఏకంగా 4వ స్థానానికి ఎగబాకింది. ఇందూరుకు చెందిన మరో ఆణిముత్యం హుసాముద్దీన్ శనివారం అర్ధరాత్రి జరిగిన పోరులో కాంస్యంతో రికార్డు సృష్టించాడు. కేవలం 18 గంటల వ్యవధిలోనే జిల్లాకు చెందిన ఇరువురు క్రీడాకారులు కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.
బాక్సింగ్ క్వీన్ నిఖత్ జరీన్..
2018 – అంతర్జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్లో బంగారు పతకం సాధించిన బాక్సర్ నిఖత్ జరీన్ తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది. సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో జరిగిన 56వ అంతర్జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీల్లో భారత బాక్సర్లు మొత్తం 13 పతకాలు సాధించారు. 51కేజీల మహిళల విభాగంలో నిఖత్ బంగారు పత కం గెలుచుకున్నది. 2011లో టర్కీలో జరిగిన ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ మహిళల విభాగంలో బంగారు పతకం, 2014లో బల్గేరియాలో జరిగిన యూత్ వరల్డ్ బాక్సింగ్లో సిల్వర్ మెడల్, సెర్బియాలో నిర్వహించిన నేషన్స్ కప్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నీలో గోల్డ్ మెడల్ దక్కించుకున్నది. అస్సాంలో జరిగిన 16వ సీనియర్ మహిళల జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో 2015లో గోల్డ్ మెడల్, 2019లో బ్యాకాంగ్లో నిర్వహించిన థాయ్లాండ్ ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నీలో సిల్వర్ మెడల్ సాధించింది. నిజామాబాద్కు చెందిన నిఖత్ జరీన్ 1996, జూన్ 14న జన్మించింది. తల్లిదండ్రులు జమీల్ అహ్మద్, పర్వీన్ సుల్తానా. డిగ్రీ బీఏ చదువుతున్నది. విద్యాభ్యాసం అంతా నిజామాబాద్లోనే జరిగింది. అడిడాస్ కంపెనీకి 2018లో బ్రాండ్ అంబాసిడర్గా నిఖత్ ఒప్పందం చేసుకున్నది. 2022 మే 19న మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో బంగారు పతకం సాధించింది. మూడు నెలలు తిరగముందే కామన్వెల్త్ క్రీడల్లోనూ సత్తా చాటి బాక్సింగ్ క్వీన్గా నిలిచింది.
మహ్మద్ హుసాముద్దీన్..
అంతర్జాతీయ గడ్డపై మరో ఇందూర్ బిడ్డ మెరుపులు చూపిస్తున్నాడు. 2010 నుంచి ఇప్పటి వరకు ఏటా జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధిస్తూ ఇందూరు కీర్తిని నలువైపులా చాటుతున్నాడు మహ్మద్ హుసాముద్దీన్.. అతడు 1994, ఫిబ్రవరి 12న నిజామాబాద్లో జన్మించాడు. 2018 లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో కాంస్య పతకం సాధించిన బాక్సర్ హుసాముద్దీన్ తెలంగాణకు పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెట్టారు. తండ్రి శంషోద్దీన్ తోడుతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. శంషోద్దీన్ ఆరుగురు సంతానంలో మూడో వ్యక్తి హుసాముద్దీన్. ఢిల్లీలో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ ఓపెన్ బాక్సింగ్ చాంపియన్షిప్లో 23 ఏండ్లకే కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 2015లో కొరియాలో జరిగిన పోటీల్లో కాంస్య పతకం, 2016లో గౌహతిలో బంగారు పతకం, 2017 లో బల్గేరియాలో రజత పతకం, మంగోళియాలో కాంస్య పతకం, 2018లో వరుసగా ఆస్ట్రేలియా, బల్గేరియా, ఢిల్లీలో ని ర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో కాంస్య పతకాలు దక్కించుకున్నాడు. 2019లో బెంగళురు, ఖజకిస్తాన్లో జరిగిన పోటీల్లో బంగారు పతకాలు సాధించాడు. అతడు ఇటీవల చైనాలో జరిగిన ఏషియన్ చాంపియన్షిప్ పోటీల్లో స్వర్ణ పతకం సొంతం చేసుకున్నా డు. తాజాగా కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యంతో మరోసారి దేశ వ్యాప్తం గా పేరు సంపాదించాడు.
అభినందనల వెల్లువ..
కమ్మర్పల్లి/బీర్కూర్/ఖలీల్వాడి, ఆగస్టు 7: కామన్వెల్త్ క్రీడల్లో నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించడం తెలంగాణతో పాటు యావత్ దేశానికే గర్వకారణమని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. నిఖత్ జరీన్ బంగారు పతకం, హుసాముద్దీన్ కాంస్య పతకాలను సాధించడంపై ఆదివారం వేర్వేరు ప్రకటనల్లో హర్షం వ్యక్తంచేశారు. క్రీడాకారులతో పాటు కోచ్ శంషోద్దీన్ను అభినందించారు. కాగా.. నిఖత్కు ఇటీవల నిజామాబాద్లో సన్మాన కార్యక్రమం ఏర్పాటుచేసి మంత్రి వ్యక్తిగతంగా నగదు ప్రోత్సాహకాన్ని అందించారు. కామన్వెల్త్ క్రీడల్లో నిఖత్ బంగారు పతకం సాధించడంపై ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా అభినందించారు. నిఖత్ భారతదేశానికి మరోసారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తీసుకురావడం గర్వంగా ఉందన్నారు.