ఆర్మూర్: గిరిజనుల అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆశన్నగారి రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్మూర్ మున్సిపల్ 7వ వార్డు విశాఖనగర్కాలనీలో తీజ్ వేడుకను గిరిజనులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై రాజేశ్వర్రెడ్డి బంజారా కుల దైవమైన సేవలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంజారాల అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.
సంక్షేమ పథకాలను సద్వినియోగపర్చుకొని అభివృద్ధి చెందాలని రాజేశ్వర్రెడ్డి సూచించారు. అనంతరం విశాఖకాలనీలో తీజ్ పండగను పురస్కరించుకుని తీజ్ మొక్కలను పెంచారు. సాయంత్రం బంజారా సోదరీమణులు కలిసి కాలనీలో అంబరాన్నంటేలా తీజ్ ఉత్సవాలను నిర్వహించారు. అనంతరం అత్యంత భక్తిశ్రద్ధలతో తీజ్ మొలకలను కోటార్మూర్ చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో బంజారా ప్రతినిధులు కొర గంగాధర్నాయక్, బండి రాజునాయక్, పీర్సింగ్, టీఆర్ఎస్ నాయకులు పండిత్ పవన్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నా తదితరులు పాల్గొన్నారు.