చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం విషయంలో ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై మహిళా లోకం నిరసన వ్యక్తం చేసింది. మహిళా రిజర్వేషన్ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు, మహిళా సంఘాలన్నీ ఐక్యంగా ఉద్యమించాయి. ఇందుకు భారత్ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వం వహించగా, దేశవ్యాప్త ఉద్యమానికి మరోసారి నాంది వాచకమైంది. కవిత సారథ్యంలో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి జాగృతి కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లి ఆందోళనకు మద్దతుగా నిరాహార దీక్షలో కూర్చున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని మోదీ సర్కారును గట్టిగా డిమాండ్ చేశారు. మహిళా లోకమంతా గళమెత్తగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గందరగోళంలో పడింది.
దేశవ్యాప్త ఉద్యమం..
భారత్ జాగృతి సంస్థ మొదటి నుంచీ మహిళా కేంద్రం గా, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నది. ఉద్యమ కాలంలో మన సంస్కృతికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర సాధనలో మహిళాలోకాన్ని భాగస్వామ్యం చేసింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైతం పోరాటాలు చేస్తూ అనేక మందికి స్ఫూర్తిగా నిలిచారు. రాష్ట్ర సాధనలో చురుగ్గా పాల్గొని అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం పట్టాలెక్కినట్లే ఎక్కి.. వెనక్కి వెళ్లిన 33శాతం రిజర్వేషన్ బిల్లును తిరిగి ప్రజా చైతన్యం, ఉద్యమాల ద్వారా ఆమోదింపజేసుకోవడమే లక్ష్యంగా దేశవ్యాప్త ఉద్యమానికి కవిత శ్రీకారం చుట్టారు. ఇప్పటికే అనేక వేదికలపై గొంతెత్తి ప్రసంగాల ద్వారా భావజాలాన్ని వ్యాప్తి చేశారు. అనేక సంఘాలు, మేధావులు, మహిళా పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులతో భేటీలు నిర్వహించి వారి అభిప్రాయాలు, సలహాలను స్వీకరించారు. అందుకు తగినట్లుగానే పకడ్బందీ వ్యూహంతో మహిళా రిజర్వేషన్ బిల్లు సాధనే ఏకైక లక్ష్యంగా కవిత పోరాటం చేస్తుండడంపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
సర్వత్రా మద్దతు..
మహిళా రిజర్వేషన్ బిల్లు సాధన కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఉద్యమానికి పెద్దఎత్తున మద్దతు లభించిందని జాగృతి నాయకులు చెబుతున్నారు. ఊహించిన దానికన్నా ఎక్కువ మద్దతుతో నిరాహార దీక్ష విజయవంతం అయ్యిందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత స్పష్టమైన ప్రసంగం సైతం సభికులను ఉత్సాహపరిచింది. మూడు భాషల్లో కవిత మాట్లాడిన తీరుపై హర్షామోదాలు లభించాయి. జాతీయస్థాయిలో అందరి దృష్టిని ఆకట్టుకునే విధంగా, మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్ని కింది స్థాయికి తీసుకెళ్లేందుకు శాస్త్రీయంగా వివరించిన తీరును ప్రజలు మెచ్చుకుంటున్నారు. ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం.. అంటూ కవిత చేసిన నినాదం ప్రతి మహిళనూ ఆకర్షించింది. మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టరూపంలోకి తీసుకువస్తే అవకాశాలు మెండుగా లభించడంతోపాటు చట్టబద్ధమైన భద్రత కూడా లభిస్తుంది. ఇందుకు తెలంగాణలో స్థానిక సంస్థల్లో అమలైన 50శాతం రిజర్వేషన్ అంశమే ఉదాహరణ. సీఎం కేసీఆర్ నిర్ణయంతో వేలాది మంది మహిళామణులు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రాజ్యాధికారాన్ని చేపట్టారు. చట్టసభల్లోనూ ఇదేరకమైన బిల్లును కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకురావాలనే డిమాండ్.. కవిత చేపట్టిన దీక్షతో మరింత తీవ్రమైంది.
మోదీకి మహిళల ఉసురు తగులుతది..
అధికారంలోకి రాకముందు 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఇష్టం వచ్చినట్లు హామీలిచ్చి.. ఇప్పుడు మహిళా లోకాన్ని బీజేపీ దగా చేస్తున్నది. కవిత సారథ్యంలో ఉద్యమానికి ఊపిరి వచ్చినట్లయ్యింది. ఇచ్చిన హామీ నెరవేర్చడంలో విఫలమైన ప్రధాని మోదీకి దేశంలోని మహిళల ఉసురు తప్పక తగులుతది.
– నరాల సుధాకర్, భారత్ జాగృతి రాష్ట్ర కార్యదర్శి
దీక్షకు దేశవ్యాప్త మద్దతు..
జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన నిరాహార దీక్షకు దేశవ్యాప్త మద్దతు లభించింది. జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా జరిగిన ఆందోళన కార్యక్రమానికి అనేక రాష్ర్టాల నుంచి మహిళా సంఘాల నాయకులు తరలివచ్చారు. ఈ ధర్నాతో బీజేపీలో వణుకు పుడుతున్నది.
– అవంతి రావు, భారత్ జాగృతి అధ్యక్షుడు, నిజామాబాద్ జిల్లా
చెల్లని ఆటంకాల కుట్రలు..
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం భారత్ జాగృతి వ్యవస్థాపకురా లు కవిత చేపట్టిన ఆందోళనతో బీజేపీ ఆగమాగమైంది. అందుకే జంతర్మంతర్ వద్ద అనుమతి విషయంలో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి విఫలమైంది. కానీ ప్రజలు భారీగా రావడంతో దీక్ష సక్సెస్ అయ్యింది. బీజేపీకి త్వరలోనే సరైన గుణపాఠం తప్పదు.
– లక్ష్మీనారాయణ భరధ్వాజ్, భారత్ జాగృతి రాష్ట్ర నాయకుడు
పోరాడుతున్నందుకే కేసులు..
ధర్పల్లి : బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలు, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత పోరాడుతున్నందుకే కక్ష సాధింపుతో కేసులు నమోదు చేయిస్తున్నారు. మహిళలు, మహిళా సాధికారత కోసం దశాబ్ద కాలంగా ఉద్యమిస్తున్న కవిత ప్రయత్నాలను అణిచివేయాలని చూస్తే మహిళా లోకం ఊరుకోదు. బీజేపీపై తిరుగుబాటు చేసి తగిన బుద్ధి చెబుతాం. అదిరేది లేదు, బెదిరేది లేదు.. కవిత వెంటే ఉంటాం.
– నల్ల సారిక, ఎంపీపీ, ధర్పల్లి
మహిళా బిల్లును ప్రవేశపెట్టాల్సిందే..
చట్టసభల్లో మహిళకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలి. బిల్లు ఆమోదం పొందే వరకు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృ తం చేస్తాం. మాలాంటి సామాన్య మహిళల్లో పోరాట స్ఫూర్తిని నింపి ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దిన ఆమెపై బూటకపు కేసులు నమోదు చేస్తున్నారు. బీజేపీకి దేశ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. బీజేపీ కక్షసాధింపు రాజకీయాలను ప్రజలకు వివరిస్తాం.
– ఢీకొండ సరిత, ఎంపీటీసీ, లోలం
మహిళల కోసం ఉద్యమించడం హర్షణీయం..
తెలంగాణలో పుట్టి ఆడపడుచుల ఖ్యాతిని ఢిల్లీ స్థాయికి వ్యాపింపజేసిన ఎమ్మెల్సీ కవిత కృషి హర్షణీయం. మహిళా రిజర్వేషన్ల కోసం పాటుపడుతున్న ఆమెకు మేమంతా అండగా నిలుస్తాం. మా కోసం పాటుపడుతున్న కవితకు ఎన్ని కష్టాలు ఎదురైనా తోడుగా ఉంటాం. ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.
– బాదావత్ రేనాబాయి, ఇందల్వాయి ఎంపీపీ రమేశ్నాయక్ సతీమణి